Jump to content

Krishna River Management Board


Recommended Posts

సాగే మా జీవనాడి

మాకే నీటి అవసరాలెక్కువ

ట్రైబ్యునల్‌కు రాష్ట్రం నివేదన

తెలంగాణ వాదనకు కౌంటర్‌

ఈనాడు - అమరావతి

4ap-main1a.jpg

‘ఆంధ్రప్రదేశ్‌ వరి పండించేందుకు ఆస్కారమున్న ప్రాంతం. దేశానికే ధాన్యాగారంగా పేరుంది. ఏ సౌకర్యాలూ లేని కొత్త రాష్ట్రం భవిష్యత్తంతా సాగుపైనే ఆధారపడి ఉంది. ఇక్కడే సాగునీటి అవసరాలెక్కువ’ అని బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట రాష్ట్రం వాదనలు వినిపించింది. ఇక్కడ పురాతన డెల్టా వ్యవస్థలున్నాయని, కృష్ణా బేసిన్‌ నుంచి ఇతర బేసిన్లకు మళ్లింపు 100ఏళ్ల కిందట నుంచే ఉందని బచావత్‌ ట్రైబ్యునల్‌ గుర్తించిందని, ఇక్కడి నేలలు వరి సాగుకు యోగ్యమైనవని, అదే సమయంలో తెలంగాణలో ఖనిజాలు ఎక్కువని, సింగరేణి బొగ్గు గనులున్నాయని, అక్కడి నేలలు ఆరుతడి పంటలకు మాత్రమే యోగ్యమైనవని, బయ్యారం గనుల నుంచే వారికి రూ.లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ అధికారులు తమ వాదనలో పేర్కొన్నారు. తెలంగాణ సమర్పించిన వాదనలకు ప్రతిగా ఆంధ్రప్రదేశ్‌ ఈ వాదనను గురువారం ట్రైబ్యునల్‌కు సమర్పించింది.

* 2014లో రాష్ట్రం విడిపోయే నాటికే తెలంగాణ మిగులు రెవెన్యూతో ఉంది. అంతర్జాతీయ ఐటీ హబ్‌ హైదరాబాద్‌లో ఉంది. ఉద్యోగాలు, పరిశ్రమలు అక్కడే ఎక్కువ. వీటి నుంచి ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయమే ఎక్కువ. మరోవైపు ఆంధ్రపదేశ్‌ కొత్త రాజధానిని నిర్మించుకోవాలి. ఇక్కడ సాగు, తాగు, ఇతరత్రా నీటి అవసరాలు ఎక్కువ. అనేక ప్రాజెక్టులు కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నాయి.

* రాష్ట్ర పునర్విభజన చట్టం పేర్కొన్నట్లు కృష్ణా నది మొత్తాన్ని ఒక హైడ్రలాజికల్‌ యూనిట్‌గా తీసుకుని నీటి లోటు ఏర్పడ్డప్పుడు ఏ ప్రాధాన్యాల ప్రకారం వినియోగించుకోవాలో ట్రైబ్యునల్‌ తేల్చాలి.

* 60 రోజుల్లో రుతుపవనాలద్వారా వచ్చే 75శాతం నీటిని తీసుకునేలా తెలంగాణ తన వాదన వినిపిస్తోంది. దీనివల్ల దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా నష్టపోతుంది.

* తెలుగుగంగ, రాజోలిబండ మళ్లింపు పథకం కుడి కాలువ నీటి కేటాయింపులను మార్చడానికి వీలులేదు. పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబ్యునల్‌కు ఆ పరిధి లేదు.

* కృష్ణా డెల్టాకు 113 టీఎంసీలే సరిపోతాయనే తెలంగాణ వాదన అర్థరహితం. ఆధునికీకరణ పూర్తయిన తర్వాతే 152 టీఎంసీలు అవసరమవుతాయని లెక్క తేల్చారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల రాయలసీమ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్నదే తప్ప కొత్త ప్రాజెక్టు కాదు. ఆర్డీఎస్‌ ఆధునికీకరణ పనులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినవే. ఆర్డీఎస్‌ ఎత్తు పెంచితే కేసీ కాలువ రైతుల హక్కులకు భంగం కలుగుతున్నందున ఇందుకు ఏపీ అంగీకరించబోదు.

* ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే కుదిరిన అంగీకారం మేరకు ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, లోటు సందర్భంలో ప్రోటోకాల్‌ మాత్రమే నిర్ణయించాల్సి ఉంది.

Link to comment
Share on other sites

చర్చల తర్వాతే టెలీమెట్రీలపై ముందుకు

కృష్ణా బోర్డు నిర్ణయం

తెలంగాణ అభ్యంతరాల నేపధ్యంలోనే..

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే టెలిమెట్రీల ఏర్పాటుపై ముందుకెళ్లాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. టెలిమెట్రీల ఏర్పాటుకు సంబంధించి తొలిదశలో నిర్ణయించిన కొన్ని స్థానాల్లో మార్పులు చేయడం పట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకొంది. బోర్డు ఎప్పుడూ ఏ రాష్ట్రం పట్ల పక్షపాతం చూపలేదని, వాస్తవాల ఆధారంగానే వ్యవహరించిందని పేర్కొంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లకు బోర్డు సభ్యకార్యదర్శి సమీర్‌ఛటర్జీ గురువారం లేఖ రాశారు.

