Jump to content

AP e-Pragati


Recommended Posts

రూ.2398 కోట్లతో ఈ-ప్రగతి
కాగిత రహిత ప్రభుత్వ కార్యకలాపాలు
ధ్రువీకరణ పత్రాలులేని పాలనే లక్ష్యం
అందుబాటులోకి సమీకృత సమాచారనిధి
ఈనాడు - హైదరాబాద్‌
10ap-panel9a.jpg

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరిపాలనలో సమూల మార్పులకు ఈ-ప్రగతి, ఈ-కార్యాలయ ప్రాజెక్టులు కీలకం కానున్నాయి. సన్‌రైజ్‌ ఏపీ లక్ష్యసాధన, పారదర్శకపాలన కోసం ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టు చేపట్టనుంది. దాదాపు రూ.2,398 కోట్ల ఖర్చుతో దీనిని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. ఈ ప్రాజెక్టు అమలుతో అవినీతి రహిత పాలన, పారదర్శకంగా లబ్ధిదారులకు సేవలందించేందుకు వీలు కలుగుతుంది. రానున్న మూడేళ్లలో ఏపీ సర్కారు రూ.1,528 కోట్లు ఖర్చుచేయనుంది. మెరుగైన పౌరసేవల్లో ఇది కీలకం కానుంది.

10ap-panel9aa.jpg ఈ-ప్రగతిలో ఏముంటాయంటే...
* సమీకృత సమాచార నిధి (డేటాబేస్‌)తో అక్రమాలకు తావులేకుండా అర్హులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతాయి.
* పౌరుల వివరాలతో కూడిన సమాచారనిధి సిద్ధమవుతుంది. ఈ వివరాల నమోదుకు క్షేత్రస్థాయి అధికారులకు లక్ష ట్యాబ్‌లను పంపిణీ చేశారు.
* ఓటరు నమోదు వివరాలు, వాహనాల రిజిస్ట్రేషన్‌, డ్రైవర్‌ లైసెన్సు, నైపుణ్య శిక్షణ నమోదు, ఉద్యోగాలు, పొందుతున్న వేతనాలు, ఆదాయపన్ను చెల్లింపులు, పాస్‌పోర్టు వివరాలన్నీ నమోదు చేస్తారు.
* మనిషి పుట్టుక నుంచి మరణం వరకు జీవనంలో అవసరమైన పౌరసేవలన్నీ ఆన్‌లైన్లో పొందొచ్చు.
* ప్రస్తుతం ప్రజలకు వివిధ శాఖల నుంచి దాదాపు 103 ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి.
* ప్రభుత్వ సేవల్లో సందేహాలు తలెత్తినప్పుడు నివృత్తి చేసుకునేందుకు, ప్రభుత్వ పథకాల్లో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారానికి, అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు కోసం డయల్‌ ఏపీ కేంద్రం ఉంటుంది.

ఈ-కార్యాలయం విశేషాలివీ....
* ఇప్పటికే కీలకమైన ప్రభుత్వ విభాగాలన్నిటిలో కాగిత రహిత పరిపాలన అమలు జరుగుతోంది. దీంతో ఒక అధికారి నుంచి మరో అధికారికి దస్త్రం తిరిగే సమయం తగ్గింది.
* దస్త్రం ఎప్పుడు...ఎవరి దగ్గర ఎన్నిరోజులుందో తెలుసుకోవచ్చు. నిర్ణీత గడువు దాటినా దస్త్రాన్ని ఎందుకు పరిష్కరించలేదో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధానంతో అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందుతుంది.
* ఉన్నతాధికారులు కార్యాలయంలో లేనప్పటికీ, అవసరమైన, అత్యవసరమైన దస్త్రాలను ఈ-కార్యాలయం సాఫ్ట్‌వేర్‌ ద్వారా వెంటనే పరిష్కరించవచ్చు.

తొలిదశలో 10 విభాగాలు...
ఈ-ప్రగతి ప్రాజెక్టును తొలిదశలో 10 విభాగాల్లో అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే ప్రాథమిక, వ్యవసాయ రంగాలకు సంబంధించి ఈ-ప్రగతి ప్రాజెక్టు టెండరు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెలాఖరు నాటికి పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవనుంది. 2016 డిసెంబరు నాటికి తొలిదశ పూర్తవుతుంది. రెండోదశలో నీటిపారుదల, రవాణా, మౌలిక సదుపాయాలు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, కార్మిక, మహిళా శిశుసంక్షేమ, గృహనిర్మాణ తదితర శాఖల్లో అమలు చేస్తుంది. మిగతా ప్రభుత్వ విభాగాలకు సంబంధించి మూడోదశలో ప్రాజెక్టును 2017 డిసెంబరుకు పూర్తిచేయనుంది.
 

ఐటీకి తగ్గిన కేటాయింపులు
10ap-panel9c.jpg
ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలో ఐటీ అభివృద్ధికి 2016-17 ఆర్థికసంవత్సరానికి రూ.360.21 కోట్లు కేటాయించారు. ఇది గత కేటాయింపు(రూ.370 కోట్లు) కంటే స్వల్పంగా తక్కువ. ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలతో కూడిన ప్రైవేటు భవనాలను డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు (డీటీపీ)లుగా ప్రభుత్వం గుర్తించనుంది. ఈ పార్కుల్లో ఐటీ కంపెనీలు కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేందుకు సర్కారు ప్రోత్సాహకాలు ప్రకటించింది. డీటీపీలను ప్రోత్సహించేందుకు, ఐటీ ప్రచారం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగానే కేటాయింపులు చేసింది. ఈ కేటగిరీలో రూ.123.65 కోట్లు పేర్కొంది. ఇంజినీరింగ్‌, ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.4 కోట్లు కేటాయించింది. విశాఖలో 600 ఎకరాల్లో, విజయవాడలో 500 ఎకరాల్లో, తిరుపతిలో 225 ఎకరాల్లో ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 కోట్లు, ఏపీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆర్కిటెక్చర్‌కు (ఈ-ప్రగతి) రూ.17.53 కోట్లు, ఎలక్ట్రానిక్స్‌ ఐటీ ఏజెన్సీకి రూ.146.87 కోట్లు, జాతీయ ఈ-పరిపాలన ప్రణాళికకు రూ.49.40కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఐటీ రంగం
10ap-panel9d.jpg
ఏం చెప్పారు
* రాష్ట్రస్థాయి ఎంటర్‌ప్రైజెస్‌ ఆర్కిటెక్ట్‌ నిర్మాణం
* రాష్ట్రానికి ప్రత్యేక డేటా కేంద్రం ఏర్పాటు
* అర్హులకు ప్రయోజనాలు.. అవినీతిరహిత, పారదర్శక పాలన.
* ఐటీ ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కేటాయింపు

10ap-panel9b.jpg ఏం చేశారు
ఐటీ, ఎలక్ట్రానిక్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. చిత్తూరు జిల్లాను మొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఐదు ఎలక్ట్రానిక్‌ తయారీ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ఐటీ ప్రగతిలో కీలకం కానుంది. ఏప్రిల్‌ నుంచి ఇంటింటికీ రూ.150కే అంతర్జాలం, కేబుల్‌ సేవలు అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండో విడత ప్రాజెక్టు సమగ్ర నివేదిక కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. రానున్న మూడేళ్లలో రూ.2,400 కోట్ల ఖర్చుతో ఈ-ప్రగతి ప్రాజెక్టు చేపట్టనున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
నెట్టింట్లోనే రిజిస్ట్రేషన్‌!
 
