అప్పుడే మొదలైందా?: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీకి అందిన ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదులు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినఅవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ACB)కి ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. నకిలీ ఎస్టిమేషన్లు, ఎక్కువ కోట్ చేయడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కల్వకుంట్ల కవితతోపాటు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు రాపోలు భాస్కర్. వీరితోపాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.
తాగు, సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో మాజీ సీఎం కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న రాపోలు భాస్కర్.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. దీనిపై ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది త్వరలోనే తేలనుంది.
. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫిర్యాదు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని, అవినీతి డబ్బులను తిరిగి ప్రజలకు చేరేలా చూస్తామని పదే పదే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.