August 19, 2025Aug 19 Author : యువ ఆవిష్కర్తల వేదిక.. ఇన్నోవేషన్ హబ్ By Andhra Pradesh News DeskPublished : 19 Aug 2025 03:29 IST Ee Font size 2 min read మంగళగిరిలోని టెక్ మయూరిలో సిద్ధం రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభం రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్న మయూరి టెక్ పార్క్ న్యూస్టుడే - ఏఎన్యూ (గుంటూరు): రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సంకల్పం సాకారమవుతోంది. యువతలోని వినూత్న ఆలోచనలకు మెరుగుపట్టి.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ వేదిక కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మయూరి టెక్ ప్రాంగణంలో దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ హబ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న ప్రారంభించనున్నారు. యువ ఆవిష్కర్తల ప్రాజెక్టులకు మరింతగా మెరుగులద్దేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఇన్నోవేషన్ హబ్లకు తీసుకొచ్చి యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతారు. ఇందుకోసం విశాఖ, అనంతపురం, తిరుపతి, రాజమహేంద్రవరం, అమరావతి హబ్లు ఆవిష్కాంధ్ర పేరుతో పని చేస్తాయని ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో సూర్యతేజ తెలిపారు. వినూత్న ఆలోచనలతో వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం, పరిశ్రమల నుంచి సహకారం అందించడంతోపాటు అవసరమైన ప్రత్యేక శిక్షణను ఐఐటీ, బిట్స్, ఐఐఎం, టాటా గ్రూప్, ఎల్అండ్టీ, జీఎంఆర్ తదితర సంస్థలు ఇస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల స్టార్టప్లు పని చేస్తున్నాయి. వీటికి తోడుగానే ఆవిష్కాంధ్ర ఉంటుంది. ఈ నెల 20న ప్రారంభోత్సవ కార్యక్రమం పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని సూర్యతేజ చెప్పారు. ఇన్నోవేషన్ హబ్లో ఏర్పాట్లు ఇలా నేడు ఆత్మకూరులో పీ4 కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 19, 20 తేదీల్లో మంగళగిరిలో పర్యటించనున్నారు. 19న ఆత్మకూరు సమీపంలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించే పీ4 కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 20న రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్కుమార్ సోమవారం పరిశీలించారు.
August 20, 2025Aug 20 Author యువ ఆవిష్కరణల వేదిక By Andhra Pradesh News DeskPublished : 20 Aug 2025 05:15 IST Ee Font size 1 min read అమరావతిలో రతన్టాటా ఇన్నోవేషన్ హబ్కు నేడు శ్రీకారం ఈనాడు, అమరావతి: యువ ఆవిష్కరణల వేదికగా.. రాష్ట్ర ఆర్థికవృద్ధిలో ప్రతి కుటుంబానికీ భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా రతన్టాటా ఇన్నోవేషన్ హబ్కు కూటమి ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుడుతోంది. ఇది దేశానికే కాదు.. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ల కేంద్రంగా విలసిల్లేలా కార్యాచరణ సిద్ధం చేసింది. కుటుంబానికో పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాకారం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్త గ్రిడ్ ప్రారంభించనుంది. అమరావతి కేంద్రంగా హబ్.. తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో స్పోక్లు ఏర్పాటు కానున్నాయి.ప్రతి స్పోక్ స్వతంత్ర నాయకత్వ బృందాన్ని ఏర్పాటుచేసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా నిర్వహిస్తారు. ఒక స్పోక్లోని స్టార్టప్లు మరో స్పోక్ నుంచి నైపుణ్యం, వనరులు, పెట్టుబడి ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, టాటా గ్రూప్తో పాటు ఇతర భాగస్వాముల సహకారం తీసుకోనున్నారు. ‘రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ మీ వేదిక.. నిర్మించండి.. ప్రయోగం చేయండి.. లాంచ్ చేయండి.. ఆంధ్రప్రదేశ్ మీకు మద్దతు ఇస్తుంది’ అని ఆవిష్కర్తలకు ఆహ్వానం పలకనున్నారు. అమరావతి కేంద్రంగా.. ఐదు స్పోక్లతో అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే రతన్టాటా ఇన్నోవేషన్ హబ్.. డీప్టెక్, కృత్రిమ మేధ, సుస్థిర, సమ్మిళిత ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుంది. దీనిలో భాగంగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రామాణికంగా రూపొందిస్తారు. ప్రపంచ మేధను ఆకర్షించి.. పెట్టుబడులు, ఇన్నోవేషన్ ఆధారిత విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. స్పోక్ల వారీ ప్రాధాన్యాలు ఇలా.. అనంతపురం: ఉత్పత్తి, ఆటోమోటివ్ విశాఖపట్నం: సాఫ్ట్వేర్ సేవలు, ఫార్మా, మారిటైమ్ విజయవాడ: మొబిలిటీ, పబ్లిక్ సెక్టార్, ఉత్పత్తి రంగం రాజమహేంద్రవరం: వ్యవసాయం, ఆక్వా తిరుపతి: ఆగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ► Read latest Andhra pradesh News and Telugu News ► Follow us on Facebook, Twitter, Instagram & Google News.