మొదటి దశలో 18 చోట్ల, రెండో దశలో 29 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. తొలిదశలో పోతిరెడ్డిపాడు, సాగర్‌ ఎడమకాలువపై ఆంధ్ర సరిహద్దులో ఉన్న పాయింట్లను మొదట నిర్ణయించినట్లు కాకుండా కొంత మార్పు చేసింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ కోటాకు మించి నీటిని వాడుకొందని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడంపైనా అభ్యంతరం ప్రకటించింది. బోర్డు పక్షపాతంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఈఎన్‌సీ లేఖ కూడా రాశారు. దీనికి సమాధానంగా సభ్యకార్యదర్శి రెండు రాష్ట్రాలకూ లేఖ రాశారు. తదుపరి నిర్ణయం తీసుకొనే వరకు టెలిమెట్రీల ఏర్పాటును నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ‘టెలిమెట్రీల ఏర్పాటుకు 2016లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించాం. మొదటి దశలో మూడు ప్రాజెక్టుల్లో 18చోట్ల ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించిన తర్వాతే గుత్తేదారుకు అప్పగించి పని ప్రారంభించాం. రెండు రాష్ట్రాల్లో సమానంగా టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలనే అంశం తర్వాత తెరపైకి వచ్చింది. ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో బోర్డు లేఖ రాసింది. టెలిమెట్రీల పనులకు ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు కల్పించడాన్ని జలవనరుల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లకుండా తెలంగాణ ఎక్కువ నీటి వాడకాన్ని మాత్రమే తీసుకెళ్లారని తెలంగాణ అనడం సరికాదు. గుత్తేదారు ఏప్రిల్‌ 10న రాసిన లేఖను 14న గుడ్‌ఫ్రైడే రోజు పంపారు. వరుసగా సెలవులు కావడంతో 17న లేఖ చేరింది. ఈ కారణంగానే 13న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో టెలిమెట్రీల అంశం లేదు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని మొదట నిర్ణయించి తర్వాత 12.265 కి.మీ.వద్దకు మార్చడానికి సాంకేతిక కారణాలే కారణం. ఈ ప్రాంతాన్ని బోర్డు, కేంద్ర జలసంఘం సిబ్బంది కూడా పరిశీలించారు’ అని లేఖలో పేర్కొన్నారు. సాగర్‌ ఎడమకాలువకు సంబంధించి కూడా వివరణ ఇచ్చారు.

త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా

ఈ నెల 5న త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని కృష్ణా బోర్డు తొలుత నిర్ణయించింది. ప్రాజెక్టుల పర్యవేక్షణ ఉన్నందున ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరడంతో వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.

Link to comment
Share on other sites

కృష్ణా డెల్టాకు నీరు అవసరమా?

శ్రీశైలం, పులిచింతలలో ఆవిరయ్యే నీటినీ లెక్కగట్టాలి

ట్రైబ్యునల్‌ను కోరిన తెలంగాణ

ఏపీ వాదనకు 87 అంశాలతో సమాధానం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులో తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, కృష్ణా బేసిన్‌లో కాకుండా పక్కబేసిన్‌లో జరిగిన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని పునఃకేటాయింపు చేయాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ను కోరింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ చేసిన 811 టీఎంసీల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలకు రెండు రాష్ట్రాలు అంగీకరించినట్లుగా ఆ రాష్ట్రం పేర్కొందని, ఇది పూర్తిగా తప్పు అని తెలిపింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నదానిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట తమ వాదనలను దాఖలు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన వాదనకు తెలంగాణ సమాధానం ఇచ్చింది. మొత్తం 87 అంశాలతో కూడిన సమాధానాన్ని తెలంగాణ దాఖలు చేసింది.

* బచావత్‌ ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ అవసరాలను పట్టించుకోలేదు. సంరక్షణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ నీటిని పొందింది. ఇప్పుడు కొనసాగించమని కోరుతోంది. కానీ, తెలంగాణకు ప్రత్యేకించి కృష్ణాబేసిన్‌లోని ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆధునికీకరణ ద్వారా కృష్ణాడెల్టాలో 29 టీఎంసీలు, కేసీ కాలువలో తొమ్మిది టీఎంసీలు ఆదా అయినట్లు పేర్కొన్నారు. కానీ, ఈ ప్రాజెక్టుల్లో కేటాయించిన నీటికంటే ఎక్కువ వినియోగం జరుగుతోంది.

* కృష్ణాడెల్టా ఆధునికీకరణ నివేదిక ప్రకారం మొదటి పంట 10.5 లక్షల ఎకరాల సాగులో 29 టీఎంసీలు ఆదా అవుతాయి. ఈ నివేదికలోనే స్థానిక డ్రెయిన్లలో లభించే 42.53 టీఎంసీల్లో 20 టీఎంసీలను వినియోగించుకోవచ్చని, భవిష్యత్తులో మొత్తం కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది. కాబట్టి ఆదా అయిన నీటిని 29 టీఎంసీలకే పరిమితం చేయడం సరికాదు. దీంతోపాటు ఆయకట్టు ప్రాంతం రాజధాని అభివృద్ధికి, ఆక్వాకల్చర్‌కు కూడా ఎక్కువగా పోయింది. సాగయ్యే ప్రాంతం తగ్గిపోయింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొంటే కృష్ణాడెల్టాకు 100 టీఎంసీల కంటే తక్కువ సరిపోతాయి. అసలు కృష్ణాడెల్టాకు నీటి కేటాయింపు అవసరమా అన్నది పరిశీలించాలి.

* పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్‌ నీటిని మళ్లించకుండా ట్రైబ్యునల్‌ నియంత్రించాలి.

* చాలా ఎక్కువ నీటిని కేటాయించాలని ట్రైబ్యునల్‌ను ఏపీ కోరింది. ప్రస్తుత వినియోగాన్ని కొనసాగిస్తూనే కొత్తగా సాగునీటి అవసరాలకు 547 టీఎంసీలు కోరింది. రాజధాని ప్రాంతానికి 9 నుంచి పది టీఎంసీలు కోరింది. రాజధాని ప్రాంతం మొత్తం కృష్ణాడెల్టా, నాగార్జునసాగర్‌ కుడి, ఎడమకాలువలు, గుంటూరు ఛానల్‌ ఆయకట్టు ప్రాంతంలోనే ఉంది. ఇదంతా పట్టణ ప్రాంతంగా మారినందున ఆయకట్టుకు నీరు అవసరం లేదు.

