Jump to content

Buckingham Canal inland waterways


Recommended Posts

జల రవాణా కల సాకారం
 
 
636318165194989779.jpg
జల రవాణా కల సాకారం కానుంది. నాలుగో నెంబరు జాతీయ జల రవాణా మార్గం పేరుతో కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు 1,095 కిలోమీటర్ల పొడవున.. అభివృద్ధి ప్రతిపాదనలు ముందడుగు వేశాయి. తాజాగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించడంతో బకింగ్‌హామ్‌ కాలువకు పునర్వైభవం రానుంది.
 
గుంటూరు, మంగళగిరి: రెండువేల సంవత్సరాల క్రితమే మనదేశంలో జల రవాణా జోరు కొనసాగింది. నాటి రాజధాని అమరావతి... అంతకంటే ముందు భట్టిప్రోలు వరకు సముద్రం నుంచి కృష్ణానది ద్వారా ఓడలు రాకపోకలు సాగించి ఎగుమతులు, దిగుమతులను కొనసాగించేవి. బ్రిటిష్‌ హయాంలో బకింగ్‌హాం కెనాల్‌లో జల రవాణా కొనసాగింది. తిరిగి చరిత్ర పురావృతం కానుంది. మళ్లీ దేశంలో జల రవాణా మార్గాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ జల రవాణా వ్యవస్థ ఆవిర్భవించడంతోపాటు జాతీయ రహదారుల మాదిరి దేశంలో ఆరు ప్రధాన జాతీయ జల రవాణా మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు.
 
 కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు
నాల్గవ నెంబరు జాతీయ జల రవాణా మార్గం పేరుతో కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు 1,095 కిలోమీటర్ల పొడవునా జాతీయ జలమార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 2002లోనే పురుడు పోసుకున్న ఈ జల రవాణా యోచనకు 2008 నవంబరు 24న కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర లభించింది. 2013 కల్లా పూర్తిచేయాలనుకున్న ఈ జలమార్గం సర్వేలు, ప్రాజెక్టు రిపోర్టుల పేరుతో ఆలస్యమవుతూ వచ్చింది. అంచనా వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు రూ.542 కోట్ల వ్యయంతో చేపట్టాలనుకున్న ఈ ప్రాజెక్టు విలువ ప్రస్తుత కాలానికి రూ.2500 కోట్లకు మించిపోయింది. తాజాగా కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, వెంకయ్యనాయుడుల మధ్య ఈ జల రవాణా మార్గం అభివృద్ధి పనులను గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. త్వరితగతిన ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు నితిన్‌ గడ్కరీ వెల్లడించడంతో ఆశలు చిగురిస్తున్నాయి.చత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పాండిచ్చేరిలను కలుపుతూ నాల్గవ నెంబరు జాతీయ జల రవాణా మార్గం ఆవిష్కృతం కానుంది. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు మొత్తం 1,095 కి.మీ. పొడవు అభివృద్ధి చేస్తారు. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గోదావరి నదిలో 171 కి.మీ, కాకినాడ వరకు యాభై కి.మీ. పొడవునా ప్రత్యేక కెనాల్‌ను అభివృద్ధి చేస్తారు. 139 కి.మీ. పొడవునా ఏలూరు కాలువను విస్తరిస్తారు.
 
