స్నేహానికి ఎంతోమంది ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. ‘‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..’’ అంటూ పాటలు కూడా పాడారు. అలాంటి స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి.. తన స్నేహితుడ్ని కాపాడుకునేందుకు ఓ మహిళ తన కిడ్నీని ఇచ్చేందుకు సిద్ధపడింది. కానీ కిడ్నీ దానానికి తన బరువు అడ్డంకిగా మారడంతో.. కష్టపడి దాదాపు 20కిలోల వరకు బరువు తగ్గింది.
అమెరికాలోని పెన్సిల్వేనియాకి చెందిన రిబాక్ సెయిడ్రో.. క్రిస్ మూర్ ఓ రెస్టారెంట్లో ఐదేళ్లపాటు కలిసి పనిచేశారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఆ రెస్టారెంట్లో ఉద్యోగం మానేసినా.. ఇద్దరూ ఫేస్బుక్ ద్వారా టచ్లో ఉండేవాళ్లు. అయితే గతేడాది సెప్టెంబర్లో క్రిస్ మూర్ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి సెయిడ్రో షాక్ అయింది. తన కిడ్నీ పాడైందని.. కిడ్నీ మార్పిడి అవసరమని దానిలో పోస్టుచేశాడు మూర్. అది చూసిన వెంటనే తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది సెయిడ్రో. అందుకోసం అవసరమైన అన్ని పరీక్షలు చేయించుకుంది. బ్లడ్ గ్రూపులు కలవడంతో డాక్టర్లు కూడా ఓకే చెప్పారు. కానీ అక్కడే ఒక సమస్య వచ్చిపడింది.
కిడ్నీదానం చేసిన తర్వాత ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకూడదంటే 90కిలోల కంటే తక్కువ బరువు ఉండాలని వైద్యులు సూచించారు. కానీ అప్పుడు సెయిడ్రో అంతకంటే ఎక్కువ బరువే ఉంది. దీంతో బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. రన్నింగ్ను అలవాటు చేసుకుంది.. ఆహారపు అలవాట్లను మార్చుకుంది. వారంలో ఐదురోజులు రన్నింగ్ చేయడం మొదలుపెట్టింది. పలు పరుగుపందేల్లోనూ పాల్గొంది. అలా ఆమె దాదాపు 20కిలోల బరువు తగ్గింది.
ఇప్పుడు తన స్నేహితుడికి కిడ్నీ ఇచ్చేందుకు అన్నిరకాలుగా సంసిద్ధంగా మారింది సెయిడ్రో. త్వరలోనే ఆమె స్నేహితుడికి కిడ్నీ మార్పిడి చికిత్స జరగనుందట.