మరావతి: తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసం వద్ద ఆశావహుల సందడి నెలకొంది. ఆఖరి జాబితాలో చోటు దక్కించుకునేందుకు ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు నివాసానికి మందకృష్ణ మాదిగ వచ్చారు. డేగల ప్రభాకర్ను వెంటబెట్టుకొని వచ్చిన గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చంద్రబాబును కలిశారు. విజయనగరం లోక్సభ కోసం కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.
27 నుంచి ‘ప్రజాగళం’ ప్రచారం.. షెడ్యూల్ ఇలా..
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ‘ప్రజాగళం’ పేరుతో నిర్వహించే వివిధ సభలు, రోడ్షోల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 27 నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. 31 వరకు వరుసగా పర్యటించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు.