సైకిల్పై...‘బడికి వస్తా’!
తొమ్మిదో తరగతి విద్యార్థినులకు.. 1.82 లక్షల సైకిళ్ల పంపిణీ
ప్రభుత్వం వినూత్న పథకం
డ్రాపవుట్ల కట్టడికి భారీ కసరత్తు
మూడు సంస్థలకు సైకిళ్ల ఆర్డర్
విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : డ్రాపవుట్లను తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నెరవేరనుంది. తొ మ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లను పం పిణీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ‘బ డికి వస్తా’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,81,555 సైకిళ్లను అందించాలని నిర్ణయించింది. నిజానికి, తొమ్మిదో తరగతిలోనే డ్రాపవుట్లు ఎక్కువ. కీలక అడుగు పడే సమయం ఇది. ఈ ఒక్క క్లాసు దాటేస్తే.. చదువులో ముందుకు వెళ్లిపోతారు. సరిగ్గా ఈ దశలోనే పిల్లల తల్లిదండ్రుల్లో ఊగిసలాట ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల విషయంలో ‘అడుగు ముందుకా- వెనక్కా’ అనేది తేలిపోయేది ఆ సమయంలోనే. ఈ విషయంలో ఆడపిల్లల పక్షా న నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ, మరోవైపు సౌకర్యవంతమైన, భద్రతతో కూడిన ప్ర యాణం చేసేలా.. ఈ తరగతి బాలికల కోసం వినూత్న పథకం ప్రవేశపెట్టింది.
అదే ‘బడికి వస్తా’. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, మోడల్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు అందజేయనున్నారు. సైకిళ్ల పంపిణీ ఆర్డర్ను మూడు సంస్థలకు విద్యాశాఖ అప్పగించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు మొత్తం 99,796 సైకిళ్లను టీఐ సైకిల్స్ఆఫ్ ఇండియా (చెన్నై), గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు మొత్తం 41,929 సైకిళ్లను హీరో సైకిల్స్ లిమిటెడ్ (లూథియానా), కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు మొత్తం 39,830 సైకిళ్లను ఎవాన్ సైకిల్స్ లిమిటెడ్ (లూథియానా).. సరఫరా చేస్తాయి. ఈ మేరకు విద్యాశాఖ బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
బిడ్డర్లదే పంపిణీ బాధ్యత పాఠశాలలో విద్యార్థినులకు సైకిళ్లను అందజేసే బాధ్యత కూడా బిడ్డర్లకే అప్పగించారు. ప్రతి వెయ్యి సైకిళ్లను ఒక బ్యాచ్గా విభజించి సరఫరా చేస్తారు. పాఠశాలల వారీగా సైకిళ్లను ఉంచేందుకు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం లేక రెండు గదులను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అలాగే, టెక్నీషియన్లను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. జిల్లా విద్యాశాఖాధికారులు పర్యవేక్షణలో పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఏ జిల్లాకు ఎన్ని.. తూర్పుగోదావరి-22,652, పశ్చిమ గోదావరి -16,841, చిత్తూరు-16,722, అనంతపూర్- 15,581, గుంటూరు -15,533, కర్నూలు -14,992, కృష్ణా-13,970, విశాఖపట్నం-12,962, శ్రీకాకుళం-12,916, ప్రకాశం-10,941, విజయనగరం- 9,874, నెల్లూరు- 9,674, కడప- 9,257.