ఆంధ్రలో మెజారిటీ సర్వేలు కూటమి వైపే చూపుతున్నాయి. నేనెపుడూ అనేమాట చంద్రబాబు యమజాతకుడని. యమజాతకుడంటే ప్రత్యర్ధి ఈయన ప్రయత్నం లేకుండానే హరించుకుపోతాడు లేదా ఈయనకి సహకరించేస్తాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో.
చంద్రబాబు మామ ఎన్టీఆర్ ని తోసేసిన ఐదు నెలలలోపే ఎన్టీఆర్ తన బ్రతుకు పట్ల విరక్తి చెంది తనువు చాలించేశాడు. ఎక్కడినుంచి లేచాడో తెలియని వాజపాయి వచ్చి వైయస్ నడ్డగించి 1999 లో చంద్రబాబును గెలిపించేశాడు. తర్వాత వైయస్ మూడు వేల కిలోమీటర్లు నడవాల్సొచ్చింది చంద్రబాబును దించటానికి. తీరా చూస్తే ఐదేళ్లు పూరా లేకుండ ఊపిరి చాలించేశాడు.
తర్వాత మళ్ళీ చంద్రబాబే. తిరిగి తనదైన మార్కు పాలనతో 23 కొచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి గెలిచేస్తాడంటున్నారంటే అదంతా ప్రత్యర్ధి స్థానంలో ఉన్న జగన్ బాబు చలవ. 151 సీట్లు కొట్టి ఏమీ చేయకుండా కేవలం డిఫెన్స్ ఆడుకుంటే చంద్రబాబు పార్టీ సహజమరణం చెందేసి ఉండును. కానీ పాపం జగన్ తనకి 151 సీట్ల అఖండ మెజారిటీనిచ్చిన చంద్రబాబు రుణాన్నెలా ఉంచుకుంటాడు? అందుకే ఇసుక దొరక్కుండా చేసి, రోడ్లు నడవకుండా చేసి, రాజధాని లేకుండ చేసి,మద్యం బ్రాండు తీసేసి రేటు మూడు రెట్లు చేసి, చంద్రబాబుని అరెస్ట్ చేసి పవన్ తో పొత్తు కుదిర్చి, తానేమో జనానికి దూరంగా జరిగి,తెలుగుదేశం పార్టీకి ఊపిరులూది ఎంత ఉపకారం చెయ్యాలో అంతా చేశాడు. అందుకే చంద్రబాబు యమజాతకుడనేది.
ఈతూరి చంద్రబాబు గెలిస్తే ఆయన ఇంటి మెయిన్ హాల్లో ఎన్టీఆర్ ఫోటోతో పాటు జగన్ బాబుది కూడా ఒక ఫోటో పెట్టుకోవాలి.ఇది ఎవరినీ గాయపరచాలని కాదు, నాకనిపించిన భావాన్ని సరదాగా మీతో పంచుకుంటున్నానంతే. నేనిష్టపడే పార్టీ ఎలాగూ ఇంకా శిధిలాలకిందనే ఉంది.అందుచేత ఎవరైతే నాకేంటి అనే తెంపరితనం కొంచెం వచ్చిందంతే.