http://www.andhrajyothy.com/artical?SID=709625
చిన్న స్థలంలో.. అందమైన ఇల్లు! 09-02-2019 07:45:50
రాజధానిలో చిన్నప్లాట్ల కోసం ఉచిత ఇంటి ప్లాన్లు
పలు డిజైన్లను సిద్ధం చేయిస్తున్న ఏపీసీఆర్డీఏ
ఆర్కిటెక్చర్ విద్యార్థుల నుంచి ఎంట్రీలకు ఆహ్వానం ఫ వాటిల్లో అత్యుత్తమమైన 6 డిజైన్ల ఎంపికకు జ్యూరీ
విజేతలకు ప్రోత్సాహంగా నగదు బహుమతులు
అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతిలో చిన్న ప్లాట్లు.. అంటే 100 నుంచి 250 చదరపు గజాల మధ్య ఇళ్ల స్థలాలు కలిగిన వారు కూడా సుందరమైన గృహాలు నిర్మించుకు నేందుకు వీలుగా ఏపీసీఆర్డీఏ ఆకర్షణీయమైన ప్లాన్లను అందించనుంది. పెద్ద ప్లాట్లున్న వారు నిపుణులైన ఆర్కిటెక్ట్లతో ఖర్చుకు వెనకాడకుండా ఇంటిప్లాన్లు తయారుచేయిస్తారు. కానీ చిన్న ప్లాట్లున్నవారు ఖర్చుకు వెనకాడి కొందరు, అవగాహన లేక మరికొందరు అంతగా పరిజ్ఞానం లేని మేస్ర్తీలతోనే ఇంటి ప్లాన్లు వేయిస్తారు. అలా కట్టిన ఇళ్లు అంతగా ఆకర్షణీయంగా ఉండవు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ పరిస్థితిని నిరోధిం చేందుకు చిన్న ప్లాట్లలోనూ అందంగా కనిపించేలా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, తద్వారా రాజధాని సౌందర్యాన్ని మరింత పెంచాలని సీఆర్డీఏ భావించింది. దీనికోసం తానే చిన్న ప్లాట్ల యజమానులకు నచ్చేలా ఇంటి ప్లాన్లను తయారుచేసేందుకు సంకల్పించింది.
ఆర్కిటెక్చర్ విద్యార్థులకు పోటీ..!
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే అందులోని ప్రతి నిర్మాణమూ ఆకట్టుకునేలా ఉండాలని సీఎం చంద్రబాబు తరచూ చెబు తుంటారు. ఆయన మాటల స్ఫూర్తిగా సీఆర్డీయే ముందుకు కదిలింది.
చిన్న ప్లాట్లలో కట్టే ఇళ్లు కూడా సుందరంగా ఉండేందుకు వాటి ప్లాన్ల తయారీలో యువ ఆర్కిటెక్ట్లను భాగస్వాముల్ని చేసింది. అమరావతి స్వరూప స్వభావాలు, భవన నిర్మాణాలకు ఉద్దేశించిన నిబంధనలు వారికి తెలియజేస్తూ, వాటికి తగినట్లుగా ఇంటి ప్లాన్లను రూపొందిం చాలని కోరుతూ దేశవ్యాప్త పోటీ నిర్వహించింది. ప్రముఖ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థుల నుంచి ఎంట్రీలు ఆహ్వా నించింది. ఈ పోటీలో ప్రథమస్థానం పొందిన ఎంట్రీకి రూ.1 లక్ష, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వాటికి వరుసగా రూ.50 వేలు, రూ.25 వేలు, ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులుగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రక టించింది. దీంతో ఆర్కిటెక్ట్ విద్యార్థులు ఉత్సాహంగా తమ ప్లాన్లను సీఆర్డీఏకు పంపారు. అలా వచ్చిన 105 ఎంట్రీలను నిశితంగా పరిశీలించిన అధికారులు, నిపుణులు వాటిలో 12 ప్లాన్లను షార్ట్లిస్ట్ చేశారు. వీటిని సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్ నిపుణులైన ఐదుగురు సభ్యులతో కూడిన జ్యూరీ పరిశీలించి, వాటిల్లో అత్యుత్తమమైన 6 ప్లాన్లను ఎంపిక చేయనుంది.
విజేతలను ప్రకటించే ముందు షార్ట్లిస్ట్ చేసిన 12 ప్లాన్లను ఈ నెల 13న విజయవాడలో ప్రారంభం కానున్న ‘సంతోష నగరాల సదస్సు’లో రాజధాని రైతుల సందర్శనార్ధం ఉంచుతారు. వాటిపై స్పందనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం విజేతలను ప్రకటిస్తారు.
సీఆర్డీఏ వెబ్సైట్లో ప్లాన్లు..
విజేతలు గీసిన 6 ప్లాన్లను మరింత పక్కాగా, లోపరహితంగా మలిచేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేసిన అనంతరం వాటిని సీఆర్డీఏ తన వెబ్సైట్లో ఉంచనుంది. రాజధానిలో చిన్న ప్లాట్లున్న ఎవరైనా వాటిని ఉచితంగా వాడుకునే అవకాశం కల్పిస్తారు.