June 4, 20188 yr Author అందమైన ఆహ్లాదం!04-06-2018 10:46:31 కోనసీమ గోదావరిలో త్వరలో హౌస్ బోట్లు కేరళ తరహా టూరిజం సోంపల్లి నుంచి దిండి.. అంతర్వేది వరకు ఓ సర్క్యూట్ పాశర్లపూడి నుంచి ఆదుర్రు.. అప్పన్నపల్లి వరకు మరొకటి ఈవారంలోనే టెండర్లు రాజమహేంద్రవరం: గోదావరి జలవినోదానికి కేంద్రంగా మారుతోంది. ఇదివరకు రాకపోకలు, వేటకోసమే బోట్లు తిరిగేవి. సరుకు, ఇసుక రవాణా బోట్లూ ఉండేవి. ఈ సంఖ్య ఇప్పుడు తగ్గుతూ వస్తుంటే, దశాబ్దకాలం నుంచి గోదావరి విహారం బాగా పెరిగింది. అటు పాపికొండలకు వేలాది మంది పర్యాటకులు నిత్యం పోటెత్తుతున్నారు. కోనసీమలో కొబ్బరి చెట్ల నడుమ గోదావరి విహారానికి ఎంతోమంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ విహారానికి ఎక్కువమంది విచ్చేస్తున్న వారిలో రెండు తెలుగురాష్ట్రాల వాళ్లే ఎక్కువ. ఇక నుంచి దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. కోనసీమ విషయానికొస్తే.. రాజోలు మండలం సోంపల్లి నుంచి దిండి, అక్కడ నుంచి అంతర్వేదికి గోదావరి ప్రయాణం ఉంటుంది. దీనిని టూరిజం సర్క్యూట్గా ప్రకటించారు. పాశర్లపూడి నుంచి గోదావరి మీదుగా ఆదుర్రు, పాశర్లపూడి నుంచి అప్పనపల్లికి కూడా ఈహౌస్బోటు సర్క్యూట్ను ప్రకటించారు. ఈవారంలోనే టెండర్లు పిలవనున్నారు. కేరళలో ఈ బోట్లను తయారు చేయించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే టూరిజం శాఖ ఈ సర్క్యూట్ల గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. కోనసీమ గోదావరి పాయల్లో సముద్రం నీరు, గోదావరి నీరు కలసి ఉంటుంది. బ్లాక్ వాటర్ ప్రాంతంగా దీనిని పిలుస్తారు. ఈ నీళ్లు చూడడానికి చాలా అందంగా, చల్లగా ఉంటాయి. పేరుకు బ్లాక్ వాటర్గా పిలుస్తున్నప్పటికీ, నీళ్లు తెలుపే. ఈ నీళ్లలో బోటు ప్రయాణం చాలా బావుంటుంది. కేరళలో ఇటువంటి ప్రాంతాల్లో హౌస్బోటు పయనానికి మంచి డిమాండు ఉంది. ఈ బోట్లలో గదులు కూడా ఉంటాయి. బెడ్స్ ఉంటాయి. బోటు పైభాగంలో కుర్చీలతో కూర్చుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కూడా సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గోదావరి పుష్కరాల సమయంలో బోటు మీద గోదావరిని పరిశీలించిన చంద్రబాబు ఈ ప్రాంతం టూరిజానికి అనుకూలంగా ఉందని గుర్తించారు. అప్పటికప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రంపచోడవరంలోని భూపతిపాలెం రిజర్వాయరు, రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో బోటు షికారు ఊపందుకుంది. కానీ హౌస్బోట్లు లేవు. స్పీడ్ బోట్లతో వినోదం అందుబాటులో ఉంది. పాపికొండల పర్యటన ఎలానూ ఉంది. కోరంగి మడ అడవులు, దిండి ప్రాంతంలో కూడా బోటు షికారు ఉంది. హౌ్సబోట్ షికారు ప్రారంభమైన తర్వాత ఉభయగోదావరి జిల్లాల మధ్య గోదావరిలో జలవినోదం మరింత పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ధవళేశ్వరం నుంచి కడియపులంక వరకూ కూడా బోటు షికారు, అక్కడ కడియం నర్సరీలు చూపించి, మళ్లీ బోటులో ధవళేశ్వరం తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది. జొన్నాడ నుంచి కోటిపల్లి, యానాం వరకూ కూడా బోటు షికారు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పాశర్లపూడి, దిండి వద్ద జెట్టీలు నిర్మించారు. పర్యాటకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.