 
636422470923402324.jpg
  • ఎప్పుడైనా ఈసీ తీసుకునే వీలు
  • డాక్యుమెంట్‌ తయారీ, ఫీజు ఆన్‌లైన్‌లోనే!
  • వేలిముద్రలు, ఫొటోలకే రిజిస్ట్రార్‌ ఆఫీసుకు
  • ఉచితంగానే ఈసీ, సీసీ ప్రింట్‌.. నిషేధిత భూములూ అందుబాటులో
  • దసరా తర్వాత ప్రారంభం.. భారీ సంస్కరణలకు రంగం సిద్ధం
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే... అదో పెద్ద తతంగం! ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిటింగ్‌! డాక్యుమెంట్‌ తయారీ నుంచి దానిపై సబ్‌ రిజిస్ట్రార్‌ స్టాంపు పడేదాకా... టెన్షన్‌! ఇక... ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) తీసుకోవాలంటే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లాలి. లేదా... ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకోవాలి. పలు సందర్భాల్లో అంతో ఇంతో ‘ఇస్తే’ కానీ ఈసీ చేతికి రాదు! ఈ సమస్యలన్నింటికీ త్వరలోనే తెరపడనుంది. రిజిస్ట్రేషన్లలో అతి కీలకమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకపై ఇంట్లో కూర్చునే ఈసీ పొందవచ్చు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 90 శాతం పనిని కూడా ఇంటి నుంచే పూర్తి చేయవచ్చు.
 
లక్షలాది మందికి మేలు జరిగేలా... రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు సులువుగా సాగేలా ప్రభుత్వం సరికొత్త చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), సర్టిఫైడ్‌ కాపీ(సీసీ)లు తీసుకునేందుకు మీ సేవకో, రిజిస్ర్టేషన్‌ కార్యాలయానికో వెళ్లాలి. ఆ సర్టిఫికెట్ల కోసం నిర్ణీత ఫీజు కూడా చెల్లించాలి. ఇకపై దరఖాస్తుతో అవసరం లేకుండానే భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. దీనికోసం ఇప్పటికే 3 కోట్ల డాక్యుమెంట్లను స్కాన్‌ చేశారు.
 
విజయదశమి అనంతరం ఏపీఐజీఆర్‌ఎ్‌స.ఇన్‌లో పెట్టనున్నారు. భూమి లేదా ఆస్తి ప్రస్తుతం ఎవరి పేరిట ఉంది? దాని ‘లింక్‌లు’ ఎప్పుడెప్పుడు రిజిస్టర్‌ అయ్యాయి? వంటి వివరాలన్నీ ఇంట్లో కూర్చుని, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఈసీ లేదా సీసీ ప్రింట్‌ కావాలంటే ఇప్పుడు వసూలు చేస్తున్న ఫీజు రూ.200లు ఆన్‌లైన్‌లో కట్టేసి వెంటనే తీసుకోవచ్చు. అది సంబంధిత సబ్‌ రిజిస్ర్టార్‌ డిజిటల్‌ సంతకంతో, అధికారికంగా వస్తుంది. మరోవైపు... ఆన్‌లైన్‌లో తీసుకునే కాపీలకు ఫీజును రద్దు చేసి, ఉచితంగానే ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
 
డాక్యుమెంట్‌ తేలిక
రిజిస్ర్టేషన్‌ కోసం రోజంతా పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా... అరగంటలోనే ముగించేందుకు కూడా రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఒక ఆస్తిని అమ్మకం/కొనుగోలుకు ముందుగా రిజిస్ర్టేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్‌ తయారు చేయించాలి. ఇందుకు డాక్యుమెంట్‌ రైటర్‌ను ఆశ్రయించాలి. తర్వాత బ్యాంకుకు వెళ్లి చలానా రూపంలో ఫీజులు కట్టాలి. ఆపై రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో తతంగం! ఎంతోకొంత ఇచ్చుకుంటే తప్ప రిజిస్ట్రేషన్‌ పూర్తి కాదన్నది బహిరంగ రహస్యమే! రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పని జరగదన్న విషయమూ అందరికీ తెలుసు. త్వరలోనే ఈ ప్రహసనానికి తెరపడనుంది. ఆధార్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు... ఇంట్లోనే డాక్యుమెంట్‌ తయారు చేసుకోవచ్చు.
 