నల్గొండ జిల్లా వజిలాబాద్‌ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు
నల్గొండ జిల్లా వజిలాబాద్‌ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 157 కి.మీ. పొడవునా కృష్ణానదిలో జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తొలి 113 కి.మీ. నిడివిలో వున్న కొమ్మమూరు కాలువ, తదుపరి 316 కి.మీ. పొడవున వున్న ఉత్తర బకింగ్‌హామ్‌ కాలువ, ఆ తదుపరి 110 కి.మీ. నిడివిలో వున్న దక్షిణ బకింగ్‌హామ్‌ కాలువతోపాటు తమిళనాడులోని మరక్కణం-పాండిచ్చేరి మధ్య 22 కి.మీ. పొడవునా కలిపి మొత్తం 1,095 కి.మీ. నిడివిలో ఈ మార్గం ఏర్పాటవుతుంది. ఈజల రవాణా అభివృద్ధిలో కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్‌హమ్‌ కాలువ చాల ప్రధానమైనవిగా మారనున్నాయి. జల రవాణాలో భాగంగా పశ్చిమ ప్రధాన కాలువను విస్తరించాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇది 120 మీటర్ల వెడల్పుతో చాలా విశాలంగా వుంది. తాడేపల్లి పట్టణ ప్రాంతంతో పాటు రేవేంద్రపాడు వరకు వున్న ఆక్రమణలను తొలగిస్తే సరిపోతుంది. జల రవాణాలో భాగంగా కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ కట్టల వెంబడి వున్న ఆక్రమిత నివాసాలను తొలగించి కట్టలను మరింత బలోపేతం చేస్తూ ఇరువైపులా రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని, కాలువలో రెండువైపులా కాంక్రీట్‌ రిటైనింగ్‌ వాల్స్‌ను నిర్మించి తాడేపల్లి, రేవేంద్రపాడుల వద్ద కాలువపై వున్న శిథిల వంతెనల స్థానే కొత్తవాటిని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే ఈ ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టారు. కొమ్మమూరు కాలువ, బకింగ్‌ హామ్‌ కాలువ వెంబడి విస్తరణ చేయాల్సి వుంది. దీనికోసం 3272 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. ఇందులో 2,615 ఎకరాలు ప్రభుత్వ భూములే వుండడంతో అదనంగా 657 ఎకరాలను సేకరిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. కానీ కృష్ణా పశ్చిమ కాలువలో కొద్దిమేర పూడికను తొలగించి కాలువలో ఇరువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ను నిర్మించి కాలువ కట్టలను బలోపేతం చేస్తూ వాటిపై రెండువైపులా డబుల్‌ లేన్‌ రోడ్లను నిర్మిస్తే సరిపోతుంది. వీటితో పాటు పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువ, బకింగ్‌హామ్‌ కాలువలపై 605 కి.మీల నిడివిలో 776 కొత్త బ్రిడ్జిలను నిర్మించనున్నారు. పశ్చిమ ప్రధాన కాలువపై తాడేపల్లి, రేవేంద్రపాడుల వద్ద వున్నవంతెనలను పునర్నిర్మిస్తారు. 20.8 కి.మీ.ల పొడవున వున్న ఈ పశ్చిమ ప్రధాన కాలువను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తే అది రాజధాని అమరావతి శోభకు మరింత వన్నెను తీసుకువస్తుంది. జల రవాణా జరుగాలంటే కాలువలో నిత్యం రెండున్నర మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం వుండాలి. పట్టిసీమ మరికొన్నాళ్లకు పోలవరం కాలువల ద్వారా పెద్దఎత్తున గోదావరి నీళ్లు ప్రకాశం రిజర్వాయర్‌కు రావడం ఖాయం కానున్నందున కాలువలకు నిరంతరం నీటి విడుదల సాగే అవకాశాలు మెరుగవుతాయి. దీంతో అన్నీ సీజన్‌లలోనూ జల రవాణా ఆటంకాలు లేకుండా సాగే అవకాశం వుంటుంది.
Link to comment
Share on other sites

 

