Jump to content

Recommended Posts

Posted
బెజవాడ మెట్రోకు స్వస్తి?
 
 
  • విజయవాడలో రెండంతస్తుల ఫ్లై ఓవర్లు?
  • సగం ఖర్చుతోనే ఎక్కువ రవాణా
  • ఎలక్ట్రిక్‌ కార్ల యుగంలో అదే మేలు!
  • ప్రత్యామ్నాయ ప్రతిపాదనతో రావాలన్న సీఎం
  • విశాఖ మెట్రోకు మాత్రం సరే
  • పాఠశాలల హేతుబద్ధీకరణ వద్దన్న బాబు
అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలోని అతి పెద్ద పాజెక్టుల్లో ఒకటైన విజయవాడ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకనుందా..? గురువారం మంత్రివర్గ సమావేశంలో జరిగిన చర్చ ఈ దిశగా సంకేతాలిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే విజయవాడ మెట్రోకు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థపై చర్చకు తెరలేపారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు రుణ పరిమితికి సంబంధించిన ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు వచ్చినప్పుడు ఈ చర్చ జరిగింది. మెట్రో ప్రాజెక్టుకు సుమారు రూ. 7,200 కోట్ల వ్యయమవుతుందని, అందులో రూ.1200 కోట్లు భూసేకరణకే అవుతుందని అధికార వర్గాల సమాచారం. 15-20 కిలోమీటర్ల మెట్రో మార్గంకోసం ఇంత వ్యయం అవసరమా అనే చర్చ ఉన్నత స్థాయిలో జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేబినెట్‌ భేటీలో ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థపై మాట్లాడారు. రవాణా రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం వస్తోందని, ఎలక్ట్రిక్‌ కార్లు వచ్చేస్తున్నాయని, వాటివల్ల పొల్యూషన్‌ కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. మెట్రోకు బదులు రెండతస్తుల ఫ్లై ఓవరు నిర్మిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. దేనికెంత వ్యయమవుతుందో అధ్యయనం చేయాలని సూచించారు. మెట్రో కంటే ఎలివేటెడ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వల్ల ఎక్కువ రవాణా చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యయం కూడా మెట్రో ప్రాజెక్టులో సగానికి మించకపోవచ్చన్నారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని పురపాలక మంత్రి పి.నారాయణ బదులిచ్చారు. విశాఖపట్నానికి మాత్రం మెట్రో అవసరమని సీఎం అన్నారు.
 
రేషనలైజేషన్‌కు బ్రేకులు!
పాఠశాలల హేతుబద్ధీకరణకు ముఖ్యమంత్రి బ్రేకులు వేశారు. 19 మంది కంటే తక్కువ పిల్లలున్న పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలన్న విద్యా శాఖ ప్రతిపాదనకు ఎర్రజెండా ఊపారు. 10 మంది పిల్లలున్నా స్కూలును నడిపించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ పిల్లల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు చేయాలని, ఇందులో గ్రామస్తులనూ భాగస్వాములను చేయాలని సూచించారు. 10 మందికంటే తక్కువ పిల్లలుండి స్కూలు మూసివేత తప్పదనుకుంటే ప్రజలకు ఆ విషయం వివరించాలని, పిల్లలను చేర్పిస్తే పాఠశాల నిలబడుతుందనే విషయాన్ని చెప్పాలని అన్నారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా స్కూళ్ల మూసివేత తగదని చెప్పారు. ఈ అంశంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పలువురు మంత్రులు ఈ సందర్భంగా కేబినెట్‌ దృష్టికి తీసుకొచ్చారు. ‘మనం చాలాచోట్ల పాఠశాలలకు భవనాలు నిర్మించాం. ఇప్పుడు విద్యార్ధుల సంఖ్య పెరిగే సమయంలో పాఠశాలల్నే రద్దు చేయడం న్యాయం కాదు. దూరంగా ఉన్న స్కూళ్లలో విలీనం చేయడం వల్ల విద్యార్ధులు అక్కడికి వెళ్లకపోగా ప్రభుత్వ పాఠశాలలకు దూరమవుతారు’ అని చెప్పారు. దీనికి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బదులిస్తూ.. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. ఏ పరిస్థితుల్లో పాఠశాలల్ని విలీనం చేయాల్సి వస్తోందో ప్రజలకు వివరించారా అని సీఎం ప్రశ్నించారు. దీనికి విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌... తాను కొంత సమాచారం ఇచ్చానని చెప్పగా.. ఆ విషయం తన దృష్టికే రాలేదని చంద్రబాబు అన్నారు. ’ప్రజల్లో అవగాహన కల్పించకుండా పాఠశాలల హేతుబద్ధీకరణకు వెళ్లడం సరి కాదు. గతంలో ఇంగ్లిష్‌ మీడియం పెడుతామని జీవోలిచ్చారు. దానిపై విమర్శలు వచ్చాయి. మీరేదైనా నిర్ణయం చేస్తే ముందు జనంలో అవగాహన పెంచండి. మనం తీసుకునే నిర్టయాలు వ్యతిరేకతను పెంచకూడదు. పాఠశాలల విషయంలో హడావుడి నిర్ణయం వద్దు’ అని స్పష్టం చేశారు.
 
