తొలుత 12,000 కోట్ల పెట్టుబడులు...
మున్ముందు మరిన్ని పెట్టుబడులకు రెడీ
ఆంధ్రజ్యోతితో యుఎఇ పారిశ్రామిక దిగ్గజం బిఆర్ షెట్టి
డబ్బు కంటే సేవ ముఖ్యం.. నేను ఏ వ్యాపారమూ కూడా డబ్బు సంపాదన లక్ష్యంగా ప్రారంభించలేదు. దేశానికి సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలి. నాణ్యమైన సేవలు అందించాలి. ఎండ్ రిజల్ట్ ఈజ్ మనీ. డబ్బే మనల్ని ఫాలో అవుతుంది.
విజయవాడ (ఆంధ్రజ్యోతి): బిఆర్ షెట్టి.. పారిశ్రామిక ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకకు చెందిన షెట్టి దశాబ్దాల క్రితం అబుదాబి వెళ్లారు. ఆ నగరాభివృద్ధితో సమాంతరంగా ఎదుగుతూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. బిఆర్ఎస్ వెంచర్స్, ఎన్ఎంసి గ్రూప్ ఆసుపత్రులు, హోటళ్లు, విద్యా సంస్థలను నెలకొల్పారు. నియో ఫార్మా పేరిట ఆ రంగంలోనూ కాలు మోపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఈయన ప్రారంభించిన మరో సంస్థ ట్రావెలెక్స్.. విదేశాల్లో సంపాదించిన ధనాన్ని సొంత దేశాలకు పంపించేవారికి పెద్ద వేదికగా మారింది. అబుదాబి అత్యున్నత పురస్కారాన్ని పొందిన షెట్టికి.. భారత ప్రభుత్వం కూడా ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారం, ఆ తర్వాత పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది.
ఈ నెల రెండో తేదీన షెట్టి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓ భారీ ఒప్పందాన్ని చేసుకున్నారు.
అమరావతి కేంద్రంగా వివిధ రంగాల్లో 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎకనామిక్ డెవల్పమెంట్ బోర్డ్ సిఇఒ కృష్ణ కిశోర్తో బిఆర్ షెట్టి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ షెట్టి..‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 40 ఏళ్ల క్రితం అబుదాబిని ఇప్పటి అమరావతితో పోల్చిన షెట్టి... భవిష్యత అమరావతిలో ప్రస్తుత అబుదాబిని చూడగలుగుతున్నానని వ్యాఖ్యానించారు.
అప్పుడు అబుదాబి... ఇప్పుడు అమరావతి
నేను మొదట అబుదాబి వెళ్లా. అప్పుడు అబుదాబి కూడా ఇంతే (ఇప్పుడు అమరావతిలా) ఉంది. అభివృద్ధి లేదు. ఆ నగరం అభివృద్ధిలో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈ రోజు ప్రపంచంలోని అద్భుత నగరాల్లో అబుదాబి ఒకటి. ఇక్కడ చంద్రబాబు ఒక రాష్ట్రాన్ని నిర్మించే సవాలును స్వీకరించారు. ఏ రాష్ట్ర అభివృద్ధిలోనైనా మొదట జాగ్రత్త తీసుకోవలసింది విద్య, వైద్య రంగాలపైనే. నేను ఆ రంగానికే చెందినవాడిని కాబట్టి వచ్చాను. నాకు ప్రపంచ వ్యాప్తంగా 38 ఆసుపత్రులున్నాయి. మాది లండన్ లిస్టెడ్ కంపెనీ. మా మార్కెట్ విలువ 340 కోట్ల డాలర్లకంటే ఎక్కువ. వీటికితోడు ఫార్మా, ఇన్వెన్షన్, రీసెర్చ్ అండ్ డెవల్పమెంట్. మిత్సుబిషి కార్పొరేషన్ నాతో భాగస్వామి కానుంది. అమెరికాలోని అత్యుత్తమ యూనివర్సిటీ, ఆసుపత్రులను కూడా భాగస్వాములను చేస్తా. నేను షార్ట్లిస్ట్ చేసిన సంస్థలలో శాన్డియాగో యూనివర్సిటీ ఒకటి. అలాంటి విశ్వవిద్యాలయం ఇక్కడకు రావడం అంటే... ప్రపంచ వ్యాప్త విద్యార్ధులు చదువుకోవడానికి ఇక్కడికే వస్తారు.