కృష్ణమ్మ ఒడిలో రాచమార్గం

రాజధానికి జలమార్గం పనులు ప్రారంభం

అచ్చంపేట, న్యూస్‌టుడే

buck3.jpg 

పులిచింతల ప్రాజెక్టు నుంచి విజయవాడ వరకు జలమార్గం అభివృద్ధికి సంబంధించి తొలి అడుగులు పడ్డాయి. కృష్ణానది లో ఇసుక మేట తవ్వకం (డెడ్జింగ్‌) పనులు ప్రారంభమయ్యాయి. జాతీయ జలమార్గం-4లో ముక్త్యాల - విజయవాడ - మధ్య కేంద్రప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇందులో తొలిదశలో కృష్ణా నదికి ఇరువైపులా ముక్త్యాల (కృష్ణాజిల్లా) -మాదిపాడు (గుంటూరుజిల్లా) నుంచి, విజయవాడ వరకు 68 కిలోమీటర్ల పొడవునా మార్గాన్ని అందుబాటులోకి తేనుంది. నదిలో ఇసుక మేటలను, తవ్వకం, పూడికతీత పనులకు టెండర్లు పూర్తి చేసి రెండు సంస్థలకు అప్పగించారు. డ్రెడ్జింగ్‌ పనులకు సంబంధించిన కాంట్రాక్టును ముంబయికి చెందిన ఐ.ఎం.ఎస్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, మరో కంపెనీ దక్కించుకుంది. ముందుగా ముక్త్యాల-చామర్రు మధ్య 30 కిలోమీటర్ల దూరానికి సంబంధించి పూడికతీత పనులను ఐ.ఎం.ఎస్‌ కంపెనీ రూ.19.67 కోట్లకు దక్కించుకుంది. చామర్రు - హరిశ్చంద్రపురం మధ్య 38 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్‌ పనులను సీసీఎస్‌ కంపెనీలు దక్కించుకున్నాయి.

ఏడాది కాలంలో పూర్తి : 2018 జూన్‌ కల్లా పనులు పూర్తి చేయాల్సి ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజికి వరకు లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉంది. జలరవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు డ్రెడ్జర్ల సహాయంతో పూడిక తీత పనులు చేపడుతున్నారు. ఈ ప్రాంతం పరిధిలో నదిలో ఎక్కువగా ఇసుక మేటలు ఉండటంతో వాటిని తొలగించనున్నారు.

రాజధానికి రవాణా : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, సరిహద్దులోని తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా, గుంటూరు జిల్లా మాచర్ల, దాచేపల్లి ప్రాంతాలలో సిమెంట్‌ కంపెనీలు అధికంగా ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ ఉత్పత్తులను జలమార్గం ద్వారా రవాణా చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇసుక కంకర, తదితర వస్తుసామాగ్రి రవాణా చేసేందుకు వీలుగా ఈ మార్గాన్ని అభివృద్ది చేస్తున్నారు.

తొలి దశ పనులు ప్రారంభం : తొలిదశలో కృష్ణానదిలో ఇసుక తవ్వకం పనులను గుంటూరుజిల్లా అచ్చంపేట మండలం చామర్రు నది ఒడ్డు నుంచి మాదిపాడు-కృష్ణాజిల్లా ముక్త్యాల వరకు చేపట్టనున్నారు. చామర్రు నుంచి డ్రెడ్జింగ్‌ పనులు ప్రారంభించారు. బీహార్‌ నుంచి తెప్పించిన యంత్రం ను చామర్రు వద్ద నదిలో అమర్చారు. నీటి ప్రవాహంలో తేలియాడే రబ్బరు గొట్టాలను నది ఒడ్డు వరకు అమర్చారు. నది ఒడ్డున ఇసుకను డంపింగ్‌ చేస్తారు. మరో డ్రెడ్జింగ్‌ యంత్రాన్ని తెప్పిస్తున్నామని గుత్తేదారు ప్రతినిధి శివ పేర్కొన్నారు. డ్రెడ్జింగ్‌ యంత్రాన్ని నీటిలో అమర్చడం, పైపులు అమర్చడం పూర్తయింది. రెండురోజుల్లో ఇసుక తవ్వకం పనులు ప్రారంభమవుతాయన్నారు.

