August 26, 2025Aug 26 Author 50 కి.మీ.లకు ఒక పోర్టు By Andhra Pradesh News DeskPublished : 26 Aug 2025 03:28 IST Ee Font size 2 min read వచ్చే ఏడాదికి 4 అందుబాటులోకి తేవాలని లక్ష్యం రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం ఇక మరింత వేగంగా పనులు ఈనాడు - అమరావతి రామాయపట్నం పోర్టులో సాగుతున్న పనులు నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి 2026 నాటికి వాటిని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆలోగా పోర్టులను అనుసంధానిస్తూ రోడ్డు, రైలు మార్గాల కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. పొరుగు రాష్ట్రాలకూ పోర్టు సేవలు విస్తరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికోసం తెలంగాణ, ఒడిశాల్లో డ్రైపోర్టులు ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి పోర్టులను అనుసంధానించే ప్రతిపాదనలు రూపొందించింది. సముద్ర తీరం వెంట ప్రతి 50 కి.మీ.లకు పోర్టు, ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా.. మొత్తంగా 20 పోర్టులను అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు 69 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ పోర్టును వినియోగంలోకి తేవాలన్నది ఆలోచన. అయితే, కేప్ సైజు నౌకల రాకపోకలకు వీలుగా ప్రస్తుతం ప్రతిపాదించిన డ్రెడ్జింగ్ను 16 నుంచి 18.5 మీటర్లకు పెంచేందుకు నిర్మాణ సంస్థ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతిస్తే గడువు పొడిగించాల్సి వస్తుంది. మొదటి దశలో 4 బెర్తులు నిర్మించాల్సి ఉండగా ప్రస్తుతం ఒకటి పూర్తయింది. 3.7 కి.మీ. దక్షిణ, 1.35 కి.మీ.మేర ఉత్తర బ్రేక్ వాటర్ పనులు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి-16తో ఉమ్మడి ప్రకాశం జిల్లా చేవూరు జంక్షన్ దగ్గర అనుసంధానం చేస్తారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు మచిలీపట్నం పోర్టు 2026 నవంబరు నాటికి ఈ పోర్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 45.5 శాతం మేర పనులు పూర్తి చేశారు. మొదటి దశలో: 4 బెర్తులు.. 16 బెర్తులకు విస్తరించుకోవచ్చు. ఏడాదికి 36 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యం. తెలంగాణలో డ్రైపోర్టును ఏర్పాటు చేసి అక్కడి నుంచి మచిలీపట్నానికి సరకు చేర్చే ప్రతిపాదనలు ఉన్నాయి. - బీచ్రోడ్డును రూ.638 కోట్లతో ఆరు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేసి.. జాతీయ రహదారి-65కు అనుసంధానం చేసే ప్రతిపాదన ఉంది. దీనిని కేంద్ర పరిశీలనకు పంపారు. మూలపేట పోర్టు 54.01 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. 2026 మే నాటికి వినియోగంలోకి తేవాలన్నది లక్ష్యం. ఏటా 25-30 మిలియన్ టన్నులు సరకు రవాణా లక్ష్యం. ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో డ్రై పోర్టులు నిర్మించి మూలపేటతో అనుసంధానం చేస్తారు. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి-16తో టెక్కలి జంక్షన్ దగ్గర అనుసంధానం. హావ్డా-చెన్నై రైలు మార్గంతో కలుపుతారు.
December 8, 2025Dec 8 Author పోర్టుల చెంత.. 8 నయా నగరాలు By Andhra Pradesh News DeskUpdated : 08 Dec 2025 04:49 IST Ee Font size 3 min read వాటికి 100 కి.మీ.ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు రూ.10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలు ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగంలో ఉన్న, కొత్తగా నిర్మాణంలో ఉన్న పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుంది. ఆయా పోర్టులు, అవసరాలకు అనుగుణంగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మారిటైం బోర్డు (ఏపీఎంబీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల పరిధిలో వాటిని అభివృద్ది చేయబోతోంది. పోర్టు నుంచి 100 కి.మీ.ల పరిధిని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి, తదనుగుణంగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ను ఏపీఎంబీ తయారుచేసింది. ఆ పరిధిని గోదాములు, నివాస ప్రాంతాలు, ఆఫీస్ స్పేస్, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుగుణంగా జోన్లుగా విభజించి, వాటి ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. దీనికోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఏపీఎంబీ ప్రణాళికలు రూపొందించింది. క్రమానుగతంగా విస్తరణ ఇప్పటికే ఉన్న సరకు రవాణా, పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా పోర్టు ఆధారిత గ్రామాలను సమగ్ర ఆర్థికనగరాలుగా ఉన్నతీకరించాలని అధికారులు ప్రణాళిక రచించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్లు) ఏర్పాటుచేయడం ద్వారా వివిధ క్లస్టర్లు రూపుదిద్దుకుంటాయి. ఉదాహరణకు ఎంఎస్ఎంఈలు, నౌకానిర్మాణం, ఉక్కు పరిశ్రమలు, లాజిస్టిక్స్ సంస్థలు విస్తరిస్తాయి. తద్వారా తీరప్రాంతంలో పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఏ పోర్టు పరిధిలో ఏ సౌకర్యాలు? పోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.10,522.90 కోట్లతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించారు. సాగరమాల ఫేజ్-2 కింద ఈ ప్రాజెక్టులు సాధించేలా కేంద్రంతో రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నారు. క్లస్టర్లు.. ప్రత్యేకతలు విశాఖపట్నంలో మెరైన్, ఫార్మా క్లస్టర్: సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ ఎగుమతులు మూలపేట: ఇంటిగ్రేటెడ్ సీఈటీపీలు, లాజిస్టిక్స్, శిక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫార్మా, బయోటెక్, రసాయనాల ఎగుమతులకు అవకాశం రాంబిల్లి: నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్, హై సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకినాడ: పెట్రోలియం లాజిస్టిక్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మచిలీపట్నం: లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్తో ఈవీ, ఆభరణాల తయారీ సెజ్, ఆటో విడిభాగాల తయారీ రామాయపట్నం: ఈ ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమం, అంతర్గత పంపిణీ కనెక్టివిటీ బలోపేతం దుగరాజపట్నం షిప్బిల్డింగ్: మెరైన్ సెజ్, రోబోటిక్ షిప్యార్డు, మాడ్యులర్ డ్రై డాక్యార్డులతో ఎకోసిస్టమ్ అభివృద్ధి కృష్ణపట్నం ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ క్లస్టర్: క్లీన్టెక్, ఎలక్ట్రానిక్స్ పార్క్, సౌర విద్యుత్, కార్ల ఎగుమతికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఇవీ ప్రతిపాదనలు.. మచిలీపట్నం పోర్టులో విద్యుత్ సరఫరా పనులకు: రూ.50 కోట్లు, ఇక్కడే నీటి సరఫరాకు: రూ.50 కోట్లు, పోర్టు పరిధిలో అభివృద్ధికి: రూ.2,089.48 కోట్లు కృష్ణపట్నం పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు: రూ.1,376.62 కోట్లు మూలపేట పోర్టు పరిధిలో: రూ.6,742.80 కోట్లు రామాయపట్నం పోర్టు పరిధిలో రోడ్లకు: రూ.120 కోట్లు, విద్యుత్ సరఫరాకు: రూ.50 కోట్లు, నీటి సరఫరాకు: రూ.50 కోట్లు.
January 17Jan 17 Author కాకినాడ పోర్టులో జెట్టీ విస్తరణ By Andhra Pradesh Dist. DeskPublished : 17 Jan 2026 04:43 IST Ee Font size 2 min read రూ.200 కోట్ల వరకు వ్యయమయ్యే అవకాశం సరకు రవాణాకు మరింత అనుకూలంగా నిర్మాణాలు కాకినాడ పోర్టులో జెట్టీ విస్తరించనున్న ప్రాంతం కాకినాడ డీప్ వాటర్ పోర్టును మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం ఉన్న జెట్టీకి అనుబంధంగా మరో రెండు చిన్నపాటి ఫింగర్ జెట్టీలను నిర్మిస్తారు. ఇందుకు దాదాపు రూ.200 కోట్ల వరకు వెచ్చించనున్నారు. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం ఈ కొత్త నిర్మాణాల వల్ల సమీప గ్రామాలపై పర్యావరణ ప్రభావిత అంశాలపై ఫిబ్రవరి 6న మారిటైం బోర్టు కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. జెట్టీల విస్తరణతో సరకు రవాణాలో మరిన్ని మైలురాళ్లు అధిగమించడానికి అవకాశం ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. అదనంగా 4 మిలియన్ టన్నుల రవాణా.. కాకినాడ పోర్టులో ప్రస్తుతం ఏడు బెర్తులు ఉండగా 17.5 మిలియన్ టన్నుల సరకు రవాణా చేస్తున్నారు. ఇనుప ఖనిజం, బొగ్గు, అల్యూమినియం, బాక్సైట్, ఎరువులు ఈ పోర్టు ద్వారా దేశ, విదేశాలకు చేరవేస్తున్నారు. కొత్తగా విస్తరించబోయే జెట్టీ ద్వారా అదనంగా మరో 4 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. పెరుగుతున్న సముద్ర వాణిజ్యం, సాగర గర్భంలో అన్వేషణ, సాగరమాల కింద కేంద్ర ప్రభుత్వం ఓడరేవు ఆధారిత పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ మౌలిక సదుపాయాలకు మరింత అవకాశం కలగనుంది. 360 మీటర్ల మేర పొడిగించి.. ప్రస్తుతమున్న జెట్టీని 360 మీటర్ల మేర పొడిగిస్తారు. తద్వారా సరకు ఎగుమతి, దిగుమతుల సామర్థ్యం పెరగనుంది. జెట్టీకి తూర్పు దిశగా 275 మీటర్ల పొడవునా ఫింగర్ జెట్టీ నిర్మించనున్నందున ఎక్కువ నౌకలు ఒకేచోట నిలపొచ్చు. నౌకల దగ్గరకు పైపులు వేయడం, రాకపోకలకు అనువుగా ఉంటుంది. గ్యాస్, చమురు నిల్వల రవాణా, సరఫరాకు ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయి. నౌకలు తిరిగి వెళ్లే సమయం, రవాణా ఖర్చులు తగ్గుతాయి. లాజిస్టిక్ హబ్గా ఎదిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా సముద్రంలో నిర్మాణాలు చేపట్టేముందు సమీప గ్రామాల్లో పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తారు. జెట్టీల విస్తరణలో భాగంగా పది కి.మీ పరిధిలో గ్రామాలపై 2024 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు విశాఖకు చెందిన సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చారు. పీఏం-10, పీఏం-2.5 వంటి ధూళి కణాలు పరిమిత స్థాయిలోనే ఉంటాయని.. గాలి, నీరు, శబ్ధ కాలుష్యాలకు ఆస్కారం లేవని పేర్కొన్నారు. ఈ నివేదికనే వచ్చే నెల 6న ప్రజాభిప్రాయసేకరణ సభలో వినిపించి, అభ్యంతరాలు స్వీకరిస్తారు.
Create an account or sign in to comment