బీమా బ్రోకర్‌ ఫోన్‌ రికార్డు!
’చంద్రన్న బీమా’ పథకం లబ్దిదారుల్లో ఎవరైనా చనిపోతే తక్షణ సాయంగా అందించే రూ.5000లో లంచాలు తీసుకున్న ఓ వ్యక్తి చేత డబ్బు ఎలా తిప్పి ఇప్పించిందీ ముఖ్యమంత్రి తన సహచరులకు వివరించారు. ఇందుకోసం ఓ బ్రోకర్‌తో కాల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడిన ఫోన్‌ రికార్డును వినిపించారు. ఈ కాల్‌ సెంటర్‌ పనితీరును రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ చూస్తున్న అధికారులు రాజశేఖర్‌, ఎ. బాబు వివరించారు. కాల్‌ సెంటర్‌ బాగా పని చేస్తోందని సీఎం అభినందించారు. చౌక దుకాణాలనుంచి పంచదార, కిరోసిన్‌ కూడా దూరమవుతున్న నేపథ్యంలో ఒక్క బియ్యం పంపిణీతోనే డీలర్ల మనుగడ ఎలాగో అధ్యయనం చేయాలని ఆదేశించారు.
 
సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును మంజూరు చేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి అయ్యన్నపాత్రుడు తీర్మానం ప్రతిపాదించారు. కాగా.. నవనిర్మాణ దీక్షలు జరిగే వారం రోజుల్లో 3-4 రోజులు మా జిల్లాలోనే ఉంటామని అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించగా.. ’నువ్వు కావాలంటే ఉండు. అందరూ ఉండరు’ అని బాబు చెప్పారు. సొంత జిల్లాలో ఒక రోజు పాల్గొని.. మిగిలిన రోజుల్లో ఇన్‌చార్జి జిల్లాకు వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి చెప్పారు.

 

Posted

Vizag metro eppudo 5-6 years back start avvalsindi, ippatiki okka adugu munduku padaledu. 3 years Vijayawada metro meeda intha gola chesi ippudu aapithe emiti use?

Posted

Vijayawada ki Outer Ring road padithe motham Set avtadhii.. Congi govt 10 years peekindhi em ledhu.. Ippudu Inko 3 years waste ayyayi..

 

First 2002 lo Road padatadhii ani first news vachindhi..

Posted

Chesthe cheyyandi lekapothe maneyyandi, roads widening & fly overs wherever required complete cheyyandi before 2019 elections. 2019 lo govt. vasthe metro/some other project can be taken up.

 

Mundu aa Durga Gudi & Benz circle flyovers fast gaa complete cheyyandi.

Posted
అమరావతి ప్రజలకు శుభవార్త..!
 
 
636326926821257026.jpg
  • మెట్రో స్థానంలో కొత్త ప్రతిపాదన
  • వారం రోజుల్లో సీఎం చంద్రబాబుకు నివేదన
  • మెట్రో వ్యయంలో పదో వంతు వ్యయం
  • భూసేకరణ అవసరం లేదు...
తక్కువ ఖర్చు... ప్రమాద రహితం... పర్యావరణహితం... లక్ష్యంగా మెట్రోకు ప్రత్యామ్నాయం రూపుదిద్దుకుంటోంది. మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న మెట్రో ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కనపెట్టి దాని స్థానంలో రైల్‌/బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం వర్కవుట్‌ కాబోతోంది. దీనికి అవసరమైన నివేదికలు కూడా సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం దీనిపై స్పష్టత రానుంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