* శ్రీశైలం, పులిచింతలలో ఆవిరయ్యే నీటిని రాష్ట్రాల వారీగా వినియోగ వాటా ప్రకారం లెక్కగట్టాలి. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 512 టీఎంసీలకు బదులు 155.40 టీఎంసీలు సరిపోతాయి. తాగునీరు, ఇతర అవసరాలన్నీ కలుపుకొంటే 162.42 టీఎంసీలు కేటాయిస్తే సరిపోతుంది.

Link to comment
Share on other sites

కృష్ణాట్రైబ్యునల్‌ విచారణ జులై 6, 7 తేదీలకు వాయిదా

ఈనాడు, దిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జల వివాద పరిష్కారంపై విచారణను కృష్ణాట్రైబ్యునల్‌ జులై 6, 7 తేదీలకు వాయిదా వేసింది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వాడుకోవడం ఎలా అన్నదానిపై రెండురాష్ట్రాలు తమ వాదనలను ట్రైబ్యునల్‌ ముందు దాఖలుచేశాయి. ఈ వాదనలపై ఇరురాష్ట్రాలు ఈనెల 30వ తేదీలోపు రిజాయిండర్లు దాఖలుచేయాలని గురువారం ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఏమైనా ముసాయిదా అంశాలు ఉంటే జూన్‌ 15లోపు దాఖలుచేయాలని సూచిస్తూ తదుపరి విచారణను జులై 6, 7 తేదీలకు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

మున్నేరు’పై సమస్యలు పరిష్కరించుకోండి

ఈనాడు, హైదరాబాద్‌: మునియేరు (మున్నేరు) మధ్యతరహా ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలని, ఇందుకు సంబంధించిన వివరాలను తమకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో పొంతనలేని వివరాలున్నాయని, వీటిపై వివరణ ఇవ్వాలని కోరింది. మున్నేరు, శివభాష్యం రిజర్వాయర్ల డీపీఆర్‌లను పరిశీలించిన బోర్డు తన అభిప్రాయాలను వెల్లడించింది. ‘మున్నేరు మధ్యతరహా ప్రాజెక్టును జైకా నిధులతో ఆధునికీకరిస్తున్నాం తప్ప బ్యారేజి నిర్మాణానికి సంబంధించిన పనులు కాదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. కర్నూలు జిల్లాలో చిన్ననీటి వనరులకు ఉన్న ఆరున్నర టీఎంసీల్లో ఆదా అయిన నీటిని వాడుకుని ఒక టీఎంసీ సామర్థ్యంతో శివభాష్యం ప్రాజెక్టును చేపట్టినట్లు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి చెప్పారు. ఈ ప్రాజెక్టు కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల్లో లేదు. రెండో ట్రైబ్యునల్‌ ముందు ప్రతిపాదన ఉన్నట్లు కూడా ప్రస్తావించలేదు. అందువల్ల పూర్తివివరాలు ఇవ్వాలి’ అని బోర్డు పేర్కొంది. ఫిబ్రవరి 8న కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశంలో తీసుకొన్న నిర్ణయం ప్రకారం తెలంగాణ 31 టీఎంసీల నీరు వాడుకోవాల్సి ఉండగా, 3.269 టీఎంసీలు ఎక్కువగా వాడుకొందని ఆంధ్రప్రదేశ్‌ ఏప్రిల్‌ 12న బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ తదుపరి నీరు తీసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరింది.

Link to comment
Share on other sites

మిగులు జలాలపై హక్కు మాకే

పోలవరం నుంచి నీటి మళ్లింపు ప్రస్తుత ట్రైబ్యునల్‌ పరిధిలో లేదు

పాలమూరు- రంగారెడ్డి, దిండి కొత్త పథకాలే

బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఎదుట తెలంగాణ వాదనకు ఏపీ జవాబు

ఈనాడు - హైదరాబాద్‌

పోలవరం ద్వారా గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌లోకి మళ్లించే నీటి అంశం ప్రస్తుత ట్రైబ్యునల్‌ పరిధిలో లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. ట్రైబ్యునల్‌ పంపిణీ చేసిన నీటికి మించి వచ్చే మిగులు జలాలపై దిగువ రాష్ట్రంగా తమకే హక్కు ఉంటుంది తప్ప తెలంగాణకు కాదని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలు కొత్తవేనని, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మించింది తప్ప గోదావరి నుంచి మళ్లించే నీటిపై ఆధారపడి కాదని చెప్పింది. బ్రిజేష్‌మార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట తెలంగాణ దాఖలు చేసిన వాదనకు ఆంధ్రప్రదేశ్‌ జవాబిచ్చింది. దీనిలో తెలంగాణ ప్రాజెక్టులపై సవివరంగా నివేదించింది. ముఖ్యాంశాలివీ..

పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత ఈ ప్రాజెక్టులను చేపట్టారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 84, 85(8)(డి), 11వ షెడ్యూలులోని ఏడో పేరాకు ఇది వ్యతిరేకం. 2015 జూన్‌ 11న దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. రైతులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ పరిష్కరించాలని సూచించింది. 2016 సెప్టెంబరు 21న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌లో దీనిపై చర్చ జరిగింది. ఈ అంశం ఇంకా అపెక్స్‌ కౌన్సిల్‌ వద్ద పెండింగ్‌లో ఉంది.

* ఎస్‌ఎల్‌బీసీ పథకాన్ని గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటితో సహా మొత్తం నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని చేపట్టినట్లు తెలంగాణ తన వాదనలో పేర్కొంది. గోదావరి నుంచి మళ్లించే నీటితో ఈ పథకాన్ని జలసంఘం అనుమతించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఈ ప్రాజెక్టును వరద జలాలు/ మిగులు జలాల ఆధారంగా పూర్తి చేసింది.

* కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల పరిధిని పునర్విభజన చట్టానికి భిన్నంగా పెంచింది.

* మొత్తం మిగులు జలాలను తెలంగాణ కోరడం సరికాదు. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం దిగువ రాష్ట్రానికి జరిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని మిగులు జలాలను వాడుకొనే అవకాశముంది. దిగువన ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కే మిగులుజలాలు చెందుతాయి.

