హైదరాబాద్ సంస్థ నుంచే టెక్నాలజీ!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో ప్రణీత్ బృందం అనధికారికంగా సాగించిన ఫోన్ట్యాపింగ్కు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నుంచే సమకూర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Published : 08 Apr 2024 03:02 IST
కేవలం ఎస్ఐబీ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ దందా కొనసాగింపు
ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే నిలిపివేత
జప్తు సొమ్ము ఈసీఐ అధీనంలోకి వెళ్లకుండా హవాలా రంగు
ఈనాడు, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో ప్రణీత్ బృందం అనధికారికంగా సాగించిన ఫోన్ట్యాపింగ్కు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నుంచే సమకూర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మాదాపూర్లోని ఓ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇందుకు సంబంధించిన టెక్నలాజికల్ టూల్ను అందించే కన్సల్టెన్సీగా వ్యవహరించినట్లు తేలింది. టెలికమ్యూనికేషన్ రంగంలో అపార అనుభవమున్న ఆ కంపెనీ ద్వారానే సాఫ్ట్వేర్ను సమకూర్చుకున్న ప్రణీత్ బృందం.. దాన్ని అక్రమ వ్యవహారాలకు వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబీలోనే రెండు ప్రత్యేక గదులు ట్యాపింగ్ వ్యవహారానికి కేంద్రంగా ఉన్నాయని.. బయటి ప్రాంతాల్లో సర్వర్లు పెట్టి నిఘా ఉంచలేదని ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది. 2023 శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ప్రణీత్ బృందం సాంకేతిక నిఘాను విస్తృతంగా వినియోగించింది. భారాస ప్రత్యర్థులైన అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందించే వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి.. ఆ సమాచారాన్ని హైదరాబాద్ సహా జిల్లాల్లోని పోలీసులకు అందించారు. దాని ఆధారంగా సొమ్ము పట్టుకుని.. అది ఎన్నికల కమిషన్ అధీనంలోకి వెళ్లకుండా ప్రత్యేక ప్రణాళిక రచించారు. ఆ డబ్బుకు హవాలా రంగు పులిమి పోలీసు కేసులు నమోదు చేయించి జప్తు చేయించినట్లు దర్యాప్తులో గుర్తించారు.
బైక్పై ఒంటరిగానే హార్డ్డిస్క్ల తరలింపు
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఫోన్ ట్యాపింగ్ను నిలిపివేశారు. ఎస్ఐబీలో 17 కంప్యూటర్లలోని 42 హార్డ్డిస్క్లను పూర్తిగా తీసేశారు. వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చారు. ఈ కారణంగా మావోయిస్టులకు సంబంధించిన సమాచారం సైతం లేకుండా పోయింది. అనంతరం ప్రణీత్ స్వయంగా ఎలక్ట్రీషియన్ను తీసుకెళ్లి ఎస్ఐబీలోనే హార్డ్డిస్క్లను ఎలక్ట్రిక్ కట్టర్లతో కట్ చేయించాడు. తర్వాత ఎవరికీ తెలియకుండా ఉండాలని.. తాను ఒక్కడే ద్విచక్ర వాహనంపై రెండు విడతలుగా మూసీ వద్దకు వెళ్లి ధ్వంసం చేసిన హార్డ్డిస్క్లను నదిలో పడేశాడు. పోలీసుల విచారణలో ప్రణీత్రావు నేరం అంగీకరించడంతోపాటు ధ్వంసమైన హార్డ్డిస్క్ల గురించి నోరు విప్పక తప్పలేదు. అతడిచ్చిన సమాచారం ఆధారంగానే నాగోలు బ్రిడ్జి కింద మూసీ నదిలో హార్డ్డిస్క్ల శకలాలను స్వాధీనం చేసుకున్నారు.
ఫిబ్రవరి 13నే ప్రభాకర్రావు టికెట్ బుకింగ్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన నిందితులందరి వాంగ్మూలాల్లోనూ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ప్రస్తావన వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్రావుపై మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదైన మరుసటి రోజే ప్రభాకర్రావు చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లడం, అదే సమయంలో టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు బహ్రెయిన్కు పయనం, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మీడియా సంస్థ నిర్వాహకుడు సైతం అంతకు ఒకట్రెండు రోజుల ముందే విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ప్రణీత్ నోట తన పేరు బహిర్గతమవుతుందనే ఉద్దేశంతోనే ప్రభాకర్రావు విదేశాలకు వెళ్లారనే ప్రచారం విస్తృతంగా సాగింది. కానీ ఆయన అమెరికా వెళ్లేందుకు ఫిబ్రవరి 13నే టికెట్ బుక్ చేసుకున్నట్లు తేలింది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన శస్త్రచికిత్స నిమిత్తం వెళ్లినట్లు ఇమిగ్రేషన్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రభాకర్రావును విచారించడం కీలకం కావడంతో అతడి కోసం వేచిచూస్తున్నారు.