ప్రాజెక్టులను పూర్తి చేస్తాం!. చంద్రబాబు. విజయవాడ: వర్షపు నీటిని అంచనా వేసేందుకు సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం జలవనరుల కార్యాలయంలో సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకున్నాం. ఈ ఏడాది చాలా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను కలిపాం. గోదావరిలో ఇన్ఫ్లో పెరిగితే ఆ నీటిని కృష్ణానదికి తీసుకొస్తాం. శ్రీశైలంలో నీరు నిల్వ చేసి కరవు ప్రాంతాలకు వినియోగిస్తాం. రాబోయే రోజుల్లో కృష్ణా, పెన్నాను అనుసంధానం చేస్తాం. స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ గ్రిడ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నాం.’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి నుంచే నీరు-చెట్టు పనులు, కాల్వ స్థితిగతులు వీక్షించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో జలవనరుల అధ్యయనానికి సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టుల పనితీరును ఇక్కడి నుంచే పరిశీలించే సౌకర్యం ఉందని, వెయ్యి సెన్సార్లు పెట్టి ఉపరితలంలోని నీటిని అంచనా వేయవచ్చని చంద్రబాబు వివరించారు.