ఆస్తి విక్రేత, కొనుగోలుదారుల ఆధార్‌ నెంబర్లు ఎంటర్‌ చేస్తే... వారి చిరునామాలు, వివరాలు ఆటోమేటిక్‌గా సర్వర్‌ నుంచి వచ్చేస్తాయి. డాక్యుమెంట్‌ నెంబరు, సర్వే నెంబరు ఎంటర్‌ చేస్తే ఆ భూమి వివరాలు, సరిహద్దులు అన్నీ వస్తాయి. అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన ఒక ప్రొఫార్మాతో డాక్యుమెంట్‌ సిద్ధమవుతుంది. రిజిస్ర్టేషన్‌ ఫీజు, స్టాంపు డ్యూటీ ఎంతో అక్కడే తెరపై క్లిక్‌ చేస్తే తెలిసిపోతుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఫీజు, స్టాంప్‌ డ్యూటీ అక్కడే చెల్లించవచ్చు. ఈ మొత్తం కార్యక్రమం 15 నిమిషాల్లో ముగుస్తుంది. ఈ డాక్యుమెంట్‌ ఆన్‌లైన్‌లోనే సంబంధిత సబ్‌ రిజిస్ర్టారుకు వెళ్లిపోతుంది. ఇది ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తా? రిజిస్ట్రేషన్‌కు అర్హమేనా? తదితర వివరాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అది ‘ఓకే’ అయితే... విక్రేత, కొనుగోలుదారు కలిసి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లి వేలిముద్రలు, ఫొటోలు దిగితే సరిపోతుంది. దీనికి 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదని ఉన్నతాధికారులు అంటున్నారు. మొత్తంగా అరగంటలోనే రిజిస్ర్టేషన్‌ పూర్తయిపోతుందన్న మాట!
 
అంతా పారదర్శకం...
త్వరలో ఆన్‌లైన్‌ చేయనున్న మూడుకోట్ల డాక్యుమెంట్లను ఎవరైనా, ఉచితంగానే చూసుకునే వీలుంటుంది. మరోవైపు ప్రభుత్వ ఆస్తులు, దేవాదాయ శాఖ భూములు, అటవీ భూములు, వివిధ శాఖలకు చెందిన భూములు రిజిస్ర్టేషన్‌ కావు. ఇవన్నీ ‘ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌’ (పీవోటీ) జాబితాలో ఉంటాయి. ఈ జాబితాను కూడా వెబ్‌సైట్‌లో పెడతారు. ఈసీల్లో ఇదంతా కనిపిస్తుంది. అదే సమయంలో ఒక ఆస్తి అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్‌ తయారుచేసేటప్పుడు... సదరు ఆస్తి పీవోటీ జాబితాలో ఉంటే డాక్యుమెంట్‌ తయారు కాదు. క్రయ విక్రయాల్లో మోసాలు జరగకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.
 
విశాఖలో ప్రయోగాత్మకంగా...
డాక్యుమెంట్‌లను నెట్‌లోనే తయారు చేసుకునే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దాదాపు 8 వేల మంది ఈ పద్ధతిని ఉపయోగించుకున్నారు. ఆ క్రమంలో దాదాపు వంద రకాల సమస్యలు వచ్చాయి. పేమెంట్‌ గేట్‌ వే (ఫీజుల చెల్లింపునకు)లో ఇబ్బందులు, డాక్యుమెంట్ల తయారీలో సంక్లిష్టత వంటి అంశాలను గుర్తించారు. వాటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, సవరించి, సాంకేతికత జోడించి సరిదిద్దారు. దసరా తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ఈ సంస్కరణలను ప్రారంభించనున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