* ఆర్డీఎస్‌ కుడికాలువ, తెలుగుగంగ కేటాయింపులను మార్చాలనడం సరికాదు.

* పోలవరం ద్వారా కృష్ణా బేసిన్‌లోకి మళ్లించే గోదావరి నీటి అంశం ప్రస్తుత ట్రైబ్యునల్‌ పరిధిలోకి రాదు. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 90(3) ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ అంగీకారం ఉన్నట్లే. అయితే ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉంది. పోలవరం నుంచి మళ్లించే నీటిలో వాటా కోరుతూ తెలంగాణ ఈ ట్రైబ్యునల్‌ ముందు క్లెయిం చేయడం సరికాదు.

* తెలంగాణ గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌లోకి 211 టీఎంసీలను మళ్లిస్తుంది. ఇందులో ఎస్సారెస్పీ మొదటి దశ, రెండో దశ, వరదకాలువ, సీతారామ ఎత్తిపోతల, ప్రాణహిత- చేవెళ్ల, గోదావరి ఎత్తిపోతల పథకాలున్నాయి.

* ఆర్డీఎస్‌ ఆనకట్టను ఆరు అంగుళాలు పెంచే అంశం కూడా ఈ ట్రైబ్యునల్‌ పరిధి కాదు. కేసీకాలువ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ అంశాన్ని అనుమతించకూడదు. ఇది కాకుండా ఆర్డీఎస్‌ కాలువల ఆధునికీకరణ అంశం తెలంగాణ, కర్ణాటకలకు సంబంధించినది. ప్రస్తుత ట్రైబ్యునల్‌కు సంబంధం లేదు.

* పునర్విభజన చట్టం ప్రకారం అంగీకరించినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 512 టీఎంసీలకు, తెలంగాణకు ఉన్న 299 టీఎంసీలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసి ఆపరేషన్‌ ప్రోటోకాల్‌ను రూపొందించాలి.

ముఖ్యాంశాలు
Link to comment
Share on other sites

ఆంధ్రకు ఆరున్నర టీఎంసీలు

తెలంగాణకు ఒకటిన్నర టీఎంసీ

శ్రీశైలం, సాగర్‌ల నుంచి నీటి విడుదల

కృష్ణా బోర్డు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల్లో నీటిమట్టాలు తగ్గించి రెండు రాష్ట్రాలకు కలిపి 8 టీఎంసీల నీరు విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. శ్రీశైలంలో 775 అడుగులు, సాగర్‌లో 502 అడుగుల వరకు ఉన్న నిల్వల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆరున్నర టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు ఒకటిన్నర టీఎంసీలు విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకొంది. ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరావు శుక్రవారం బోర్డుకు రాసిన లేఖలో శ్రీశైలంలో 775 అడుగులు, సాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని తీసుకోవడానికి అంగీకారం తెలిపారు. దీని ప్రకారం మొత్తం 11.22 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. గతంలో తీసుకొన్న నిర్ణయం ప్రకారం ఆంధ్రకు ఇంకా 7.845 టీఎంసీలు రావాల్సి ఉందని, తెలంగాణ 8.033 టీఎంసీలు ఎక్కువగా వాడుకొందని వివరించారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు రోజుకు 525 క్యూసెక్కుల చొప్పున మే నెలాఖరు వరకు విడుదల చేయడానికి ఒకటిన్నర టీఎంసీ కేటాయించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు నాగార్జునసాగర్‌ కుడికాలువకు 2.8 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 6.92 టీఎంసీలు ఇవ్వాలన్నారు. జులై వరకు సాగర్‌ నీటిమట్టాన్ని 502 అడుగులు ఉండేలా చూడాలని, హైదరాబాద్‌ తాగునీటికి రోజూ 540 క్యూసెక్కులు విడుదల చేయాలని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ కూడా శుక్రవారమే బోర్డుకు లేఖ రాశారు. తాగునీటికి నాలుగన్నర టీఎంసీలు కేటాయించాలని కోరారు. ఈ లేఖల ఆధారంగా నీటివిడుదలకు బోర్డు నిర్ణయం తీసుకొంది.

నెలాఖరు వరకు వినియోగానికే..: ఈ నెల 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ 7.16 టీఎంసీలు ఇంకా వాడుకోవాల్సి ఉండగా, తెలంగాణ 7.67 టీఎంసీలు ఎక్కువ వినియోగించుకుందని బోర్డు సభ్యకార్యదర్శి సమీర్‌ఛటర్జీ శుక్రవారం లేఖ రాశారు. ‘మే చివరి వరకు అవసరమైన నీటి విడుదలకు నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్‌కు సాగర్‌ కుడికాలువకు రోజూ ఐదువేల క్యూసెక్కుల చొప్పున మొత్తం రెండున్నర టీఎంసీలు, కృష్ణా డెల్టా అవసరాలకు రోజుకు ఐదువేల క్యూసెక్కుల చొప్పున నాలుగు టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించాం. హైదరాబాద్‌కు రోజుకు 540 క్యూసెక్కుల చొప్పున ఒకటిన్నర టీఎంసీ విడుదల చేస్తారు‘ అని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలంలో 775 అడుగులకు వచ్చేవరకు రోజుకు 13 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలని కూడా బోర్డు ఆదేశించింది.

