క్రీడల హబ్గా ఏఎన్యూ 08-05-2017 10:35:01
ఎన్నో జాతీయ క్రీడలను సమర్ధంగా నిర్వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నవ్యాంధ్రలో క్రీడలకు హబ్గా మారింది. ఏపీ పీసెట్ను అప్రతిహతంగా15వసారి నిర్వహిస్తూ పేరుగడిస్తోంది. ఇక్కడ క్రీడల నిర్వహణకు, మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.27.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. రానున్న రోజుల్లో ఏఎనయూ... క్రీడల నిర్వహణ, వ్యాయామ విద్యలో రాష్ర్టానికే వన్నె తీసుకురానుంది.
రూ.27.60 కోట్లతో క్రీడా సదుపాయాలు
అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్ ట్రాక్
జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణ
నవ్యాంధ్రలో క్రీడా వర్సిటీగా ఏఎనయూ
15వ సారి ఏపీ పీసెట్ నిర్వహణకు సంసిద్ధం
నేటి నుంచి పీసెట్
అమరావతి: నవ్యాంధ్రలో క్రీడల నిర్వహణ, వ్యాయామ విద్యలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ముందంజలో ఉంది. ఎన్నో జాతీయ క్రీడలను సమర్ధంగా జరుపుతూ.. ఏపీ పీసెట్కు 15వసారి నిర్వహిస్తూ, క్రీడల హబ్గా నిలుస్తోంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు వర్సిటీ క్రీడా ప్రాంగణం సన్నద్దమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతి సదుపాయాలు కల్పించడానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రూ.27.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం రూ.10 కోట్లతో 200 పడకల వసతి గృహ నిర్మాణం జరుగుతోంది. మల్టీ జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్ను రూ.కోటితో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వర్సిటీలో రూ.2.40 కోట్లతో ఫిట్నెస్ సెంటర్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. గ తంలో రూ.5 కోట్లతో క్రీడా వసతి గృహం నిర్మించారు. ఇండోర్ గేమ్ల నిర్వహణకు అనువుగా లంకపల్లి బుల్లయ్య ఇండోర్ స్టేడియం, జిమ్ సెంటర్, శాండ్ ట్రాక్, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ వెయిట్ లిఫ్టింగ్తో పాటు సువిశాలమైన, దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా మైదానం వర్సిటీలో ఉన్నాయి.
అద్భుతంగా సింథటిక్ ట్రాక్
కేంద్ర యువజనుల, క్రీడల వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.5.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల నిర్వహణకు వీలుగా ఉన్నత ప్రమాణాలతో క్రీడా మైదానంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ట్రాక్ ఇరువైపులా, అంతర్జాతీయ స్థాయిలో ఫ్లడ్ లైట్ల నిర్మాణానికి రూ.8.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 4 టవర్లను ఏర్పాటు చేసి, ఒక్కో టవర్కు 102 ఫ్లడ్ లైట్లు, అమర్చనున్నారు. వార్మ్ ఆఫ్ సింథటిక్ ట్రాక్కు రూ.8 కోట్లతో చేపట్టనున్నారు. రూ.40 మీటర్లతో 6 లైన్ల నిర్మాణం జరుగనుంది.
నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) సంస్థ నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. 400 మీటర్ల పరిధిలో ట్రాక్ ఏర్పాటు, దానికి అనుగుణంగా మురుగు, నిల్వ నీరు లేకుండా వుండేందుకు ప్రత్యేకంగా డ్రెయిన్ సదుపాయం కల్పించారు. ట్రాక్ నిర్మాణంలో రెండు రకాలైన మెటీరియల్ను వినియోగించారు. ఫుల్ పియుఆర్, శాండ్విచ్ వంటి మెటీరియల్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు.
400 మీటర్ల పరిధి....
సింథటిక్ ట్రాక్ నిర్మాణ పరిధిని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. ట్రాక్పై ఒకేసారి 8 మంది పరుగెత్తేలా నిర్మిస్తున్నారు. ట్రాక్ మధ్యలో 22 క్రీడల నిర్వహణకు అనువుగా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పచ్చని గడ్డి, లాన్తో ఏర్పాటు జరుగుతోంది. షాట్పుట్, ఫుడ్బాల్, హాకీ, లాంగ్జంప్ వంటి క్రీడలు నిర్వహించవచ్చు. 400 మీటర్ల ట్రాక్ తోపాటు అదనంగా 100 మీటర్ల లైను, ట్రాక్ ఇరువైపులా హైజంప్, పోల్వాలెట్, జావలిన్త్రో, రెండు లాంగ్ జంప్ రన్వే, తదితర క్రీడా సదుపాయాలకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీసెట్ - 2017) జరగనుంది. 17వ తేదీ వరకు దేహదారుఢ్య, క్రీడల నైపుణ్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీ సెట్ కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు. పరీక్షలకు 4,649 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఈనెల 8 నుంచి 15 వరకు పురుష అభ్యర్థులకు 16, 17ల్లో మహిళా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. బీపీఈడీ కోర్సుకు 2,400, యూజీడీ పీఈడీకి 2,249 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తొలిరోజు హాల్టికెట్ నంబరు 1701 నుంచి 17,456 వరకు మొత్తం 456 మంది పురుష అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు.
విజయవంతంగా క్రీడా పోటీలు
ఏఎనయూలో ఆలిండియా ఇంటర్ వర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలను 2004, 2011 సంవత్సరాల్లో నిర్వహించారు. మరోసారి ఈ ఏడాది డిసెంబర్లో పోటీలు నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మించిన సింథటిక్ ట్రాక్పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్ 12 నుంచి 15 వరకు జాతీయ, అంతరాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్, నవంబర్ 1 నుంచి 5 వరకు జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను వర్సిటీలో జరగనున్నాయి.