ధ్రువపత్రాల రహిత పాలన

మార్చిలోపు ‘ఈ-ప్రగతి’ పనులు పూర్తి: మంత్రి నారా లోకేష్‌

16ap-state5a.jpg

ఈనాడు, అమరావతి: పౌరులకు ధ్రువపత్ర రహిత పాలన(సర్టిఫికెట్‌-లెస్‌ గవర్నెన్స్‌) అందించనున్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నింటిని అనుసంధానం చేసి, పౌరులకు అన్ని సేవలు ఒకే వేదికపై అందించేందుకు రూపొందించిన ‘ఈ-ప్రగతి’ పనులకు సంబంధించి కీలక అడుగుపడింది. కోర్‌ ప్లాట్‌ఫాం(కేంద్రీకృత వేదిక) రూపకల్పన పనులను అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ‘ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌’(ఈ అండ్‌ వై) సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘ఈ-ప్రగతి’ పథకం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాల గురించి కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. పౌరులకు కావాల్సిన ఎలాంటి సేవలైనా ఒకే చోట లభించేలా, ధ్రువపత్ర రహిత పాలన అందించాలనేది లక్ష్యమన్నారు. ప్రతి పౌరుడికి ఒక నెంబరు ఇస్తే దాని ఆధారంగా అతడికి కావాల్సిన అన్ని ధ్రువపత్రాలు డిజిటల్‌ రూపంలో అందాలన్నారు. ఈ దిశగా ఈ-ప్రగతి కోర్‌ ప్లాట్‌ఫాం రూపొందించాలన్నారు. ప్రతివారం ‘ఈ-ప్రగతి’ కోర్‌ కమిటీని సమావేశపరచి ప్రగతిని సమీక్షిస్తామని.. మార్చిలోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ-ప్రగతి కోర్‌ప్లాట్‌ ఫాం పనుల అప్పగింత కోసం వినూత్నంగా కంపెనీల మధ్య ‘హ్యాక్‌థాన్‌’ నిర్వహించిన ‘ఈ-ప్రగతి’ బృందాన్ని మంత్రి లోకేష్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఐటీ సలహాదారు సత్యనారాయణ, ఈ-ప్రగతి ముఖ్య కార్యనిర్వహణాధికారి బాలసుబ్రమణ్యం, ఆయన నేతృత్వంలో పని చేసిన బృందాన్ని మంత్రి పేరుపేరునా అభినందించారు. మన రాష్ట్రమే తొలిసారిగా హ్యాక్‌థాన్‌ నిర్వహించి ఇలా కంపెనీని ఎంపిక చేసిందని బాలసుబ్రమణ్యం మంత్రికి వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలను, డాటాను అనుసంధానం చేయడంలో వేగంగా పనిచేయాలని మంత్రి లోకేష్‌ సూచించారు. ఈ కార్యక్రమానికి నిధుల సమస్య లేదని, ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కేటాయించామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌, ఈ అండ్‌ వై సంస్థ ప్రతినిధులు, ఐటీ సలహాదారు సత్యనారాయణ, జేఏ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

 
Link to comment
Share on other sites

ఆన్‌లైన్‌లో నిరభ్యంతర పత్రాలు

పది రోజుల్లో దరఖాస్తుదారు చేతికి

ఏడు అంచెల విధానంలో జారీ

ఇక కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగాల్సిన పనిలేదు

కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన ఏపీ అగ్నిమాపక శాఖ

ఈనాడు - అమరావతి

18ap-main17a.jpg

మీ భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం పొందాలనుకుంటున్నారా? గతంలో మాదిరి దరఖాస్తు చేసుకుని దాని కోసం కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగక్కరలేదు. పత్రం ఎప్పుడు చేతికొస్తుందాని నెలల తరబడి నిరీక్షించాల్సిన పని లేదు. ఇకపై అన్ని రకాల నిరభ్యంతర పత్రాలను ఆన్‌లైన్‌లోనే జారీ చేసే నూతన విధానానికి ఆంధ్రప్రదేశ్‌ అగ్నిమాపక శాఖ శ్రీకారం చుట్టింది. మొత్తం ఏడు అంచెల ప్రక్రియలో భాగంగా గరిష్ఠంగా పది రోజుల గడువు తీసుకుంటుంది. అగ్నిమాపక శాఖ డీజీ కె.సత్యనారాయణ ఈ సరికొత్త విధానాన్ని తాజాగా అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఇప్పటివరకూ అగ్నిమాపక శాఖ జారీ చేసిన నిరభ్యంతర పత్రాలన్నింటిని కూడా డిజిటలైజ్‌ చేశాం.’’ అని ఆయన వివరించారు.