Link to comment
Share on other sites

కృష్ణా ప్రాజెక్టుల్లో టెలిమెట్రీల ఏర్పాటు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, కాలువల్లో టెలిమెట్రీల ఏర్పాటు గడువును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పొడిగించింది. నీటి ప్రవాహం, వినియోగాన్ని తెలుసుకొనేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని గత ఏడాది కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లుగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించింది. పనులకు సంబంధిత ఇంజినీర్లు సహకరించనందున గడువు పొడిగించాలని గుత్తేదారులు కోరారు. ఈ నేపథ్యంలో 45 రోజుల గడువు పెంచుతూ బోర్డు సభ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. దీని ప్రకారం మే ఎనిమిదో తేదీ కాకుండా జూన్‌ 22వ తేదీ నాటికి టెలిమెట్రీల ఏర్పాటును పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇదే ఆఖరు గడువని, పొడిగించడం కుదరదని బోర్డు కార్యదర్శి స్పష్టీకరించారు. దీంతోపాటు తెలంగాణ అభ్యంతరం నేపథ్యంలో పోతిరెడ్డిపాడు దిగువన, నాగార్జునసాగర్‌ ఎడమకాలువపైన టెలిమెట్రీ ఏర్పాటులో చేసిన మార్పులను కూడా బోర్డు రద్దుచేసింది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

ఆ 4 టీఎంసీలు పూర్తిగా ఇవ్వలేదు

కృష్ణా జలాల పాత కేటాయింపులపై ఏపీ వాదన

జూన్‌ అవసరాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్న అధికారులు

ఈనాడు, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్యబోర్డు త్రిసభ్య కమిటీ ఈ నెల 31న హైదరాబాద్‌లో సమావేశం కాబోతోంది. జూన్‌ నెలకు సంబంధించి రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలను చర్చించి అవసరమైన మేర కేటాయింపులు చేసేందుకు వీలుగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. త్రిసభ్య కమిటీలో బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ, రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు ఎం.వెంకటేశ్వరరావు, సి.మురళీధర్‌లు సభ్యులు. వీరు ముగ్గురు కలిసి కూర్చుని అందుబాటులో ఉన్న నీటిని పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి అవసరాలను గుర్తించి నీటిని కేటాయిస్తారు. నిజానికి ఈ నెల 30న ఈ సమావేశం నిర్వహించాలని తొలుత భావించినా ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు వేరే కార్యక్రమాలు ఉండటంతో ఈ నెల 31న త్రిసభ్య కమిటీ సమావేశం కాబోతోంది. ఇంతకుముందు ఈ నెల 5న బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమై నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు.

4.5 టీఎంసీల విడుదలకు తెలంగాణ డిమాండ్‌: జులై 15వరకు తెలంగాణ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం నుంచి 4.5 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ బోర్డుకు లేఖ రాశారు. నల్గొండ జిల్లాలో చెరువులను నింపేందుకు 2 టీఎంసీలు, హైదరాబాద్‌ నగర నీటి అవసరాల కోసం జూన్‌ నెలాఖరుతో పాటు జులై 15 వరకు 2.25 టీఎంసీల నీరు కావాలని ఆయన కోరుతున్నారు. నీటి ఆవిరి నష్టాలు కూడా కలిపి శ్రీశైలం నుంచి 4.50 టీఎంసీలు విడుదల చేయాలని మురళీధర్‌ పేర్కొన్నారు. జులై 15 నుంచి జులై 31 వరకు నాగార్జునసాగర్‌లో 502 అడుగులకు దిగువన ఉన్న నీటిని వీలునుబట్టి వినియోగించుకుంటామని పేర్కొన్నారు.

ఇంకా మాకు రావాల్సి ఉంది

గతంలో బోర్డు కృష్ణా డెల్టా వ్యవస్థ కోసం కేటాయించిన 4 టీఎంసీల నీరు తమకు పూర్తిగా ఇవ్వలేదని ఏపీ జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పాత కేటాయింపుల్లోనే ఇంకా పెండింగు ఉందని చెబుతూ జూన్‌ నెలలో తాగునీటికి తమకు కృష్ణా డెల్టా, సాగర్‌ కాలువల కింద అవసరం ఉందని, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 31 నాటి భేటీలో అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడతామని చెప్పారు.

Link to comment
Share on other sites

ప్రాజెక్టులవారీగా కేటాయింపులు కుదరవు
01-06-2017 04:00:0
 
  • కృష్ణా ట్రైబ్యునల్‌లో ఏపీ పిటిషన్‌
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి ): కృష్ణా జలాల అవసరాలు.. ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు.. భౌగోళిక పరిస్థితుల గురించి కృష్ణా నదీ జల వివాదాల ట్రైబ్యునల్‌కు తెలంగాణ సమర్పించిన అభ్యంతరాల నివేదిక పూర్తి అభూత కల్పనగా ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. అది తప్పుల తడకని.. ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేదిగా ఉందని స్పష్టంచేసింది. ప్రాజెక్టులవారీగా పునఃకేటాయింపులు జరపాలన్న వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రాలవారీగానే కేటాయింపులు జరపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రైబ్యునల్‌కు రిజాయిండర్‌ పిటిషన్‌ను న్యాయవాది జి.ప్రభాకర్‌ సమర్పించారు. దీనిని ఆయన, మరో న్యాయవాది జి.ఉమాపతి కలిసి తయారుచేశారు. రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ పరిశీలించి ఆమోదించారు. సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ కూడా రిజాయిండర్‌ను పరిశీలించారు. ఇందులో ఏపీ వాదన ఇలా ఉంది..
కృష్ణా ట్రైబ్యునల్‌కు తెలంగాణ సమర్పించిన అభిప్రాయం పూర్తి తప్పుల తడక. పైగా ఇది మరింత వివాదాన్ని రేకిత్తించేదిగా ఉంది. దీనిపై వాస్తవాలేమిటో ట్రైబ్యునల్‌ క్షుణ్ణంగా పరిశీలించాలి.
పరివాహక ప్రాంతాన్ని దాటి కృష్ణా జలాలను వినియోగించకుండా కట్టడి చేయాలని, ఈ జలాలను పునఃకేటాయింపులు చేయాలన్న తెలంగాణ వాదనలో ఏమాత్రం పసలేదు. రాష్ట్రాల్లోని సామాజిక, భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
తెలంగాణ భౌగోళిక పరిస్థితుల ప్రకారం.. అక్కడ వరి పంట వేసేందుకు అనువైన నేలలు లేవు. ఆ నేలలు ఆరు తడి పంటలకే అనువుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో సారవంతమైన నేలలున్నాయి. వరి సాగుకు ఇవి అనువుగా ఉంటాయి. రాయలసీమ ప్రాంతంలోనూ వరి పండిస్తారు. రైతులు ఆరుతడి పంటలూ వేస్తారు.
 
