రుణమాఫీతో ప్రాణాలు నిలిపారు!
మీ మేలు జన్మలో మరువలేం
ముఖాముఖిలో సీఎంతో రైతులు
ఒంగోలు నగరం: ‘మీ మేలు జన్మలో మరిచిపోలేం.. మీరు మాకు చేసిన ప్రయోజనం అంతా ఇంతా కాదు. కాలం కలిసి రాక పంటలు పండక అప్పులు తీర్చలేకపోయాం. ఇక ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్న తరుణంలో మీరు మా బ్యాంకు రుణాలను మాఫీ చేసి, మా ప్రాణాలు నిలిపారు. రుణమాఫీతో ఎంతో ఉపశనమనం పొందుతున్నాం’ అంటూ పలువురు రైతులు సీఎ చంద్రబాబుతో తమ ఆనందాన్ని పంచుకొన్నారు. రెండో విడత రుణ ఉపశమన పత్రాలు అందజేసేందుకు బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన సీఎం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రుణమాఫీ వలన చేకూరిన లబ్ధి గురించి ఆరా తీశారు. తాను రుణమాఫీ ప్రకటించే సమయానికి రాష్ట్రం ఉమ్మడిగా ఉందని, అధికారం చేపట్టాక రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్తో బయటకు వచ్చామని అయినప్పటికీ ఇచ్చిన మాటపై నిలబడి రుణ మాఫీ చేశానన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
రైతులలో సీఎం ముఖాముఖి సాగింది ఇలా.. రైతు: నా పేరు వరహాల చౌదరి, మాది మద్దిపాడు మండలం మల్లవరం. సీఎం: రుణమాఫీతో ఎలాంటి ప్రయోజనం కలిగింది? రైతు: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నాకు రుణ మాఫీతో ఎంతో ఉపశమనం కలిగింది. మీ మేలు మరువలేం. రైతు: నా పేరు పుచ్చకాయల వెంకటేశ్వర చౌదరి, మాది ఎర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపి. సీఎం: ఇంకా రైతులకు ఏం చేస్తే బాగుంటుంది? రైతు: పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకొనే విధంగా చేయాలి సార్! అలా అయితే రాష్ట్రంలో రైతులు తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తారు. సీఎం: నువ్వు పండించే పంటను నువ్వు నిర్ణయించినధరకే అమ్ముకో! పోటీ పెరిగింది నాణ్యమైన వస్తువునే వినియోగదారులు కోరుకుంటున్నారు. రైతులు ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర వచ్చేందుకు కార్పొరేట్ సంస్థలతో మాట్లాడుతున్నాం. పంటను ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పిస్తున్నాం. విదేశాల్లో కూడా బియ్యం అమ్ముకునేందుకు అడ్డంకులు తొలగించాం. రైతు: నా పేరు వెంకటనారాయణ, టంగుటూరు మండలం ఆలకూరపాడు. సీఎం: నువ్వు బ్యాంకు నుంచి ఎంత అప్పు తీసుకున్నావు? ఎంత సొమ్ము అందింది? రైతు: రూ.1.50 లక్షల అప్పు తీసుకున్నాను. మొదట రూ.30 వేలు, ఇప్పుడు రూ.30వేలు ఇస్తున్నారు. సీఎం: మొత్తం ఒకేసారి ఇవ్వటం లేదని నీకు నామీద కోపం లేదా? రైతు: ఎందుకు సార్! మీరు మా కోసం ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం. రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్నా ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా ఇక్కడ రైతు రుణ మాఫీ చేశారు. సీఎం: కొంత మంది విమర్శిస్తున్నారు కదా? రైతు: అలా అనడం మంచిది కాదు. మాకు ప్రభుత్వం ఇస్తున్న రుణ మాఫీ సొమ్ము వల్ల ఎంతో ఉపశమనం లభిస్తోంది. రైతు: నా పేరు పోలవరపు చెంచురామయ్య, మాది ఒంగోలు మండలం కరవది. సీఎం: ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంది? రైతు: గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది సార్! గతంలో అధికారుల వద్దకు తిరిగినా పనులు జరిగేవి కావు. ఇప్పుడు అధికారులే మా గ్రామాలకు వస్తున్నారు. వ్యవసాయం ఎలా చేయాలో చెబుతున్నారు. దీంతో సాగు సులభమైంది.