గత కేబినెట్‌ మీటింగ్‌లో విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి మెట్రోకు బదులుగా ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టి సారించాల్సిందిగా మునిసిపల్‌ మంత్రి నారాయణను ఆదేశించిన సంగతి తెలిసిందే. మునిసిపల్‌ మంత్రి నారాయణ దీనికి సంబంధించి వెంటనే తగిన అధ్యయనంతో ప్రతిపాదనలు రూపొందించవలసిందిగా ఏఎంఆర్‌సీకే బాధ్యతలు అప్పగించారు. ఏఎంఆర్‌సీ రామకృష్ణా రెడ్డి వివిధ దేశాలలో అమలౌతున్న బాటరీ, ఎలక్ర్టిక్‌ బస్‌ రైల్వే ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌లను అధ్యయనం చేసిన మీదట విజయవాడకు మెట్రో స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏది సరిపోతుందన్న దానిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను రూపొందించారు. దీనిని ముఖ్యమంత్రికి చూపించిన తర్వాత.. ఆయన చెప్పే సూచనలు, సలహాలను బట్టి ఈ ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి మరోవైపు దానికి అనుగుణమైన ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు భవితవ్యాన్ని తేల్చాల్సిన బాధ్యత కూడా ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
 
‘మెట్రో’కు ప్రత్యామ్నాయంగా ఏఎంఆర్‌సీ సిద్ధం చేసిన ప్రతిపాదనల మేరకు చూస్తే విదేశాలలో ఈ విధానం సాధారణ రోడ్లపై ఉండగా.. విజయవాడలో నేలపై ఇప్పుడున్న రోడ్లపై డెడికేటెడ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయటం అసాధ్యం కాబట్టి ఎలివేటెడ్‌ విధానంలో ఉండాలని నిర్ణయించటం జరిగింది. దీనికి మద్దతుగా ఇప్పటికే బీఆర్‌టీఎస్‌ విఫలం అయిన నేపథ్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ. 7212 కోట్ల ఖర్చు కానుంది.

మొత్తం 26 కిలోమీటర్ల నిడివిలో.. కిలోమీటర్‌కు రూ.250 కోట్ల వ్యయం అవుతుంది. మెట్రోకు ప్రత్యామ్నాయంగా ఏఎంఆర్‌సీ ప్రతిపాదిస్తున్న ఎలివేటెడ్‌ బస్‌/రైల్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు మెట్రో ప్రాజెక్టులో ఒకటో వంతు కూడా కాదు. కిలో మీటర్‌కు రూ.70 - 80 కోట్ల వ్యయం మాత్రమే అవుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా బస్‌ కానీ, రైల్‌ కానీ మూడు నుంచి అవసరాన్ని బట్టి కోచ్‌లను అనుసంధానం చేసుకోవచ్చు. ఒక్కో కోచ్‌లో 100 మంది ప్రయాణికులు పడతారు. డ్రైవర్‌ లెస్‌, ట్రాక్‌ లెస్‌ విధానంలో ఉంటుంది. ఎలివేటెడ్‌ మార్గంలో అమర్చే మాగ్నటిక్స్‌, సెన్సర్స్‌ ద్వారా డ్రైవర్‌లె‌స్‌గా ఇవి నడుస్తాయి.
 
భూ సేకరణ భారం కూడా తగ్గుతుంది. విజయవాడ నగరంలో భవన నిర్మాణాలను కూడా కదలించాల్సిన అవసరం ఉండదు. విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు అన్నది.. రాష్ట్ర విభజన నేపథ్యంలో, విజయవాడ నగరానికి మంజూరు చేసిన ఒక్కగానొక్క విభజన హామీ ప్రాజెక్టు. ఇది సాకారం అవుతుందని మూడు సంవత్సరాలుగా నగర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. తీరా ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఆలోచించటం తప్పులేదు కానీ, మెట్రో ప్రాజెక్టుకు స్వస్థి పలికే లోపే నూతన ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే ఇన్నాళ్లూ సెంటిమెంట్‌గా భావిస్తూ వచ్చిన ప్రజల నుంచి ఆందోళనలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది.
Posted

విజయవాడ మెట్రోకు ప్రత్యామ్నాయం

ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఏఎంఆర్‌సీ

రేపు ఉన్నతస్థాయి సమావేశం

నిర్ణయించనున్న ముఖ్యమంత్రి

ఈనాడు - అమరావతి

విజయవాడ మెట్రో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొనడంతో ప్రత్యామ్నాయంపై అధ్యయనం కొనసాగుతోంది. మెట్రో కన్నా తక్కువ వ్యయంతో రవాణా వ్యవస్థను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే క్రమంలో ఎత్తయిన మార్గంలో (ఎలివేటెడ్‌) రైలు/బస్సులను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మేరకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఎండీ రామకృష్ణారెడ్డి రూపొందించిన అధ్యయన నివేదికను సోమవారం ముఖ్యమంత్రికి అందించనున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో మెట్రోపై నిర్ణయం వచ్చే అవకాశాలున్నాయి.