Link to comment
Share on other sites

కాకినాడ నుంచి పుదుచ్చేరి జల రవాణాకు బ్లూప్రింట్‌ రెడీ
 
 
636330923521497057.jpg
అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): అంతర్గత జల రవాణా వ్యవస్థను కాకినాడ-పుదుచ్చేరి మధ్య విస్తృతపరిచేందుకు జాతీయ అంతర్గత జల రవాణా సంస్థ (ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) బ్లూ ప్రింట్‌ను తయారు చేసింది. కాకినాడ నుంచి పుదుచ్చేరి దాకా గోదావరి- కృష్ణా నదుల అనుసంధానం ద్వారా జల రవాణాను అభివృద్ధి చేసే కార్యాచరణ ప్రణాళికలనూ సిద్ధం చేసింది. వీటిని సత్వరం అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం 1078 కిలోమీటర్ల మేర జల రవాణాను వృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 810 కి.మీ., తమిళనాడులో 188 కి.మీ., తెలంగాణలో 78 కి.మీ., పుదుచ్చేరిలో 2 కి.మీ. మేర అభివృద్ధి చేస్తారు. మొత్తం మూడు దశల్లో దీనిని అమలు చేస్తారు. తొలిదశలో రూ.96 కోట్లతో ముక్త్యాల నుంచి విజయవాడ దాకా కృష్ణా నదిపై 82 కి.మీ. మేర జల రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ముక్త్యాల, హరిచంద్రపురం, ఇబ్రహీంపట్నం వద్ద ఫిక్స్‌డ్‌ టెర్మినళ్లను నిర్మిస్తారు. అదేవిధంగా ఫ్లోటింగ్‌ టెర్మినళ్లను వేదాద్రి, అమరావతి, భవానీ ఐలాండ్‌, దుర్గాఘాట్‌ వద్ద ఏర్పాటు చేస్తారు. రెండో దశలో రూ.6,919 కోట్లతో విజయవాడ-కాకినాడ-రాజమండ్రి-పోలవరం వరకూ జల రవాణాను చేపడతారు. ఇందుకోసం రూ.767 కోట్లతో ప్రైవేటు భూములను సేకరిస్తారు. రూ.2985 కోట్ల విలువైన 3061.94 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమిని బదలాయిస్తారు. రూ.453 కోట్లతో 35.45 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మేర డ్రెడ్జింగ్‌ పనులు నిర్వహిస్తారు. రూ.180 కోట్లతో కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెం వద్ద టెర్మినళ్లను నిర్మిస్తారు. రూ.2319 కోట్లతో 473 సివిల్‌ పనులు చేపడతారు. రూ.190 కోట్లతో 46.24 కిలోమీటర్ల మేర రిటైనింగ్‌ వాల్‌ను నిర్మిస్తారు. మూడో దశలో 495 కిలోమీటర్ల మేర కొమ్మమూరు నుంచి ఉత్తర బకింగ్‌హామ్‌ కెనాల్‌ (ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో) దాకా జల రవాణాను అభివృద్ధి చేస్తారు.
Link to comment
Share on other sites

Any work happening on BC? pls enlighten me. Iam telugu illiterate.

 

nothing much. same movie preview. They have plans ready. 

first phase       : Muktyala - Vijayawada - 82km - 96 crore. dredging is underway.

 

second phase : vijaywada-kakinada + Polavaram-Rajahmundry - 6919 crores project. state government spends 767 cr for private land acquistion and another 2985 cr worth of state govt lands will be transferred to this authority. rest of the money national water ways will spend for civil/concrete works.

 

third phase     :  vijayawada towards chennai up to AP border.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

త్వరలో ముక్త్యాల-అమరావతి జలమార్గానికి శంకుస్థాపన: నితిన్‌గడ్కరీ

ఈనాడు, దిల్లీ: ముక్త్యాల-అమరావతి మధ్య జలమార్గం అభివృద్ధికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర రవాణా, నౌకాయానశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ఓడల (క్రూజ్‌) పర్యాటకాభివృద్ధిపై కార్యాచరణ రూపొందించడానికి మంగళవారం ఇక్కడ ఏర్పాటుచేసిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు త్వరగా శంకుస్థాపన చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను ఆహ్వానిస్తున్నారని, త్వరలో తామిద్దరం కలిసి పునాదిరాయి వేస్తామని పేర్కొన్నారు. 160 కిలోమీటర్ల ఈ తొలి దశ ప్రాజెక్టు కోసం రూ.వంద కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో క్రూజ్‌ పర్యాటకాభివృద్ధి కోసం మూడు నెలల్లో సరికొత్త విధానం తీసుకురానున్నట్లు చెప్పారు. ముంబయి, గోవా, మంగళూరు, చెన్నై, కొచ్చిన్‌లలో క్రూజ్‌ టెర్మినళ్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