* రిజిస్ట్రేషన్‌: నిరభ్యంతర పత్రం కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు తొలుత www.fireservices.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో ‘‘అప్లై ఫర్‌ ప్రొవిజినల్‌ ఎన్‌వోసీ’’ అని ఆంగ్లంలో ఉన్న దానిపైన క్లిక్‌ చేయాలి. పేరు, ఈమెయిల్‌ చిరునామా, ఫోన్‌నెంబరు, పుట్టిన తేదీ, ఆధార్‌కార్డు సంఖ్య, చిరునామా తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. దరఖాస్తుదారు ఫోన్‌ నెంబరుకు ఒక రహస్య సంకేతం (పాస్‌వర్డ్‌) వస్తుంది. దానిని నమోదు చేయాలి. అప్పుడు నిరభ్యంతర పత్రాల పోర్టల్‌లోకి ప్రవేశం లభిస్తుంది.

* దరఖాస్తు: నిరభ్యంతర పత్రాల పోర్టల్‌లో లాగిన్‌ అయిన తర్వాత దరఖాస్తుదారు ప్రొవిజనల్‌ నిరభ్యంతర పత్రం లేదా ఆక్యుపెన్సీ ధ్రువపత్రం కోసం సిద్ధం చేసిన దరఖాస్తును నింపి ఆన్‌లైన్‌లోనే దాన్ని సమర్పించాలి.

* తనిఖీ, నివేదిక: ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తు సంబంధిత ప్రాంతీయ, జిల్లా అగ్నిమాపక శాఖాధికారులు, సెక్షన్‌ అధికారుల డ్యాష్‌బోర్డుపై ప్రత్యక్షమవుతుంది. ప్రాంతీయ, జిల్లా అధికారులు ఆ దరఖాస్తును సమీక్షించడం, నిర్మిత ప్రదేశాన్ని తనిఖీ చేయడం తదితర ప్రక్రియలు పూర్తి చేసి తనిఖీ నివేదికను రూపొందిస్తారు. సెక్షన్‌ అధికారులు దరఖాస్తు, భవన నిర్మాణ ప్రణాళిక తదితరాలు పరిశీలించి నోట్‌ రూపొందిస్తారు. తనిఖీ నివేదిక, సెక్షన్‌ అధికారులు సిద్ధం చేసిన నోట్‌ను సీనియర్‌ అధికారులు సమీక్షించి తమ అభిప్రాయాన్ని పొందుపరుస్తారు.

* జారీ లేదా తిరస్కరణ: సీనియర్‌ అధికారుల అభిప్రాయం, ప్రాంతీయ, జిల్లా అగ్నిమాపక శాఖాధికారుల తనిఖీ నివేదికను పరిశీలించిన అనంతరం అగ్నిమాపక శాఖ డీజీ నిరభ్యంతర పత్రాన్ని జారీ చేయొచ్చు లేదా తిరస్కరించొచ్చు. నిరభ్యంతర పత్రం జారీకి నిర్ణయిస్తే దాని ప్రతిని పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. తిరస్కరిస్తే అందుకు గల కారణాలేమిటి అనేది వివరిస్తూ రూపొందించిన లేఖను అందులో పొందుపరుస్తారు. నిరభ్యంతర పత్రం జారీ చేసినా, తిరస్కరించినా ఆ సమాచారాన్ని దరఖాస్తుదారుకు మెయిల్‌, ఫోన్‌ ద్వారా తెలియజేస్తారు.

* నిరభ్యంతర పత్రం పొందడం: సెల్‌ఫోన్‌కు వచ్చే సంక్షిప్త సందేశం ఆధారంగా దరఖాస్తుదారు తనకు కేటాయించిన రహస్య సంకేతం ద్వారా పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యి.. నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ప్రతిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు తిరస్కరిస్తే అందుకు గల కారణాలను సూచిస్తూ రాసిన లేఖను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

Link to comment
Share on other sites

  • 3 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...