దూసుకుపోతున్న ఆర్టీసీ పార్శిల్
రెండు వారాల్లో 2.50 కోట్ల ఆదాయం
పెరుగుతున్న లగేజీ బుకింగ్స్
ధర తక్కువ.. ఉపయోగించుకోండి: ఎండీ సాంబశివరావు
హైదరాబాద్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): రోడ్డు రవాణా సంస్థ ప్రవేశ పెట్టిన పార్శిల్ సర్వీస్ రాష్ట్రంలో దూసుకుపోతోంది. ప్రైవేటు పార్శిల్తో పోల్చుకుంటే ధర తక్కువ కావడంతో బుకింగ్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. జూన 1న ప్రారంభించిన ఆర్టీసీ పార్శిల్ సర్వీస్కు తొలివారంలోనే రోజుకు రూ.10 లక్షల కలెక్షన రాగా రెండో వారం ముగిసే నాటికి రోజుకు రూ.25 లక్షలకు చేరింది. మొత్తం మీద రెండు వారాల్లోనే ఆర్టీసీకి పార్శిల్, కొరియర్ ద్వారా రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సంస్థ ఎండీ సాంబశివరావు తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాల కన్నా మరింత ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశముందన్నారు. బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకు మాత్రమే ఉన్న పార్శిల్ సర్వీసును భవిష్యత్తులో ఇంటికి చేర్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో 12,600 బస్సులున్న ఆర్టీసీలో కొన్నేళ్లుగా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని తగ్గించుకునేందుకు యాజమాన్యం బస్ చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం వేస్తూ వస్తోంది. ప్రస్తుత ఎండీ సాంబశివరావు సైతం మొదట్లో బస్సు చార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం చంద్రబాబు అందుకు ససేమిరా అనడంతో రెండు, మూడు సార్లు ప్రయత్నించి చివరికి నామమాత్రపు చార్జీలు పెంచారు. అయితే, సిబ్బందికి 43ు ఫిట్మెంట్ పెంచడంతో ఆ మొత్తం ఎందుకూ సరిపోలేదు. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు.. సూచించారు. దీంతో ఆర్టీసీ పార్శిల్ సర్వీస్ ప్రారంభమైంది.
ఆదాయ మార్గాలపై దృష్టి
ఆర్టీసీలో సంస్కరణలు ప్రారంభించిన యాజమాన్యం పలు ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. బస్సులతో పాటు బస్టాండ్లలో సౌకర్యాలు మెరుగు పరిచి ప్రయాణికులను ఆకట్టుకోవడం వరకు ఎండీ పలు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ స్థలాలను లీజుకివ్వడం, బస్టాండు ప్రాంగణంలో మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణం ఇలా పలు మార్గాలను అన్వేషించిన యాజమాన్యం.. సొంతంగా పార్శిల్ సర్వీసును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీతో కాంట్రాక్టు తీసుకొని పన్నెండున్నర వేల బస్సులను వినియోగించుకొంటున్న ఏఎనఎల్ పార్శిల్ సర్వీస్ ఏటా ఎంతమేర వ్యాపారం చేస్తోంది. సంస్థకు ఎంత చెల్లిస్తోందన్న దానిపై ఎండీ ఆరా తీశారు. వ్యాపారం వందల కోట్లలో ఉండగా ఆర్టీసీకి దక్కుతున్నది కేవలం రూ.9 కోట్లు మాత్రమేనని తేలింది. దీంతో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల ద్వారా పార్శిల్, అన్ని బస్సుల ద్వారా కొరియర్ సర్వీసు ప్రారంభించాలని లాభ నష్టాలను యాజమాన్యం అంచనావేసింది. ఏఎనఎల్తోపాటు బయట ప్రైవేటు పార్శిల్ సర్వీసుల ధరలను పరిశీలించింది. మొదట్లో రూ.332 కోట్ల వరకు ఆదాయం వచ్చినా ఆ తర్వాత ఏటా రూ.వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
సిబ్బంది ఎంపికలోనే అప్రమత్తం
ఎక్కడికక్కడ బస్ డిపో స్థాయిలో పార్శిల్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి రీజియన్ల వారీగా అధికారులను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. రీజియన స్థాయి అధికారులకు కొత్త కార్లు కొనిచ్చి వ్యాపారం అభివృద్ధి చేయాలని టార్గెట్లు నిర్దేశించారు. సిబ్బందిని సైతం మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి జూన 1 నుంచి పూర్తిస్థాయిలో పార్శిల్, కొరియర్ సేవలు ప్రారంభించారు. మొదట్లో రోజూ రూ.3 లక్షల కలెక్షనతో ప్రారంభమైన వ్యాపారం వారం రోజుల్లోనే రూ.10 లక్షలకు, రెండు వారాల్లో రూ.25 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ఏఎనఎల్ ఉండటం వల్ల పార్శిల్, కొరియర్ ఆదాయం రూ.500 కోట్లకు మించబోదని, వచ్చే ఏడాది సెప్టెంబర్తో ఏఎనఎల్ గడువు ముగుస్తున్నందున ఆర్టీసీకి పార్శిల్ సేవల ద్వారా ఏటా రూ.1000 కోట్లు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
చౌక ధరలు!
రాష్ట్రంలో పలు ప్రైవేటు కొరియర్, పార్శిల్ సంస్థలు చేస్తున్న చార్జీల కంటే ఆర్టీసీలో 20ుకి పైగా ధర తక్కువగా ఉంది. యాభై కిలోల బరువున్న బస్తాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే ప్రైవేటు పార్శిల్లో వేస్తున్న ధరకన్నా ఆర్టీసీ బాగా తక్కువ వసూలు చేస్తోంది. ఆర్టీసీ సేకరించిన సమాచారం ప్రకారం ప్రైవేటు పార్శిల్లో యాభై కిలోల బస్తాకు కిలోమీటరుకు 44 పైసల నుంచి అర్థరూపాయి వసూలు చేస్తున్నారు. అదే ఆర్టీసీలో 30 పైసలే. అంటే ప్రైవేటలో రూ.300కు పైగా అయ్యే ఖర్చు ఆర్టీసీలో రూ.200ల కన్నా తక్కువే అవుతుందని సంస్థ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఆర్టీసీ కొరియర్, పార్శిల్ సేవల్ని వినియోగించుకోవాలని ఎండీ సాంబశివరావు ప్రజలకు విన్నవించారు.