కృష్ణా తీరం.. ఆనంద విహారం

‘ముక్త్యాల-అమరావతి’ జలమార్గంతో అదనపు హంగులు

amr-sty2a.jpg

అటువైపు ఎత్తైన పర్వత శ్రేణి... ఇటు చూస్తే ఆధ్యాత్మిక క్షేత్ర తరంగిణి... వీటి నడుమ ప్రవహించే అందాల కృష్ణవేణి.. ఇదీ పశ్చిమకృష్ణా జగ్గయ్యపేట సమీపంలో కనిపించే ప్రకృతి అందాల విరిబోణి. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య పరవళ్లు తొక్కుతూ రాజధానివైపు ప్రవహిస్తూ జనజీవన స్రవంతిలో మమేకమైన ఆ జీవనదితో పెనవేసుకున్న అనుబంధానికి ఇప్పుడు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఇక్కడ సహజ సిద్ధంగా ఒంపులు తిరుగుతూ వయ్యారంగా సాగే కృష్ణానదిపై పులిచింతల ప్రోజెక్ట్‌ పుణ్యమా అని స్థిరమైన నీటిమట్టానికి లభించే అవకాశాన్ని ‘ముక్త్యాల-అమరావతి’ జలమార్గం ద్వారా జలరవాణాకు వేధిక చేయాలనే కేంద్రప్రభుత్వ యోచన ఈ ప్రకృతి అందాలకు మరింత శోభను చేకూర్చే వరంలా మారనుంది. ముక్త్యాల-విజయవాడ జలమార్గ ప్రతిపాదన కార్యాచరణకు కూడా నోచుకోవడంతో అతి కొద్దికాలంలోనే ఈప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక, పౌరాణిక, పారిశ్రామిక, రవాణా రంగాలన్నింటికీ మరింత జవజీవాలు సమకూరనున్నాయి.

ఉత్తర వాహినిగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్న పశ్చిమకృష్ణా తీరం బహుముఖ ప్రయోజనాలకు వేదికగా మారనుంది. కొత్తగా కేంద్రప్రభుత్వ ప్రతిపాదిత జలరవాణా మార్గాల్లో స్తానం సంపాదించుకున్న ‘ముక్త్యాల-అమరావతి’ జలమార్గం ద్వారా మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక, పారిశ్రామిక ప్రత్యేకతలతో నిండి ఉన్న పశ్చిమ కృష్ణా తీరానికి మరో అదనపు సదుపాయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అమరావతి రెండు జిల్లాల పరిధిలోని ఈ ప్రాంతానికి గుర్తింపు పెరగబోతుంది. ఇప్పటికే జగ్గయ్యపేట సమీపంలోని అలకనంద రివర్‌ఫ్రంట్‌ ప్రొజెక్ట్‌ ద్వారా కొనసాగుతున్న పర్యాటకాభివృద్ధికి ఈ జలరవణా మరింత వూతంగా నిలవనుంది. ప్రస్తుతం నదిలో ఇసుక పూడికతీత పనులకు కూడా శ్రీకారం చుట్టిన నేపథ్యంలో త్వరలోనే అది కార్యాచరణలోకి వస్తుందని రెండు జిల్లాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రూ.96 కోట్ల మంజూరుతో మొదలైన ముక్త్యాల-విజయవాడ జల రవాణా మార్గం ద్వారా జగ్గయ్యపేటప్రాంత సిమెంట్‌ పరిశ్రమ నుంచి సులువుగా రవాణాతోపాటు అనేక ఇతర లాభాలను కూడా సమకూర్చబోతుంది. ముక్త్యాల నుంచి నది మార్గంలో 40 కి.మీ.ల లోపు ఉండే అమరావతికి ఇప్పుడు ప్రయాణం చేయడం చాలా దూరమవుతోంది. విజయవాడ మీదుగా అమరావతి చేరుకోవడానికి 100 కి.మీ.కుపైగా ప్రయాణం చేయాల్సిందే. సొంత వాహనాలు ఉన్నా బుగ్గమాదవరం, రామన్నపేటల వద్ద బల్లకట్టుపై నుంచి ప్రయాసతో కూడిన ప్రయాణం చేసినా అది 80 కి.మీ.లకు పైగానే ఉంటుంది. పడవలో ఆవలి ఒడ్డుకు చేరుకొని ప్రయాణం చేయడానికి సరైన బస్సు సౌకర్యాలు లేవు. కొత్తగా ప్రకటించిన జలమార్గం అందుబాటులోకి వస్తే ఈ దూరాభారమంతా తగ్గి ప్రయాణికులకు, సరకు రవాణాకే కాకుండా పర్యాటక రంగ ఔత్సాహికులకు కూడా ఇది ఒక కొత్త అవకాశమే అవుతుంది.