రూ.12 వేల కోట్లతో ఆగదు..
ఒప్పందంలో లేని రంగాలు కూడా మా ప్రణాళికలో ఉన్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్ అందులో ఒకటి. వివిధ పనులు చేసేవారికి కూడా నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. నగర పారిశుధ్యం చాలా ముఖ్యమైనది. అవన్నీ ఎంఒయులో రాయాల్సిన అవసరం లేదు. ఎంఒయులో రూ.12 వేల కోట్లు మాత్రమే పేర్కొన్నాం. అంటే 180 కోట్ల డాలర్లు. అది 250 కోట్ల డాలర్లకు వెళ్లొచ్చు. డబ్బు ముఖ్యం కాదు.
ఐలాండ్లో గోల్ఫ్ కోర్స్..
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ఐలాండ్ నాకు ఇచ్చారు. అందులో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తా. ఒక టూరిజం సెంటర్ కూడా.... చంద్రబాబు ఎక్సలెంట్’కు తక్కువగా దేన్నీ ఆమోదించరు. కాబట్టి నేను ఎక్సలెంట్గానే పని చేస్తా. ఒకహోటల్, సిపిటి ఏరియా, షాపింగ్ మాల్, ఆసుపత్రి ఉంటాయి.
ఆరు గంటల్లోనే కల్చర్ ఫలితాలు..
వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో అధునాతన పద్ధతులను ప్రవేశపెడతాం. కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్కు ఇప్పుడు మూడు రోజుల సమయం పడుతోంది. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తెలుసుకోవడానికి... దానికి విరుగుడుగా ఏ మందు వాడాలో నిర్ణయించడానికి మూడు రోజులు ఆగాలన్నమాట. నా దగ్గర ఉన్న టెక్నాలజీతో ఆరు గంటల్లో ఈ పని చేయవచ్చు. ఐదు నుంచి ఆరు గంటల్లోనే కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ సత్ఫలితాలు వస్తాయి. ఇది కొత్త టెక్నాలజీ. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిసే్ట్రషన్ (ఎఫ్డిఎ) ఆమోదం పొందినది. భారతలో ఇది ఎక్కడా లేదు. ఇదే మొదటిసారి. అమరావతిలో నేను నెలకొల్పబోతున్న పరిశోధనా కేంద్రం, లేబొరేటరీ వంటిది మరెక్కడా లేదు. ఒక్క అమెరికాలో తప్ప.
అబుదాబి ప్రభుత్వం కూడా..
భవిష్యత అమరావతిలో అబుదాబి తరహా అభివృద్ధిని నేను ఇప్పుడే దర్శిస్తున్నా. అబుదాబి ప్రభుత్వంతో, రాజకుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తన తరఫున అబుదాబి ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చి ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అవకాశాలను చూడాలని అబుధాబి ప్రభుత్వాన్ని కోరతా. ఇందులో భాగస్వాములయ్యేందుకు వారు సంతోషంగా ఒప్పుకుంటారు. వారు ఉదార స్వభావులు, సహనశీలురు. నీటి సరఫరా, తాగునీరు, రోడ్లు, ఎయిర్పోర్టుల వంటివి వారు చాలా చేయగలరు.
మొదటి దశలో 1800 పడకలు.. రాష్ట్రంలో 3,500 పడకలతో ఆసుపత్రులు నిర్మిస్తాం. అమరావతితోపాటు కర్నూలు, విశాఖపట్నంలలో కూడా ఆసుపత్రులు వస్తాయి. మొదటి దశలో భాగంగా అమరావతిలో 1500 పడకలు, కర్నూలులో 300 పడకలతో ఆసుపత్రులను నిర్మిస్తాం. మొదటి దశలో అమరావతిలో 300 పడకలు, కర్నూలులో 50 పడకలు ఏర్పాటు చేస్తాం. అనుమతులు వచ్చినప్పటినుంచి రెండేళ్లలో మొదటి దశ (మొత్తం 1800 పడకలు)పూర్తవుతుంది. కేరళ, రాయ్పూర్లలో నాకు ఆసుపత్రులున్నాయి. నేపాల్, ఈజిప్ట్, సౌదీ, ఒమన్ వంటి దేశాల్లోనూ ఆసుపత్రులున్నాయి. రీసెర్చ్ సెంటర్ మాత్రం కేవలం అబుదాబిలోనే ఉంది.