సాగర్ కాల్వలో గోదావరి గలగలలు గోదావరి - పెన్నా అనుసంధానంలో తొలిదశ యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయిలో పనులు
నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టుకు ఖరీఫ్ సీజన్ నాటికి గోదావరి జలాలు తీసుకురావడానికి జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది. గోదావరి నుంచి పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీకి వచ్చే గోదావరి జలాలను హరిశ్చంద్రాపురం నుంచి ఎత్తిపోయడం ద్వారా సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది ప్రణాళిక. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పనులు జరుగుతున్నాయి.
ఈనాడు, అమరావతి
తొలిదశలో 7వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి నకరికల్లు సమీపంలో సాగర్ ప్రధానకాలువకు 81వ కిలోమీటరు వద్ద నీటిని పోస్తారు. ఇక్కడి నుంచి సాగర్ కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ఇందుకు ఏడుదశల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేస్తారు. కొంత దూరం కాలువ తవ్వి గ్రావిటీ ద్వారా నీరు తీసుకెళతారు. దీన్ని గోదావరి-పెన్నా అనుసంధానంలో తొలిదశగా పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణ, సర్వే, పనుల పర్యవేక్షణ, కాలువ తవ్వకం తదితర పనులు పర్యవేక్షణకు పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని రెండు డివిజన్ల ఇంజినీర్లను ఉపయోగిస్తున్నారు. జలవనరులశాఖ గుంటూరు వలయ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం పరిధిలో పనులు చేపడుతున్నారు. జూన్ నాటికి పనులు పూర్తిచేసి సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండు వేల ఎకరాల భూసేకరణ: ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణానది తీరంలో తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం నుంచి నకరికల్లు సమీపంలో సాగర్ కుడిప్రధాన కాలువలోకి కలుపుతున్నారు. ఇందుకు 72కిలోమీటర్ల దూరం నీటిని తీసుకెళ్లాల్సి ఉంది. 61.80 కిలోమీటర్ల మేర గ్రావిటీతో కాలువ, 10.15 కిలోమీటర్ల మేర పైపులైను వేయాలని నిర్ణయించారు. ఇందుకు తొలిదశలో 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయనున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం 300 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలన్న యోచనలో జలవనరులశాఖ ఉంది. ఈ లెక్కన సుమారు 2 వేల ఎకరాల భూమి అవసరమని లెక్కించారు. భూసేకరణకు సుమారు రూ.600కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ప్రాథమిక అంచనా. 72 కిలోమీటర్ల దూరంలో ఏడుచోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేసి నీటిని ఎత్తిపోస్తారు. మొత్తం తొలిదశలో 7వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలనేది ప్రణాళిక. సాగర్ కుడి ప్రధాన కాలువ నీటిప్రవాహ సామర్థ్యం నకరికల్లు వద్ద 9వేల క్యూసెక్కులు. ఇక్కడి నుంచి గుంటూరు జిల్లాతోపాటు, ప్రకాశం జిల్లా ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. మొత్తం 11లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా నకరికల్లు నుంచి సాగర్ ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టుకు మినహా మిగిలిన ఆయకట్టుకు గోదావరి జలాలు అందుతాయి. తొలిదశలో ఎత్తిపోసే 7వేల క్యూసెక్కులకు సాగర్ నుంచి 2500క్యూసెక్కులు తీసుకుంటే పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తొలిదశలో భాగంగా రూ.4617కోట్లతో చేపడుతున్నారు. ఇందులో కాలువ నిర్మాణానికి రూ.989కోట్లు, ఎత్తిపోతలకు రూ.3628కోట్లు వెచ్చించాల్సి ఉంది. గుంటూరు వలయ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం పరిధిలో సుమారు 30మంది ఇంజినీర్లు ఈపనులను పర్యవేక్షించనున్నారు. ఇందుకు పులిచింతల ప్రాజెక్టు డివిజన్ పరిధిలో గుంటూరు జిల్లాలోని ఒక డివిజన్, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట పరిధిలో ఉన్న పులిచింతల డివిజన్ నుంచి ఇంజినీర్లను గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తొలిదశకు తీసుకున్నారు. వీరందరికీ ఒకరోజు అవగాహన కల్పించి యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయికి పంపారు.
ఎత్తిపోతల ద్వారా నీరు గోదావరి నది నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం 8వేల క్యూసెక్కులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 8500క్యూసెక్కుల గోదావరి నీటిని తీసుకువస్తున్నారు. ఇందులో మార్గమధ్యలో 1300 క్యూసెక్కులు ఉపయోగించుకుంటున్నారు. ఇంకా నీటినష్టాలు పోనూ 14వేల క్యూసెక్కులు ప్రకాశంబ్యారేజీకి చేరుతాయని జలవనరులశాఖ అంచనా వేసింది. ఇందులో కృష్ణా డెల్టా అవసరాలకు 7వేల క్యూసెక్కులు, సాగర్ ఆయకట్టు అవసరాలకు ఏడువేల క్యూసెక్కులు వాడుకుంటారు. ప్రకాశంబ్యారేజీలో నీటినిల్వ ద్వారా హరిశ్చంద్రపురం వరకు నీరు నిల్వ ఉంటుంది. ఇక్కడ పంపుహౌస్ కట్టి నీటిని ఎత్తిపోస్తారు. సాగర్ ఆయకట్టు కింద గత రెండేళ్లుగా ఖరీఫ్ సీజన్లో సాగునీరు ఇవ్వకపోవడం, నదుల ఆనుసంధానం ప్రాధాన్యత దృష్ట్యా రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి నీటిని ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలవనరులశాఖ అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు పనులు ప్రారంభించారు. మార్చి నెలలో టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించే అవకాశముందని జలవనరులశాఖ ఇంజినీరు ఒకరు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే సాగర్ ఆయకట్టు రైతులకు జూన్ నెలలోనే సాగునీరు వచిచ సకాలంలో ఖరీఫ్ సీజన్లో పంటలు సాగుచేసుకోవచ్చు. కొన్నాళ్లుగా సాగర్కు పూర్తిస్థాయిలో వరదనీరు రానందున సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు తీసుకువస్తే ఆయకట్టుదారులు కష్టాల నుంచి గట్టెక్కినట్టే.