పెరగనున్న ఆదాయ వనరులు

ఈ జలమార్గం ఏర్పడితే పశ్చిమకృష్ణా తీరంలో ఆదాయ వనరులు కూడా గణనీయంగా పెరగనున్నాయి. తాజా రవాణా సాధనం ద్వారా కొత్తవారికి ఉపాధి అవకాశాలతోపాటు అనుబంధంగా పెరిగే వివధ వాణిజ్య, వ్యాపారాలు, ఇతర అవకాశాలు నవ జీవన ప్రమాణాలకు ఉతమిచ్చేవిగా ఉంటాయని భావిస్తున్నారు. ఆతిథ్య రంగం, ఆహార శాలలు, చేతివృత్తి రంగాలు, కొత్త ప్యాషన్‌ పురోభివృద్ధితో పాటు సేవారంగంద్వారా ఎక్కువ మంది ఉపాధి పొందుతారు.

అత్యంత సామర్థ్యంగల పడవలతో రవాణా

బ్రిటీష్‌ కాలంలో కేవలం 30టన్నుల సామర్థ్యంతో కూడిన పడవలతో సాగిన జలరవాణా ప్రస్తుత మార్గంతో అత్యధికంగా 1000 టన్నుల సామర్థ్యం గల పడవలతో జరగనుంది. దీనికి అనుగుణంగా నదిని కూడా రెట్టింపు వెడల్పునకు విస్తరించే ప్రక్రియ ప్రస్తుత ప్రతిపాదనలో ఉంది. ముక్త్యాల - విజయవాడల నడుమ జల రవాణామార్గంలో నిర్మించబోయే ఏడు టర్మినల్స్‌లో మూడింటిని సరకు రవాణాకు, నాలుగింటిని ప్రయాణికుల కోసం నిర్దేశించడం ద్వారా ఈ ప్రాంతం పర్యాటక రంగానికే కాక, ప్రజల అవసరాలకు కూడా ఎంతో వూతంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