August 21, 2025Aug 21 Author ఏపీ.. ఆవిష్కరణల చిరునామా By Andhra Pradesh News DeskUpdated : 21 Aug 2025 06:08 IST Ee Font size 4 min read అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చరిత్రాత్మకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వెల్లడి 24 గంటల్లోనే 1.67 లక్షల రిజిస్ట్రేషన్లు ఇన్నోవేషన్, బిజినెస్ స్టార్టప్ల నమోదులో గిన్నిస్ రికార్డు ఈనాడు - అమరావతి హబ్లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ చంద్రబాబు ఇన్నోవేషన్ హబ్ గురించి కలగనడమే కాదు.. దాన్ని సాకారం చేశారు. దీన్ని విజయవంతం చేయగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. చంద్రశేఖరన్ రాష్ట్రం ఆవిష్కరణలకు కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు ఊతమిచ్చేలా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం చరిత్రాత్మకమన్నారు. ఆయన ఆలోచనలు సజీవంగా ఉంచాలన్న ఆలోచనతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమాజానికి తిరిగి ఇద్దామనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారని.. టాటా ట్రస్టు ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన నిరాడంబరత, నిజాయతీ, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమని కొనియాడారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్కులో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్తో కలిసి సీఎం బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతితోపాటు విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరాల్లో ఇన్నోవేషన్ హబ్లు.. వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహించేలా పనిచేస్తాయి. వీటిని యువత వినియోగించుకోవాలి. సాంకేతికత వల్ల ఉపాధి కోల్పోతారన్నది అపోహ మాత్రమే. ప్రపంచానికి సేవలందించేలా రాష్ట్ర పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలన్నదే ఆలోచన. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ వంటి రంగాల్లో కొత్త ఆలోచనలతో వచ్చేవారికి అపార అవకాశాలున్నాయి’ అని పేర్కొన్నారు. ప్రాంతాలవారీగా అభివృద్ధికి ప్రణాళిక అమరావతి నిర్మించే మరో అవకాశం తనకు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా అభివృద్ధి చెందుతుంది. కాంటమ్ కంప్యూటింగ్ ద్వారా రియల్ టైం డేటాను విశ్లేషించి, క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం. క్వాంటమ్ వ్యాలీ, కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయి. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది. సిలికాన్ వ్యాలీలో ఉన్న అద్భుతమైన వసతులు, అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల అవసరాలు, విధానాలను అనుసంధానం చేసేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ఆలోచన. మన దేశం త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. అప్పుడు సంపద మరింతగా పెరుగుతుంది. ఈ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. దీనికోసం అమరావతి సహా ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేసి మెరుగైన ఫలితాలు సాధించాలి. దీనికి పరిశ్రమలు, పరిశోధనలు, అనువైన పరిస్థితులు ఉండాలి’ అని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో అధిక ఉపాధి సంపద సృష్టించడం ద్వారా పేదల జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ‘కమ్యూనిజం, క్యాపిటలిజం ఉండవు. భవిష్యత్తులో టూరిజం మాత్రమే ఉంటుంది. పర్యాటక రంగం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 704 రకాల సేవలను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తెచ్చాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం డిజినెర్వ్ సెంటర్ ప్రాజెక్టులోనూ టాటా సంస్థతో కలిసి కుప్పంలో పనిచేస్తున్నాం. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వైద్య చికిత్సల్లో అనుసరిస్తున్న సాంకేతికత ను ఒకేచోటకు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలన్నది లక్ష్యం. రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు. అదే స్ఫూర్తితో దీనికి సంజీవని అని పేరు పెట్టాం’ అని అన్నారు. రాజకీయాల్లోకి రాకుంటే.. మీకు పోటీ వచ్చేవాణ్ని! తాను రాజకీయాలను ఎంచుకున్నానని.. ఒకవేళ పారిశ్రామికవేత్తను అయితే మీకు గట్టి పోటీ ఇచ్చేవాడినేమోనని సీఎం (చంద్రశేఖరన్ వైపు తిరిగి నవ్వుతూ) వ్యాఖ్యానించారు. ‘ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఏడాది పనిచేసిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టా. అప్పుడు నా భార్యను హెరిటేజ్ బాధ్యతలు చూడాలని అడిగితే తిరస్కరించింది. ఆసక్తి లేకుండానే బాధ్యతలు చేపట్టి ఇప్పుడు అద్భుతంగా పరిశ్రమను నడిపిస్తోంది’ అని పేర్కొన్నారు. వివిధ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. గిన్నిస్ బుక్లో చోటు ఇన్నోవేషన్, బిజినెస్ స్టార్టప్ల కోసం 1,67,321 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ స్థాయిలో 24 గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. ఆ సంస్థ ప్రతిధులు హబ్ ప్రారంభోత్సవ వేదికపై సీఎంకు ధ్రువపత్రాన్ని అందించారు.
