Jump to content

అమెరికన్ యువతి రేప్ కేసులో మలుపు


Mahesh Tummala

Recommended Posts

సంచలనం సృష్టించిన అమెరికన్ యువతిపై అత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. విచారణలో భాగంగా పోలీసులు ఓ అనుమానితునికి డీఎన్ఏ పరీక్షలు జరిపించారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకన్న నివేదిక కాపీని పోలీస్‌స్టేషన్‌కు పంపించటంతో పాటు మరో కాపీ ఇస్తానని చెప్పి అనుమానితుని వద్ద లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. మొదట సదరు అనుమానితునికి వ్యతిరేకంగా పరీక్షల నివేదిక వచ్చిందని...

 

ఆ విషయం చెప్పి భయపెట్టి అనుకూలంగా మారుస్తానని వెంకన్న లంచం డిమాండ్ చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబరు 11లోని ఓ రెండంతస్తుల భవనం పెంట్‌హౌస్‌లో నివాసముంటున్న అమెరికా దేశస్తురాలిపై ఇటీవల అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం అన్నివర్గాల్లో, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చి నగరంలో ఉంటున్న వారిలో తీవ్ర కలకలం సృష్టించిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఏకే.ఖాన్ నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

 

ప్రాథమిక విచారణలో బాధితురాలు ఉంటున్న ఇల్లు...పెంట్‌హౌస్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తే నేరానికి పాల్పడినట్టుగా పోలీసులు భావించారు. ఈ క్రమంలో బాధితురాలు ఉంటున్న ఇంటి పరిసరాల్లో పలువురిని విచారించారు. ఆమె స్నేహితులు...పనిచేస్తున్న చోట సహోద్యోగులను కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బాధితురాలు ఉంటున్న భవనంలోనే అద్దెకుంటున్న ఒమర్ ఫారూఖ్‌ను కూడా పోలీసులు అనుమానించారు.

 

డీఎన్ఏ పరీక్షలు...

విచారణలో భాగంగా నేరస్థలం నుంచి రక్తం నమూనాలు సేకరించిన దర్యాప్తు అధికారులు అనుమానితుల జాబితాలో ఉన్న ఒమర్ ఫారూఖ్‌కు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో డీఎన్ఏ పరీక్షలు జరిపించారు. పరీక్షలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకన్న జరిపాడు.

 

లంచం డిమాండ్ చేసి...

పరీక్షల నివేదికను తయారు చేసిన వెంకన్న ఇటీవల ఒమర్ ఫారూఖ్‌ను కలిశాడు. నీకు జరిపిన డీఎన్ఏ పరీక్షల నివేదిక సిద్ధంగా ఉందని...పదిహేనువేల రూపాయలు ఇస్తే వెంటనే దాని కాపీని పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తానని...నీకూ ఓ కాపీ ఇస్తానని చెప్పాడు. డబ్బు ఇవ్వని పక్షంలో నివేదికను ఆలస్యంగా పంపిస్తానని బెదిరించాడు. దానివల్ల పోలీసుల నుంచి నువ్వు మరికొన్ని రోజులు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని...అరెస్టు కూడా కావచ్చని బెదిరించాడు.

 

ఏసీబీని ఆశ్రయించిన ఒమర్...

దాంతో ఒమర్ ఫారూఖ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. డీఎన్ఏ పరీక్షల కాపీని పోలీస్‌స్టేషన్‌కు పంపించటానికి సైంటిఫిక్ ఆఫీసర్ వెంకన్న పదిహేనువేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన విషయాన్ని చెప్పాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు వెంకన్నను పట్టుకోవటానికి వలపన్నారు. దాని ప్రకారం రసాయనం పూసి ఉన్న కరెన్సీ నోట్ల (12 వేల రూపాయలు)ను ఒమర్ ఫారూఖ్‌కు ఇచ్చారు. లక్డీకాపూల్‌లోని గ్రాండ్ బేకరీ వద్ద ఒమర్ ఫారూఖ్ నుంచి వెంకన్న కరెన్సీ నోట్లను తీసుకోగానే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 

కలకలం... ఈ ఉదంతం మొదట తీవ్ర కలకలం సృష్టించింది. అమెరికన్ యువతిపై అత్యాచారం జరిగిన కేసులో అనుమానితునిగా ఉన్న ఒమర్ ఫారూఖ్‌కు వ్యతిరేకంగా డీఎన్ఏ పరీక్షల నివేదిక వచ్చిందని...అదే విషయం చెప్పి భయపెట్టి నీకు అనుకూలంగా నివేదిక తయారు చేస్తానని వెంకన్న లంచం డిమాండ్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఈ విషయమై ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అధికారి సంపత్‌కుమార్‌తో మాట్లాడగా అనుమానాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నిజానికి ఒమర్ ఫారూఖ్‌కు అనుకూలంగా డీఎన్ఏ పరీక్షల ఫలితం వచ్చిందని చెప్పాడు. అయితే ఈ నివేదికను తొందరగా పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తానని లంచం డిమాండ్ చేసి వెంకన్న దొరికిపోయాడని వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...