కేంద్రం యూటర్న్! 02-12-2018 02:09:01
పోలవరంపై పిల్లిమొగ్గ.. 2 రోజుల్లోనే మారిన మాట
బయటపడ్డ మోదీ సర్కారు కపటం
ప్రాజెక్టుపై వెల్లడైన అయిష్టత
సుప్రీంలో ‘ప్రజాభిప్రాయానికి’ ఓకే
అఫిడవిట్ నాటికి అంతా తూచ్
అబ్బే.. మేం చేయం అంటూ వాంగ్మూలం
‘జూనియర్’కు అవగాహన లేకే ముందు ఓకే అన్నారంటూ వింత వాదన
ఒడిసాపై తప్పు మోపే ప్రయత్నం
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్లేటు తిరగేసింది. ఒడిసా, ఛత్తీ్సగఢ్లో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణకు సుప్రీంకోర్టులో అంగీకరించిన కేంద్రం... అఫిడవిట్ దాకా వచ్చేసరికి మాట మార్చింది. ‘అబ్బే... అప్పుడు మా వాళ్లు అనాలోచితంగా ఆ హామీ ఇచ్చారు. దానిని పట్టించుకోవద్దు’ అని న్యాయస్థానాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పనులు చేస్తున్నారంటూ ఒడిసా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై గురువారం జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
నిబంధనల ప్రకారం ఒడిసా, ఛత్తీ్సగఢ్లే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని... దీనిపై ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీ తెలిపారు. ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ కూడా ఇదే విషయం చెప్పారు. ‘‘ప్రజాభిప్రాయ సేకరణను ముంపు ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రమే చేపట్టాలి. దీనిపై ఒడిసా సర్కారుకు పలుమార్లు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రక్రియకు అవసరమయ్యే ఖర్చును కూడా ఆ రాష్ట్ర ఖజానాలో జమ చేశాం. అయినా పట్టించుకోలేదు’’ అని వివరించారు. ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని... కేంద్రం కూడా పట్టించుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రమే స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న కేంద్ర న్యాయవాది ఖాద్రీ... అందుకు అంగీకరించారు.
దీంతో... ప్రజాభిప్రాయ సేకరణ విధి విధానాలు తెలుపుతూ శనివారం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డైరెక్టర్ సునామని కెర్కెట్టా శనివారం అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే... ప్రజాభిపాయ్ర సేకరణపై గురువారం నాటి వైఖరికి పూర్తి భిన్నంగా స్పందించారు. దీంతో కేంద్రానికి సంబంధం లేదనేలా వ్యవహరించారు. ‘ఒడిసా, ఛత్తీ్సగఢ్లలో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకకరణ జరుపుతామని మా తరఫు న్యాయవాది చెప్పారు. అయితే... దీనిపై సీనియర్ అధికారుల సూచనలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా... ఒక జూనియర్ లెవెల్ అధికారితో మాట్లాడి కోర్టుకు అనాలోచితంగా హామీ ఇచ్చారు. అందువల్ల ఇది అనుకోకుండా చెప్పిన మాటగా భావించి మన్నించండి’’ అని కోరారు. అంటే, కీలకమైన ఈ ప్రక్రియపై కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నమాట!
ఇది మరో షాక్...: ఒడిసా, ఛత్తీ్సగఢ్లలో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న సుప్రీం ఆదేశాలను ఏపీ సాగునీటి శాఖ వర్గాలు స్వాగతించాయి. ‘‘నిబంధనల ప్రకారం ఒడిసా సర్కారే ఆ పని చేయాలి. ఒడిసా దీనిని పట్టించుకోలేదు. కేంద్రమూ స్పందించలేదు. ఇప్పుడు సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు లైన్ క్లియర్ అయ్యింది’’ అని గురువారం అధికారవర్గాలు తెలిపాయి. శనివారం సీన్ మారిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.
ఆది నుంచీ ఇంతే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పొరుగు రాష్ట్రాలైన ఒడిసా, ఛత్తీ్సగఢ్ తొలినుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును అనుమతించవద్దంటూ, ఛత్తీ్సగఢ్ ప్రభుత్వం 2006లో సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ఈ రాష్ట్రానికి ఒడిసా జతకలిసింది. ముంపు ప్రాంతాల పరిహారం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నదని ఈ రెండు రాష్ట్రాలూ సుప్రీం కోర్టులో వాదిస్తూ వస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సంబంధిత జిల్లా యంత్రాంగంతో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలని .. ఇందుకయ్యే వ్యయాన్ని తాము భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం.. ఒడిసా, ఛత్తీ్సగఢ్ రాష్ట్రాలకు లిఖితపూర్వకంగా పలు దఫాలు అంగీకారాన్ని తెలిపింది. అయినా, ఆ రాష్ట్రాలు న్యాయస్థానంలో ఉన్న కేసును బూచిగా చూపిస్తూ ..తాము ప్రజాభిప్రాయ సేకరణను చేయలేమంటూ తప్పించుకుంటూ వచ్చాయి. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ జరగనందున .. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నాయి.
2014లో రాష్ట్ర విభజన జరిగాక .. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం సాగు నీటి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. దీంతో .. ఈ ప్రాజెక్టును 100 శాతం పూర్తి చేసే బాధ్యత రాష్ట్రం నుంచి కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన పర్యావరణ- అటవీ అనుమతులూ, డిజైన్ల ఆమోదం, సరిహద్దు రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, నష్టపరిహారం చెల్లంపు, పునరావాస కార్యక్రమాలు, నిధుల విడుదల వంటి అంశాలన్నీ కేంద్రం భుజస్కందాలపైనే పడ్డాయి. జాతీయ హోదా ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణానికి అవసరమయ్యే అన్ని కార్యక్రమాలనూ చేపట్టాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై పడింది. అయినా, ప్రాజెక్టు నిర్మాణంలో అతి ముఖ్యమైన ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టాలన్న అత్యంత మౌలికమైన అంశంపై రెండు రోజుల్లోనే రెండు రకాల మాటలు చెప్పడం, కోర్టు సాక్షిగా పిల్లిమొగ్గలు వేయడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. తాజా పరిణామాల వెనుక రాజకీయకక్ష సాధింపు ధోరణ కనిపిస్తోందన్న భావన వ్యక్తం అవుతోంది. రాష్ట్రానికి జీవనాడిలాంటి .. పోలవరం ప్రాజెక్టును ముందుకు కదలకుండా కట్టిపడేసేలా .. ప్రజాభిప్రాయ సేకరణ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవడమే దీనికి నిదర్శమన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రాజకీయపరమైన విభేదాలకు తోడు, ఛత్తీ్సగఢ్, ఒడిసాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బలపడే ఆలోచన కూడా తోడయినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.