center enee warning luu echenaa mana peche reddy venadamu ledhu gaaa...!
విరమించుకోండి
పోలవరం రీ టెండర్ల నిర్ణయంపై ‘అథారిటీ’ సలహా
మళ్లీ టెండర్లకు వెళితే ప్రాజెక్టు అనిశ్చితిలోకే
రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్ట్ టెండర్ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న (రీ టెండరింగ్) నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుందని, ప్రాజెక్టుని అనిశ్చితిలోకి నెట్టివేస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆందోళన వ్యక్తంచేసింది. రీ టెండరింగ్ ఆలోచన విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ ప్రకటనకు సిద్ధమవుతూ.. శుక్రవారం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో.. ప్రాజెక్టు అథారిటీ ఈ సూచనలు చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఆర్.కె.జైన్ శుక్రవారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్కి లేఖ రాశారు. పోలవరం రీటెండరింగ్ అంశంపై ఈ నెల 13న హైదరాబాద్లో అత్యవసరంగా నిర్వహించిన పీపీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్నే పునరుద్ఘాటించారు. ‘‘ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రిక్లోజర్, రీ టెండరింగ్ ఆలోచనల్ని విరమించుకోవాలని మీకు వినయపూర్వకంగా సలహా ఇస్తున్నాను. కనీసం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి తీసుకునే వరకైనా... మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి’’ అని సూచించారు. ‘‘ఈ నెల 13న నిర్వహించిన పీపీఏ అత్యవసర సమావేశంలో మనం చర్చించిన అంశాలను దయచేసి గుర్తు తెచ్చుకోండి. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాల్సిన అవసరంగానీ, అలా చేయాలన్న ఆలోచనకు బలమైన ప్రాతిపదికగానీ లేదన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది. రీటెండరింగ్ వల్ల ప్రాజెక్టు జాప్యమవడంతో పాటు, ఖర్చూ పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు సకాలంలో పూర్తవకపోతే ప్రయోజనాలు అందడమూ ఆలస్యమవుతుంది. అది సామాజిక-ఆర్థిక పరంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నారు. ఆ సమావేశం మినిట్స్తో పాటు, ఆ అంశంపై నివేదిక రూపొందించే పని తుది దశలో ఉంది. దాన్ని త్వరలోనే మా మంత్రిత్వశాఖకు పంపిస్తాం. మీకు కూడా అందజేస్తాం’’ అని ఆయన తెలిపారు.
మూడు రోజుల వ్యవధిలో లేఖ..!
పోలవరం పనులపై రీటెండరింగ్కి వెళ్లాలన్న నిర్ణయంపై ఈ నెల 13న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పీపీఏ ఆందోళన వ్యక్తంచేసింది. మళ్లీ టెండర్లు పిలిచి వేరే సంస్థకు పనులు అప్పగిస్తే ఖర్చు పెరగడం, ప్రాజెక్టులో జాప్యం జరగడంతో పాటు ఇతర సమస్యలూ తలెత్తుతాయని తెలిపింది. ఖర్చు పెరిగితే ఆ భారాన్ని కేంద్రం భరించబోదనీ స్పష్టం చేసింది. ఆ నిర్ణయం వల్ల తలెత్తే లాభనష్టాల్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు పనులు చేస్తున్న సంస్థను కాదని, మరో సంస్థకు పనులు అప్పగిస్తే సాంకేతిక నైపుణ్యం, డిజైన్ల పరంగా సమన్వయం ఎలా సాధ్యపడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్లను ప్రశ్నించింది. ఇప్పుడు మళ్లీ లేఖ రాసింది.