Jump to content

Polavaram right canal to Eluru canal Link


Recommended Posts

గోదారి నీరు నేరుగా కృష్ణా కాలువకు
పోలవరం కుడి కాలువ నుంచి ఏలూరు కాలువకు సంధానం
  80 వేల ఎకరాల స్థిరీకరణ లక్ష్యం
  రూ.15.45 కోట్ల అంచనా వ్యయం
  ఆర్థిక శాఖకు చేరిన దస్త్రం
ఈనాడు-అమరావతి
31ap-main6a.jpg

పోలవరం కుడి కాలువను, కృష్ణా ఏలూరు కాలువతో అనుసంధానించి ఆ కాలువ కింద ఉన్న 80 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో భాగంగా పోలవరం కుడి కాలువ 137.290 కిలోమీటరు వద్ద ఉన్న అండర్‌టన్నెల్‌ సమీపం నుంచి ఏలూరు కాలువ 36వ కిలోమీటరు వద్దకు మరో కాలువ తవ్వనున్నారు. ఇలా చేయడం వల్ల కృష్ణాలో నీళ్లు లేని సమయంలో గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి వెళ్లి మళ్లీ ఏలూరు కాలువకు తిరిగి ప్రయాణించి వచ్చేవరకు అయ్యే ఆలస్యాన్ని నివారించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. ఏలూరు కాలువ ఆధునికీకరణ పూర్తి కాని పరిస్థితుల్లో పైనుంచి జరుగుతున్న ప్రవాహ నష్టాలను కూడా నివారించవచ్చనేది జలవనరుల శాఖ ప్రణాళిక. దీనికి అనుగుణంగా అధికారులు రూపొందించిన అంచనాల నివేదిక ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. మొత్తం రూ.15.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపుదిద్దుకుంది.

ప్రస్తుత పరిస్థితి
* 1957లో ప్రకాశం బ్యారేజీ నిర్మించిన సమయంలో కృష్ణా డెల్టా ఆయకట్టును 13.08 లక్షల ఎకరాలకు పెంచారు. ఏలూరు కాలువ కింద నీరందించే ఆయకట్టును 1,15,000 ఎకరాలకు పెంచారు. మొత్తం 1643 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లాలన్నది ఆలోచన. ఆ స్థాయిలో నీటిని తీసుకువెళ్లేలా సీఎంసీడీ పనులు చేపట్టలేదు. ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీరున్న సమయంలోనూ చివరి ఆయకట్టుకు నీరందడం ఇబ్బందిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఏలూరు కాలువలో 1300 క్యూసెక్కులకు మించి నీటిని వదిలితే ఎనికేపాడు అక్విడక్టు వద్ద పొంగి పొర్లి వృథా అవుతోంది.
* 2008లో చేపట్టిన కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా మట్టి పనులు మాత్రమే చేపట్టారు. దీంతో ఆయకట్టుదారులు ఇబ్బంది పడుతున్నందున తాజా ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది.
* పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు 80 టీఎంసీల నీటిని ఇస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు కాలువ కింద ఉన్న 1,15,000 ఎకరాలు ఇందులోకి వస్తుంది. అంపాపురం దిగువన ఏలూరు కాలువలో 80 వేల ఎకరాల ఆయకట్టుంది. ఈ ఆయకట్టుకు 100 డ్యూటీ కింద 800 క్యూసెక్కుల నీరు మళ్లించగలిగితే ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నది తాజా ప్రణాళిక. ఇందులో భాగంగా పోలవరం కుడి కాలువను, ఏలూరు కాలువను దిగువ పేర్కొన్న తరహాలో అనుసంధానిస్తారు.
1. పోలవరం కుడి ప్రధాన కాలువ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బండారిగూడెం గ్రామం మీదుగా ప్రవహిస్తోంది. అక్కడ 137.315 కిలోమీటరు వద్ద స్థానిక వాగును ఈ కాలువ దాటేలా అండర్‌టన్నెల్‌ ఇప్పటికే నిర్మించారు. ఈ వాగు పోలవరం కాలువపై ఉన్న అండర్‌టన్నెల్‌ ద్వారా కాలువను దాటి అంపాపురంలోని మల్లిగని చెరువులోకి నీటిని చేరుస్తుంది. ఈ అండర్‌టన్నెల్‌ నుంచి చెరువు వరకు 3.4 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
2. తాజా ప్రణాళికలో భాగంగా పోలవరం కుడి కాలువ ఎడమ వైపున 137.290 కి.మీ. వద్ద ఒక ఎస్కేప్‌ నిర్మించి పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి నీటిని ఈ వాగులోనే పోసి అంపాపురం వద్దకు మళ్లిస్తారు. ప్రస్తుతం వాగు నాలుగు మీటర్ల వెడల్పున ఉంటుంది. స్థానిక ప్రవాహాలతో పాటు కలిపి 800 క్యూసెక్కులను తీసుకెళ్లేలా ఈ కాలువను వెడల్పు చేస్తారు. తిరిగి ఆ చెరువు నుంచి రెండు కి.మీ. పొడవునా కాలువ తవ్వి ఏలూరు కాలువలో 37.208 కి.మీ.వద్ద ఉన్న వీరవల్లి అండర్‌టన్నెల్‌ వద్ద కలుపుతారు. భారీ వర్షాల సమయంలో అదనపు జలాలుంటే బుడమేరు డ్రెయిన్‌కు మళ్లిస్తారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...