టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 174వ రోజున 2,300 కిమీ మైలురాయికి చేరుకొంది. ఈ సందర్భంగా నారా లోకేష్ వినుకొండ నియోజకవర్గంలోని కొండ్రముట్ల బొల్లాపల్లి మండలంలో శిలాఫలకం ఆవిష్కరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరికపూడిశెల ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుని పూర్తిచేస్తానని నారా లోకేష్ ఇచ్చిన హామీని దానిలో వ్రాయించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే పల్నాడు జిల్లాలో సుమారు 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బొల్లాపల్లి మండలవాసులకు ఆ సమస్య కూడా శాస్వితంగా పరిష్కారం అవుతుంది.
నారా లోకేష్ పాదయాత్రలో వృద్ధులు, మహిళలు, రైతులు… ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. వినుకొండలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ చోట వృద్ద మహిళలు నిలబడి ఉండటం చూసి నారా లోకేష్ వారివద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించగా, వారిలో ఓ వృద్ధురాలు నారా లోకేష్ చేతిమీద ముద్దుపెట్టుకొని ఆశీర్వదించింది. నారా లోకేష్ వారి సమస్యలు అడిగి శ్రద్దగా విని వారు చెప్పిన కొన్ని విషయాలను నోట్ చేసుకొన్నారు.
మరోచోట గ్రామీణ మహిళలు ఆయనకు ఎదురేగి కల్మషం లేని చిర్నవ్వులతో స్వాగతం పలికారు. ఎప్పటిలాగే వారిలో చాలా మంది నారా లోకేష్ చేతులు పట్టుకొని ఆప్యాయం మాట్లాడుతుండగా, నారా లోకేష్ అక్కడే ఉన్న ఓ మహిళ చేతిలో పిల్లాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ‘మీ అబ్బాయిని నాతో తీసుకుపోతున్నా…’ అంటూ ఆ బాబు చేత తల్లికి టాటా చెప్పిస్తుంటే, ఆమెతో సహా అక్కడున్న మహిళలందరూ కూడా ఆనందంతో మురిసిపోతూ ‘అలాగే..’ అన్నట్లు చేతులు ఊపి టాటా చెప్పారు. ఆ పసిపిల్లాడు ఒక్క క్షణంలోనే నారా లోకేష్ భుజం మీద ఆదమరిచి నిద్రపోతుండటం చూసి ఆ పిల్లాడి తల్లి, అక్కడున్న మహిళలు మనసారా నవ్వుకొన్నారు. కొందరు ఆ అపురూప దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసుకొన్నారు.
నారా లోకేష్ చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నారు కనుక రాష్ట్ర ప్రజలందరికీ ఆయన సుపరిచితుడే. కానీ ఆయన గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. యువగళం పాదయాత్ర ప్రారంభించిన తర్వాతనే నారా లోకేష్ పరిపూర్ణ వ్యక్తిత్వం ఆవిష్కృతమైంది.
అన్ని వర్గాల ప్రజల ఆదరణ, ఆప్యాయత, ఆయనపై వారి నమ్మకం చూస్తున్నప్పుడు నారా లోకేష్ ప్రజల మనసులలో ఎంతగా చోటు సంపాదించుకొన్నారో అర్దవుతోంది. ఈ చిన్న వీడియో క్లిప్ చూస్తే ఓ రాజకీయ నాయకుడికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుందని అనిపించకమానదు.