August 26, 2025Aug 26 Author వైద్యారోగ్యంలో వినూత్న ఆవిష్కరణల వేదిక ‘బ్రెయిన్’ By Andhra Pradesh News DeskUpdated : 26 Aug 2025 06:46 IST Ee Font size 3 min read రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో భాగంగా ఏర్పాటు అంతర్జాతీయ బయోడిజైన్ నిపుణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ఆసియా-పసిఫిక్ బయో డిజైన్ అలయెన్స్కు చెందిన విదేశీ వైద్య నిపుణులతో సచివాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు ఈనాడు, అమరావతి: వైద్యారోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ (బ్రెయిన్) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలోని రతన్టాటా ఇన్నోవేషన్ హబ్లో అంతర్భాగంగా బ్రెయిన్ కార్యకలాపాలుంటాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ, స్థానిక నైపుణ్యాలను సమన్వయం చేయడం ద్వారా ప్రజారోగ్య రంగంలో గణనీయమైన మార్పులు తెస్తుందని వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్కు చెందిన వేర్వేరు దేశాల వైద్య నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏఐ, మెడ్టెక్ అలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసియా- పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ‘బ్రెయిన్’ దృష్టి సారించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఇది పనిచేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మెడికల్ టెక్నాలజీ రంగంలో కొత్త స్టార్టప్లతో పాటు పరిశోధకులు, నిపుణులకు ప్రోత్సాహం లభిస్తుందని సీఎం తెలిపారు. స్టార్టప్, ఇంక్యుబేషన్ రంగాల్లో ఒప్పందాలు ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్, జపాన్, సింగపూర్, తైవాన్, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఆయా దేశాల్లో బయోడిజైన్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ, మెడ్టెక్ అలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ కలపాలతో పాటు ప్రొఫెసర్ అనురాగ్ మైరల్ (స్టాన్ఫోర్డ్ సెంటర్ ఫర్ బయోడిజైన్), డాక్టర్ యోనా వైస్బచ్ (ఆసియా పసిఫిక్), కెవిన్ ఫ్లెగర్ (ఆస్ట్రేలియా), యూరియోన్ కొబయాషి (జపాన్), జేమ్స్ చియెన్, హియాట్సెంగ్ (తైవాన్), మార్క్ చాంగ్ (సింగపూర్) తదితరులు తమ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు సాంకేతిక పరిష్కారాలపై చర్చించారు. వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, సాంకేతికత బదిలీ, స్టార్టప్, ఇంక్యుబేషన్ తదితర విభాగాల్లో సహకారంపై ప్రపంచ నిపుణులు- ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ఎయిమ్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం జరిగింది. దీంతో భారత్ బయోడిజైన్, బయోడిజైన్ ఆస్ట్రేలియాలు ఉమ్మడిగా పని చేయనున్నాయి. వైద్యారోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను నిర్వహించేలా ఇది సహకరించనుంది. డీజీనెర్వ్ సెంటర్ సేవల విస్తరణ ‘రాష్ట్రంలో ప్రజారోగ్య సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాం. పీహెచ్సీలతో ఏరియా ఆస్పత్రులను అనుసంధానించాం. చిత్తూరు జిల్లా కుప్పంలో టాటా-గేట్స్ ఫౌండేషన్లతో కలిసి డీజీనెర్వ్ సెంటర్ ఏర్పాటుచేశాం. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దీని సేవలు విస్తరిస్తామ’ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్ ఆధునిక వైద్య పరికరాల తయారీలో కీలకంగా ఉందని గుర్తుచేశారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ వీరపాండియన్, ఈడీబీ సీఈవో సాయికాంత్వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