June 26, 20251 yr Author Akhanda Godavari Project: తూర్పు పర్యాటక సిరి.. ‘అఖండ గోదావరి’ By Andhra Pradesh News DeskUpdated : 26 Jun 2025 08:10 IST Ee Font size 3 min read పుష్కరాల రేవుకు ఆధ్యాత్మిక శోభ వినోదాలకు వేదికగా హేవలాక్ వంతెన చుట్టు పక్కల ప్రాంతాలనూ తీర్చిదిద్దే ‘అఖండ గోదావరి ప్రాజెక్ట్’కు నేడు శంకుస్థాపన నిడదవోలులోని కోటసత్తెమ్మ తల్లి ఆలయం ఈనాడు, రాజమహేంద్రవరం: చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) కింద రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు, 127 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలాక్ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో 116.97 ఎకరాల్లో బ్రిడ్జిలంక (హేవలాక్ వంతెన, రోడ్కం రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతం)ను వినోద కేంద్రంగా మార్చనున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ పురందేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు ప్రాజెక్టు పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. బ్రిడ్జిలంకలో వినోదం.. హేవలాక్ వంతెన నుంచి బ్రిడ్జిలంకలోకి దిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. తపోవనం పేరిట బోటింగ్, జల, సాహస క్రీడలు, రెస్టారెంట్లు, ధ్యాన మందిరం, ఆయుర్వేద కేంద్రాలు, ఈవెంట్ స్పేస్తో పాటు పీపీపీ విధానంలో మరిన్ని వినోదాత్మక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు గోదావరిలో బోటు షికారు చేస్తూ కడియం నర్సరీల్లో అందాలను వీక్షించవచ్చు. కడియపులంకలో ఉన్న 2.60 ఎకరాల్లో నర్సరీల ఎక్స్పీరియన్స్ సెంటర్, వేమగిరి నుంచి కడియపులంక వరకు బోటింగ్, గట్టు పటిష్ఠత, స్టాల్స్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశారు. నిడదవోలులో శ్రీకోటసత్తెమ్మ తల్లి ఆలయానికి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా వసతులు, ఆలయ అభివృద్ధి చేయనున్నారు. సమిశ్రగూడెంలో 23 కి.మీ. మేర గోదావరి కాలువలో బోటింగ్తో పాటు ఫుడ్కోర్టులు, విశ్రాంతి గదులు ఏర్పాటుచేస్తారు. నిడదవోలులో గోదావరి కాలువ పక్కన ఏర్పాటు చేయనున్న వసతులు వేల మందికి ఉపాధి అఖండ గోదావరి ప్రాజెక్టును పట్టాలెక్కించడం ద్వారా ఏడాదికి సగటున 18 లక్షల నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని యంత్రాంగం అంచనా వేస్తోంది. స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర ఘాట్.. గోదావరి పుష్కరాలంటే గుర్తొచ్చే రాజమహేంద్రవరం పుష్కరాల రేవును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఘాట్లో ఉన్న ఆలయాల విశిష్టత తెలియజేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు గోదావరి హారతి ఇచ్చేలా తీర్చిదిద్దుతారు. ఆధ్యాత్మిక, యోగా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. హేవలాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని దశాబ్దాలుగా ఉన్న ఆకాంక్ష కూటమి హయాంలో సాకారం కానుంది. వంతెనను 12 మీటర్ల వరకు వెడల్పు చేసి నగర, రాష్ట్ర చరిత్ర, విశిష్టతలు, కళా రంగాలు ఇలా.. వివిధ థీమ్లతో అభివృద్ధి చేస్తారు. దీంతోపాటు వంతెనపైనే 10 స్టాల్స్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు, సెల్ఫీ, వ్యూ పాయింట్లు ఉంటాయి. కడియంలో నిర్మించే ఎక్స్పీరియన్స్ సెంటర్ రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు పుష్కరాల రేవు రూపురేఖలు మారనున్నాయిలా...
Create an account or sign in to comment