తెలంగాణ మిగులులో ఉంది..: రాష్ట్ర విభజన జరిగాక .. తెలంగాణ ఆర్థికంగా మిగులులో ఉంది. హైదరాబాధ్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఐటీ హబ్‌ ఉంది. ఆ రాష్ట్రంలో అపార ఖనిజ నిల్వలున్నాయి. కరీంనగర్‌లో బొగ్గు, సున్నపురాయి, ఇనుము, గ్రానైట్‌, ఇసుక, క్వార్జ్‌ ఉన్నాయి. మహబూబ్‌ నగర్‌లో క్వార్జ్‌ , లైమ్‌స్టోన్‌ శ్లాబ్స్‌, సున్నపురాయి, కంకర, బ్లాక్‌ కలర్‌ గ్రానైట్‌, బంకమట్టి, వజ్రాలు, బంగారు గనులు ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, తలసరి ఆదాయం, తలసరి వ్యయంలోనూ తెలంగాణ పరిపుష్టిగా ఉంది. ఆంధ్ర ప్రజలు కృష్ణా డెల్టాపైనే ఆధారపడి ఉన్నారు. ఉభయ రాష్ట్రాల్లో హంద్రీ-నీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని.. ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్‌ నిర్ణయం తీసుకోవాలి.
Link to comment
Share on other sites

కుదరని ఏకాభిప్రాయం

15 రోజుల తర్వాత మళ్లీ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్‌కు 0.8 టీఎంసీలు వాడుకునేందుకు అంగీకారం

ఈనాడు, అమరావతి: జూన్‌, జులై నెలల్లో తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల మేరకు నీటి పంపకాలపై కృష్ణా నదీ యాజమాన్యబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. మళ్లీ 15 రోజుల తర్వాత భేటీ అయి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అంతవరకు నాగార్జునసాగర్‌లో 502 అడుగుల వరకు అందుబాటులో ఉన్న 0.8 టీఎంసీలను హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించుకునేలా నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో బుధవారం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు ఎం.వెంకటేశ్వరరావు, సి.మురళీధర్‌లు సమావేశమయ్యారు. తాగునీటి అవసరాల కోసం 4.8 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరగా.. సాగర్‌ కుడి కాలువ కింద జూన్‌ నెలలో తాగునీటి అవసరాలకు 6 టీఎంసీలు, కృష్ణా డెల్టా కింద తాగునీటికి ఒక టీఎంసీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది.

శ్రీశైలం నుంచా? సాగర్‌ నుంచా?

‘నాగార్జునసాగర్‌లో 502 అడుగుల దిగువకు వెళ్లి నీళ్లు తీసుకునే వ్యవస్థ ఇంకా ఏర్పాటు కాలేదు. ఆ మేరకు మోటర్లు ఏర్పాటు చేయలేదని, అప్రోచ్‌ ఛానల్‌ పూర్తి కాలేదని’ తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ చెప్పారు. అందువల్ల ప్రస్తుత డిమాండ్‌ మేరకు శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని కోరారు. శ్రీశైలంలో 760 అడుగుల వరకు వెళ్లి.. మిగిలిన నీటిని విడుదల చేయాలని తెలంగాణ అధికారులు డిమాండ్‌ చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఇదే వాదన వినిపిస్తున్నారని, 502 అడుగులమేర సాగర్‌ దిగువకు వెళ్లి నీళ్లు వినియోగించుకోవడానికే తాము అంగీకరిస్తామన్నారు. ఎప్పటి నుంచో ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని బోర్డు చెబుతున్నా, ఇప్పటివరకు ఆ పనులు పూర్తి చేయలేదన్నారు. తెలంగాణకు గోదావరి నుంచి సింగూరు నుంచి కూడా హైదరాబాద్‌కు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించగా.. ఈ విషయంలో గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు, ఇతర ప్రత్యామ్నాయాలను తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. సాగర్‌లో 502 అడుగుల దిగువకు వెళ్లాలంటే అందుకనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు 10 రోజులు పడుతుందన్నారు. అయితే 15 రోజుల తర్వాత భేటీ అయి నిర్ణయం తీసుకుందామని ఏపీ పేర్కొనడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈలోపు పనులను కమిటీ పర్యవేక్షించాలని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ ప్రతిపాదించారు.

కేటాయింపుల ప్రకారం ఇవ్వడం లేదు

కృష్ణా బోర్డు ఎన్ని క్యూసెక్కుల చొప్పున ఎంత నీరు ఇవ్వాలని నిర్ణయించినా తమ వాటా ప్రకారం నీరు రావడం లేదని వెంకటేశ్వరరావు ప్రస్తావించగా.. నీటి నష్టాలు లెక్కలోకి తీసుకుని, కుడి కాలువ కింద ఎక్కువగా తీసుకున్న నీటినీ పరిగనణలోకి తీసుకుంటే ఏపీకి రావాల్సింది కేవలం 0.27 టీఎంసీలేనని తెలంగాణ అధికారులు వాదించారు. కుడి కాలువ ద్వారా 2 టీఎంసీలకు గానూ 2.5 టీఎంసీలు తీసుకున్నారన్నారు. మా కేటాయింపుల కన్నా ఎక్కువ తీసుకుంటుంటే ఆపేయొచ్చు కదా అని ఏపీ అధికారులు పేర్కొన్నారు. నిరంతరం నీరు ఇవ్వాలని బోర్డు చెప్పినా అదీ అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై చీఫ్‌ ఇంజినీర్ల స్థాయిలో సమన్వయం చేసుకుందామని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. సాగర్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కుడి కాలువ, కేడీఎస్‌ చీఫ్‌ ఇంజినీర్లతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తారని చెప్పారు.