వూరిస్తున్న ప్రాజెక్టు

మూడేళ్లుగా వూరిస్తున్న మెట్రోకు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. నగరానికి మెట్రో స్థాయి లేదని, అంత వ్యయంతో నిర్మాణం అనవసరమనే వాదనలున్నాయి. ప్రైవేటు భూముల సేకరణలోనూ ఇబ్బందులున్నాయి. అభివృద్ధి చెందిన నగరాల్లో ఇప్పటికే ఎలివేటెడ్‌ కారిడార్లపై ఎలక్ట్రికల్‌ బస్సు/రైలును ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. వీటిని వాడాలనేది ముఖ్యమంత్రి అభిప్రాయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తక్కువ వ్యయంతో..!

విజయవాడకు రాజధాని హంగులు రావడంతో పట్టుబట్టి మెట్రోను మంజూరు చేయించారు. రూ.ఆరు వేల కోట్లతో దీన్ని నిర్మించేందుకు ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. ప్రస్తుతం దీని వ్యయం రూ.7,212 కోట్లకు చేరుకుంది. దీనికి రుణం ఇచ్చేందుకు మొదట జైకా ముందుకు వచ్చింది. ఆ సంస్థ పలు షరతులు పెట్టింది. ఇదే సమయంలో జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందిన రెండు సంస్థలు రూ.3800 కోట్ల రుణమిచ్చేందుకు అంగీకరించాయి. గతంలో ఒకసారి మెట్రో టెండర్లను రద్దు చేసిన డీఎంఆర్‌సీ తాజాగా మరోసారి రద్దు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టమని తేలిపోయింది. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండటం, ఆదాయం తక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిసి ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

* కారిడార్లు నిర్మించి వాటిపై ప్రత్యేకంగా రైలు తరహాలో నడిచే బస్సులను ఏర్పాటుచేస్తారు. మూడు కోచ్‌ల మాదిరి బస్సులుంటాయి. ఇవి 200 మంది ప్రయాణికులను చేరవేస్తాయి.

* ఈ తరహా రవాణా వ్యవస్థ మన దేశంలో ఇంకా రాలేదు. కౌలాలంపూర్‌లో పది కిలోమీటర్లు బీఆర్‌టీఎస్‌ నిర్వహణలో ఉంది. బ్రెజిల్‌, ఇతర నగరాల్లోనూ ఈ తరహా ఎలివేటెడ్‌ బస్సు/రైలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో కారిడార్ల బీఆర్‌టీఎస్‌కు రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

* విజయవాడ మెట్రోకు 78 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనికి రూ.700 కోట్లు ఖర్చవుతుంది. బీఆర్‌టీఎస్‌కు కేవలం 15 ఎకరాలు సరిపోతుందని భావిస్తున్నారు. నిడమానూరులో మెట్రో కోచ్‌ కోసం దాదాపు 50 ఎకరాలు తీసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనిపై వ్యతిరేకత వస్తోంది. ఒక్క స్టేషన్‌కు 40 సెంట్ల భూమి అవసరం. బీఆర్‌టీఎస్‌కు అంత అవసరం లేదని నివేదించారు.

* కొత్త విధానంలో కాలుష్యం ఉండదు. రోడ్డు ప్రమాదాలు జరగవు. ఎలివేటెడ్‌ కారిడార్‌పై రైలు/బస్సు మినహా ఇతర వాహనాలను అనుమతించరు.

* ప్రస్తుతం ప్రతిపాదిత మెట్రో మార్గం కాకుండానే నిడమానూరు నుంచి గన్నవరం, పీఎన్‌బీ నుంచి అమరావతికి బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ నిర్మించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేవలం రూ.ఐదు వేల కోట్లతో దీన్ని నిర్మించే అవకాశం ఉంది. తక్కువ వ్యయంతోనే ఇతర అనుసంధాన మార్గాల్లోనూ కారిడార్లు నిర్మించే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు.

* భవిష్యత్తులో ఇవే కారిడార్లను తక్కువ వ్యయంతో మెట్రో రైలు మార్గాలుగా మార్చుకోవచ్చని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే చర్యలుంటాయని మెట్రో రైలు ఎండీ రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...