పూర్వపు మార్గం పునరుద్ధరణ

రహదారి, రైలు మార్గాలు అభివృద్ధి చెందకముందు బ్రిటీష్‌ పాలకులు ఈప్రాంతంలో చేపట్టిన జలరవాణా మార్గం మళ్లీ ఈ కొత్త ప్రతిపాదనలతో పునరుద్ధరణ కాబోతుంది. ప్రస్తుతం రోడ్డు, రైలు మార్గాల్లో ఉన్న దూరాభారాన్ని తగ్గించేందుకు ఈ జలరవాణా మంచి తరుణోపాయంగా నిలవనుంది. విజయవాడలోని ప్రకాశం ఆనకట్టకి ఎగువన కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య ఎక్కడా వంతెనలేని లోటును ఇటీవల రూపుదిద్దుకున్న పులిచింతల కూడా తీర్చలేకపోయింది. పులిచింతల-ప్రకాశం ఆనకట్టల మధ్య ఉన్న 100 కి.మీ.ల నిడివిలో ఎక్కడా వంతెన లేకపోవడంతో రెండు, మూడు చోట్ల బల్లకట్టును ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. అదికూడా పూర్తిస్థాయి సౌకర్యం కాకపోవడంతో ప్రస్తుత జలరవాణా ఈ సమస్యను తీర్చబోతుంది. కృష్ణా, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో పాతికకు పైగా ఉన్న సిమెంటు పరిశ్రమల నుంచి వేలాదిగా వచ్చే రవాణా వాహనాలతో రాజధానికి సిమెంట్‌ని తరలించడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో సిమెంటు తరలింపును అత్యంత చౌకగా మార్చనున్న జలరవాణాకు మార్గం సుగమం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

పారిశ్రామికరంగానికి చేయూత

జగ్గయ్యపేటప్రాంతంలోని సహజమైన భూగర్భ వనరులు, భౌగోళిక సానుకూలతల కారణంగా ఇక్కడ కేంద్రీకృతం అవుతున్న పారిశ్రామిక రంగానికి కూడా జలరవాణా మరింత చేయతను ఇవ్వబోతుంది. ఇప్పటికే కృష్ణా-నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న జగ్గయ్యపేటప్రాంతంలో రూపుదిద్దుకున్న సిమెంట్‌, స్పిన్నింగ్‌, రసాయన తదితర పరిశ్రమలకు ప్రస్తుత జలరవాణాతో మేలు కలగనుంది. ముఖ్యంగా జల రవాణా వల్ల ఈప్రాంతానికి రాజధానితో అత్యంత సమీపంగా, సులభంగా అనుసంధానం అయ్యే అవకాశం మెరుగుపడనున్న నేపథ్యంలో అది పారిశ్రామికాభివృద్ధితో పాటు ఈప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కూడా ఉపయోగంగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.

క్షేత్ర దర్శనానికి మరింత వూతం

కృష్ణానదితో అనుబంధాన్ని పెనవేసుకొని శతాబ్దాలుగా భక్తుల ఆర్తిని తీరుస్తున్న పలు పుణ్యక్షేత్రాలన్నీ ప్రస్తుతం జలరవాణా ప్రతిపాదనతో మరింత అందుబాటులోకి రానున్నాయి. రోజంతా నదీయానం చేసేందుకు వీలు కల్పించే పాపికొండల్లోని బోటు షికారు తరహాలో పలు క్షేత్రాలను దర్శిస్తూ కృష్ణానది ఒడిలో ఓలలాడే అవకాశాన్ని ఈ కొత్త పథకం కల్పించబోతుంది. కృష్ణా, గుంటూరు, నల్గొండ జిల్లాల కూడలిప్రాంతంగా ఉన్న ముక్త్యాల నుంచి ఎటువైపు 2 కి.మీ.లు వెళ్లినా జిల్లా మారిపోతుంది. ముక్త్యాలలోనే ఉన్న పురాతన ముక్తేశ్వరాలయం, చెన్నకేశవాలయం, పై ఎత్తున వజినేపల్లిలోని దవళగిరి బదరీనారాయణక్షేత్రం, ఆవలి ఒడ్డున ఉన్న భరధ్వాజుని కొండ, ప్రవాహపు వాలులో దర్శనమిచ్చే వేదాద్రి పంచనారసింహక్షేత్రం, రావిరాలవద్ద పాలేటి నదీసంగమం, నందిగామ ప్రాంతంలోని గుడిమెట్ల దేవాలయాల శ్రేణి ఇలా విభిన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ సాగే పడవ ప్రయాణం మానసిక ఉల్లాసానికి ద్వారాలు తెరవనుంది.

- జగ్గయ్యపేట, న్యూస్‌టుడే
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...