టెలీమీటరీ వ్యవస్థపైనా...

కమిటీ సమావేశం పూర్తయిన తర్వాత బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ విలేకరులతో మాట్లాడారు. పై నిర్ణయాలు వెల్లడిస్తూనే టెలీమీటరీ వ్యవస్థ ఏర్పాటుపైనా సమావేశంలో చర్చ జరిగిందన్నారు. జూన్‌ 22 లోపు తొలిదశకు సంబంధించి టెలీమీటర్ల ఏర్పాటు పూర్తవుతుందన్నారు. రెండోదశ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం చర్చకు ఏపీ అంగీకరించలేదని, తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

కృష్ణా జలాల పంపకంపై త్వరలో దిల్లీలో భేటీ!

ఖరారు కాని తేదీలు

ఈనాడు, అమరావతి: కృష్ణా జలాల పంపకంపై తెలుగు రాష్ట్రాలతో కేంద్ర జలవనరుల శాఖ సమావేశం త్వరలో దిల్లీలో జరగనుంది. బుధవారంతో నీటి సంవత్సరం పూర్తయింది. జూన్‌ ఒకటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. గత రెండేళ్లుగా కృష్ణా జలాలపై ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న కేటాయింపులకు సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాలు నీటిని ఎలా వాడుకోవాలనే విషయంలో కేంద్ర జలవనరుల శాఖ సమావేశం నిర్వహిస్తూ వస్తోంది. 2015లో కేవలం ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులే సమావేశంలో పాల్గొన్నారు. కిందటేడాది రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, టి.హరీష్‌రావులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో జూన్‌ నెలాఖరులో దిల్లీలో ఇదే తరహా భేటీ జరగనున్నట్లు కృష్ణా బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. కేంద్ర జలవనరుల శాఖ రెండు రాష్ట్రాలకు ఎజెండా పంపి ఆ మేరకు సమాచారమూ కోరుతుంది. కృష్ణా బోర్డు ఏర్పాటయినా ఇంకా ప్రాజెక్టులు దాని ఆధీనంలోకి తీసుకోలేదు. ఇందుకు సంబంధించిన విధివిధానాల ఖరారు కోసం కమిటీ ఏర్పాటుచేశారు. దాని గడువు మరో మూడు నెలలు పెంచారు. ఈ నీటి సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎదురైన అనుభవాలు, వాటి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటూ వచ్చే నీటి సంవత్సరంలో ఏ పద్ధతి ప్రకారం నీళ్లు పంచుకోవాలి, విధివిధానాలు మార్గదర్శకాలు నిర్ణయించేలా సమావేశం ఏర్పాటుచేస్తారు. ఈ లోపు కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశమూ హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

నీటి పంచాయితీ మళ్లీ దిల్లీకి!

గతేడాదిలాగే వినియోగం ఉండాలంటున్న తెలంగాణ

ఎవరి రాష్ట్రంలో వారే నిర్వహించుకోవాలి: ఏపీ

జలవనరుల మంత్రిత్వశాఖ వద్ద భేటీకి అవకాశం

ఈనాడు - హైదరాబాద్‌

కృష్ణా నీటి పంచాయితీ మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తోంది. గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా నీటి వినియోగం ఉండాలని తెలంగాణ కోరుతుండగా, బోర్డు పరిధిని నిర్ణయించడం లేదా ఎవరి రాష్ట్రంలో వారు నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కోరనున్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలు ఎవరి వాదనను వారు ముందుకు తెస్తుండటంతో పంచాయితీ మళ్లీ దిల్లీకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జులైలో రెండు రాష్ట్రాలతో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత నీటి సంవత్సరంలో గతేడాది పద్ధతే కొనసాగించాలని, పట్టిసీమ ద్వారా మళ్లించే నీటిలో వాటా కోరాలని, చిన్ననీటి వనరుల కింద నీటివాడకంపై బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. గత ఏడాది జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై ఇప్పుడు మళ్లీ ఒత్తిడి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ అధికారులు నివేదించినట్లు తెలిసింది.

కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు ఉండగా, ఇందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌, 299 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకొనేలా 2015 జూన్‌లో జలవనరుల మంత్రిత్వశాఖ వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 2016లోనూ ఇదే పద్ధతి కొనసాగింది. నీటి విడుదలకు బోర్డు ఆదేశించినా అమలు జరగడం లేదని, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పట్టుబట్టింది. 2015 విధానాన్నే కొనసాగిస్తూ పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి మళ్లించే నీటిలో వాటా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి రాకపోవడంతో కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌తో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్య తీసుకొంటామని, అప్పటివరకు పాత విధానమే ఉంటుందని తేల్చిచెప్పింది. నీటి కేటాయింపు, వినియోగం, పరిధి తదితర అంశాల్లో ఎలాంటి నిర్ణయం లేకుండానే ఏడాది ముగిసిపోయింది. కమిటీ నివేదిక ఇవ్వకపోవడంతో ఈ ఏడాది అక్టోబరు వరకు గడువు పొడిగించారు. అంటే ఈ ఖరీఫ్‌ ముగిసేలోగా కూడా నివేదిక రాదు. ఈ నేపధ్యంలో గత ఏడాదిలాగానే మళ్లీ నీటి వినియోగం కొనసాగే అవకాశం ఉంది.