September 2, 2025Sep 2 Author కొత్త పారిశ్రామికలోకం! By Andhra Pradesh News DeskPublished : 02 Sep 2025 03:46 IST Ee Font size 3 min read వినూత్న ఆలోచనతో వచ్చేవారికి రతన్ టాటా హబ్ ఆహ్వానం దీనికి అనుసంధానంగా 5 స్పోక్ సెంటర్లు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటు ఈనాడు - అమరావతి ‘నువ్వు వేగంగా నడవాలంటే.. ఒంటరిగా నడవాలి.మీరు చాలా దూరం నడవాలనుకుంటే.. కలిసి నడవండి’ దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా పలుకులు ఇవి. అతి పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం సుస్థిరంగా నడిపిన ఆయన అనుభవ పాఠాన్ని ‘యువ పారిశ్రామికవేత్తలకు’ బోధించే కేంద్రమే అమరావతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్). వినూత్న ఆలోచనలతో రండి.. పారిశ్రామికవేత్తలుగా తిరిగి వెళ్లండంటూ ఈ హబ్ యువతను ఆహ్వానిస్తోంది. ఆర్టీఐహెచ్ ఉన్న మయూరి టెక్ పార్క్ భవనం హబ్ ఎలా పని చేస్తుందంటే.. ఇంక్యుబేషన్, ఆర్థిక సహకారం, మార్కెటింగ్, వెంచర్ క్యాపిటల్, హ్యాండ్ హోల్డింగ్ చేసేలా ఒక్కో అంశానికి ఒక బృందం చొప్పున పనిచేస్తాయి. అన్నీ కలిసి ఆలోచన నుంచి పరిశ్రమగా ఎదిగే వరకు కావాల్సిన రోడ్ మ్యాప్ అందించేందుకు ఆర్టీఐహెచ్లో సకల సదుపాయాలూ ఉన్నాయి. వినూత్న ఆలోచనతో ఎవరైనా వస్తే.. తొలుత ఇంక్యుబేషన్ బృందం క్రియాశీలం అవుతుంది. వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లడంలో సాయం అందిస్తుంది. వారికి వెంచర్ క్యాపిటల్ అందేలా చర్యలు తీసుకుంటుంది. పెట్టుబడులు పొందేందుకు మార్గాలను సూచిస్తుంది. రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు స్టార్టప్కు ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉంది. ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖపట్నం, ఎన్ఐటీ తాడేపల్లిగూడెం, గీతం, ఆంధ్ర, ఎస్ఆర్ఎం, విట్ విశ్వవిద్యాలయాలు హబ్తో అనుసంధానమై పనిచేస్తాయి. అంకురాలకు అండగా: రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్టర్డ్ స్టార్టప్లు 3 వేల వరకు ఉన్నాయి. వాటిని రాబోయే ఐదేళ్లలో 20వేలకు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వాటిద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించాలన్నది ఆలోచన. రాష్ట్రంలో స్టార్టప్ అనుకూల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్టీఐహెచ్ కేంద్రంగా పనిచేస్తుంది. అనుబంధంగా విశాఖ, విజయవాడ, అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతిలలో స్పోక్ సెంటర్లు పనిచేస్తాయి. ప్రధాన కేంద్రం ఆర్టీఐహెచ్ను టాటా సంస్థ నిర్వహిస్తుంది. పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థలు నిర్వహణలో సహకరిస్తాయి. 400కుపైగా సీటింగ్తో కో-వర్కింగ్ స్పేస్ అంకుర సంస్థల కోసం హబ్లో అందుబాటులో ఉంది. ఎవరైనా రావచ్చు హబ్కు రావాలంటే అర్హత అనేది ఏమీ లేదు. వినూత్న ఆలోచనలే ప్రామాణికం. ఇది ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఎంఎస్ఎంఈలు, ఎమర్జింగ్ టెక్నాలజీలకు సంబంధించి ఎలాంటి వాటికైనా పరిశోధనకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. గృహిణి, విద్యార్థి, పరిశ్రమలో పనిచేసే వ్యక్తి, చిన్న పరిశ్రమ నిర్వాహకులు, చిన్న దుకాణం నిర్వహించే వారెవరైనా సృజనాత్మక ఆలోచనే అర్హత. నిధులకు కొరత లేదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. 15 ప్రభుత్వ శాఖలను ఛాంపియన్ డిపార్టుమెంట్లుగా ప్రకటించింది. వాటిలో ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల పనులు స్టార్టప్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కింద రూ.కోటి వరకు ప్రొక్యూర్మెంట్లో, ఇన్నోవేషన్ ఛాలెంజ్లో గెలుపొందిన వారికి ఏడాదికి రూ.2 కోట్ల వరకు నేరుగా బిజినెస్ ఇచ్చేందుకు ఆయా శాఖలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. స్టార్టప్లను గుర్తిస్తున్నాం -సూర్యతేజ, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా స్టార్టప్లను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించామని, కళాశాలల్లో ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో సూర్యతేజ తెలిపారు. ‘‘200కుపైగా కళాశాలల్లో 60 వేల మందికి పైగా విద్యార్థులకు అవగాహన కల్పించాం. వారి నుంచి అందిన దరఖాస్తుల పరిశీలనకు బృందాన్ని ఏర్పాటు చేశాం. 400 మంది మెంటార్స్ను గుర్తించాం. ఆయా రంగాల్లోని అత్యుత్తమ అవకాశాలను ఒక వేదిక కిందకు తెచ్చే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటుచేశాం’’ అని ఆయన వెల్లడించారు.
Create an account or sign in to comment