వివాదాలు, విభేదాలు

గత నీటి సంవత్సరంలో చిన్న నీటివనరుల కింద వినియోగం, ఎంత నీరు ఆవిరవుతుందనే విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు నెలకొన్నాయి. సకాలంలో నీటిని విడుదల చేయకపోవడం కూడా వివాదాలకు కారణమైంది. రెండు రాష్ట్రాలు తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపధ్యంలో కొత్త నీటి సంవత్సరం మొదలైంది. ఇప్పటివరకు జలాశయాల్లోకి ప్రవాహం నామమాత్రంగానే ఉంది. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల జూరాలలోకి నాలుగైదు టీఎంసీలు వచ్చింది. ప్రకాశం బ్యారేజీకి కూడా కొంత వచ్చింది. ఆలమట్టి, తుంగభద్రల్లోకి మాత్రం ప్రవాహం లేదు. రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం మొదలయ్యేటప్పటికి ఓ విధానాన్ని రూపొందించాల్సి ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. రెండు రాష్ట్రాలు నీటి విడుదల, వినియోగం విషయంలో భిన్నాభిప్రాయాలతో ఉండడంతో బోర్డు సమావేశంలో ఓ అంగీకారానికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో జలవనరుల మంత్రిత్వ శాఖ వద్దనే మళ్లీ సమావేశం జరుగుతుందని తెలిపాయి. మరోవైపు రెండు వారాల క్రితం కృష్ణా బోర్డు ఛైర్మన్‌ జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో ఈ ఏడాది నీటి వినియోగం, ఇతర సమస్యలపై చర్చించినట్లు తెలిసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాల వాదనలివీ..

ఆంధ్రప్రదేశ్‌

* బోర్డు ఆదేశించినా సాగర్‌ నుంచి నీటి విడుదలలో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రాజెక్టులను బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలి లేదా మా పరిధిలోని కాలువలను మేమే నిర్వహించుకోవడానికి అనుమతించాలి.

* తెలంగాణ.. మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులను మరమ్మతు చేసి చిన్ననీటివనరుల కింద కేటాయింపులను మొత్తం వాడుకొంటుంది. అందువల్ల మొత్తం వినియోగించుకొంటున్నట్లుగా పరిగణించాలి.

* సాగర్‌ ఎడమకాలువ కింద ఆరున్నర టీఎంసీలు మాత్రమే వాడుకొన్నాం.

తెలంగాణ

* ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకొనే పద్ధతి కొనసాగించాలి. పట్టిసీమ ద్వారా మళ్లించే నీటిలో వాటా కోరాలి.

* చిన్న నీటివనరుల కింద ఎంత నీటిని వినియోగిస్తే అంతే వాడుకొన్నట్లు భావించాలి. తెలంగాణకు ఉన్న 299 టీఎంసీల్లో 89 టీఎంసీలు చిన్ననీటివనరుల కిందే ఉంది. ఈమొత్తం వాడుకొనే పరిస్థితిలేదు. 20 నుంచి 25 టీఎంసీలు మాత్రమే వినియోగించుకొంటున్నాం.

* సాగర్‌ ఎడమ కాలువ కింద ఆంధ్రప్రదేశ్‌ 12 టీఎంసీలకు పైగా వాడుకొంది.

Link to comment
Share on other sites

కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణపై తేల్చండి!
29-06-2017 05:08:15
 
  • కేంద్రానికీ, బోర్డుకు త్వరలో రాష్ట్రం లేఖ
 
అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ‘‘కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) పరిధిలోనే ఉండాలి. లేదంటే భౌగోళికంగా ఎవరి ప్రాంతంలోని ప్రాజెక్టులు, గేట్లు వారి నిర్వహణలో ఉండాలి. మూడేళ్లుగా ఎదురవుతున0్న అనుభవాల దృష్టా కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందే’’ అని కేఆర్‌ఎంబీకి, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖలకు తేల్చి చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ సన్నద్ధమైంది. ఈ మేరకు వాటికి ఒకటి రెండు రోజుల్లోనే లేఖ రాయనుంది. వాస్తవానికి ఈ నెల మూడో వారంలోనే గోదావరి, కృష్ణానదీ యాజమాన్యాలు సమావేశమై.. తెలుగు రాష్ర్టాలకు నీటి కేటాయింపులు తేల్చాలి. కృష్ణాజలాల పంపిణీపై పాత విధానాంలోనే కేటాయింపులు ఉండాలని కేంద్ర జలవనరుల శాఖ భావిస్తోంది. అయితే, నీటి లభ్యత ఆధారంగా కృష్ణా డెల్టాకు కేఆర్‌ఎంబీ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ధిక్కరిస్తోందని ఏపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో, కృష్ణానదిపై ప్రాజెక్టుల యాజమాన్యం కేఆర్‌ఎంబీకి ఇవ్వకుంటే... శ్రీశైలంతో సహా నాగార్జున సాగర్‌ కుడి కాలువ గట్టు గేట్ల నిర్వహణను భౌగోళికంగా తమ పరిధిలోనే ఉన్నందున ఏపీకే అప్పగించాలని రాష్ట్ర జల వనరుల శాఖ డిమాండు చేస్తోంది.
Link to comment
Share on other sites

నీటి వినియోగంపై ఇప్పటికైనా స్పందించండి

తెలుగు రాష్ట్రాలకు ‘కృష్ణా’ బోర్డు మరో లేఖ

ఈనాడు, హైŸ¹రాబాద్‌: ప్రస్తుత ఏడాదిలో నీటి వినియోగం ఎలా ఉండాలన్నదానిపై స్పందించాలని కృష్ణా నదీ యాజమాన్యబోర్డు రెండు రాష్ట్రాలను కోరింది. 2017-18లో కృష్ణాబేసిన్‌లో నీటి వినియోగం, అమలు యంత్రాంగం, చిన్ననీటి వనరులతో సహా నీటి వినియోగ వివరాలు తదితర అంశాలపై అభిప్రాయాలు చెప్పాలని మే 25న, జూన్‌ 20న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బోర్డు సభ్యకార్యదర్శి సమీర్‌ ఛటర్జీ లేఖలు రాశారు. రెండు రాష్ట్రాలు దీనిపై స్పందించకపోవడంతో ఈ నెల 11లోగా సమాధానం ఇవ్వాలని తాజాగా మూడో లేఖ రాశారు. రాష్ట్రాలు ఎలాంటి అభిప్రాయం చెప్పకపోతే కేంద్రమే ఓ నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీచేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...