Jump to content

Amaravati


Recommended Posts

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని అంకుర ప్రాంత అభివృద్ధిలో భాగంగా సింగపూర్‌ సంస్థల కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థ ‘ఫేజ్‌ జీరో’ పేరుతో ఐదారు ఎకరాల్లో ఒక ప్రాజెక్టు చేపట్టనున్నాయి. మొత్తం 1691 ఎకరాలను అంకుర ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు మూడు దశలుగా విభజించిన విషయం తెలిసిందే. మొదటి దశలో 656 ఎకరాలను తీర్చిదిద్దాలని సంకల్పించగా ఇందులోనే ఫేజ్‌ జీరో ప్రాజెక్టును భాగస్వామ్యం చేస్తున్నారు. అంకుర ప్రాంతంలో రాబోయే 20 ఏళ్లలో తాము అభివృద్ధి చేయబోయే ప్రాజెక్టులు, భవనాల సమగ్ర వివరాలు, త్రీడీ నమూనాలతో ప్రద్శన కేంద్రం ఏర్పాటు వంటివి ఇందులో ఉంటాయి. వివిధ ఎక్స్‌పోల నిర్వహణకు మైదానాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. అంకురప్రాంత అభివృద్ధితో పాటు, రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు సహా వివిధ అంశాలపై చర్చించేందుకు సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన జేఐఎస్‌సీ (జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ) రెండో సమావేశం శుక్రవారం జరుగుతుంది. అంకురప్రాంత అభివృద్ధికి 2017 మే 15న శంకుస్థాపన జరగగా ఆ రోజే తొలి సమావేశం జరిగింది. తాజాగా శుక్రవారం జరగబోయే సమావేశానికి సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌ అమరావతికి వస్తున్నారు. జేఐఎస్‌సీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈశ్వరన్‌ ఛైర్మన్‌లుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ డిజైన్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, అర్బన్‌ అసెట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (యూఏఐఎంఎస్‌), రాజధాని ప్రాంత పెట్టుబడుల అభివృద్ధి సంస్థ (క్రిపా) ఏర్పాటు చేయాలని తొలి సమావేశంలో నిర్ణయించారు. వాటి పురోగతిపై శుక్రవారం చర్చించనున్నారు. విజయవాడ-సింగపూర్‌ మధ్య నేరుగా విమానం నడపాలన్న ప్రతిపాదనపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Link to comment
Share on other sites

నిర్ణీత సమయంలో నిర్మాణాలు పూర్తిచేయాలి
విజయవాడ, న్యూస్‌టుడే: అమరావతి పరిధిలోని ప్రభుత్వ నగరంలో చేపట్టనున్న గృహనిర్మాణ ప్రాజెక్టులను నిర్ణీతసమయంలో పూర్తిచేయాలని సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ గుత్తేదారు ప్రతినిధులకు సూచించారు. ఈ ప్రాజెక్టులపై గురువారమిక్కడ సీఆర్డీఏ కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. ప్యాకేజీ-1లో ఎమ్మెల్యేలు, ఆలిండియా సర్వీసు అధికారుల నివాసాలను ఎన్‌సీసీ.. ప్యాకేజీ-2లో ఎన్‌జీవోల నివాసాలను ఎల్‌అండ్‌టీ, ప్యాకేజీ-3లో గజిటెడ్‌ అధికారులు, క్లాస్‌-4 నివాసాలను షాపూర్జీ పల్లోంజీ సంస్థలు నిర్మించనున్నాయి. వీటికి సంబంధించి నిర్మాణ ప్రణాళిక, అవసరమైన మెటీరియల్‌, నీరు, రోడ్డు, విద్యుత్తు సౌకర్యాలపై చర్చించారు. నిర్మాణ ప్రదేశంలో అవసరమైన అన్ని విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. వారానికోసారి ఈ ప్రాజెక్టులపై సమీక్ష జరుపుతామని శ్రీధర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

అమరావతికి ‘క్యాడ్‌సిస్‌టెక్‌’ సంస్థ ‘అక్షర’ కూడా
1300 మందికి ఉద్యోగావకాశాలు
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి మరో రెండు ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇంజినీరింగ్‌ డిజైనింగ్‌లో రాణిస్తున్న దేశీయ ఐటీ సంస్థ ‘క్యాడ్‌సిస్‌టెక్‌’ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు మంగళగిరిలోని ఐ డాటా సెంటర్‌కు సమీపంలో ఎకరా స్థలం కేటాయించారు. ఈ సంస్థ  దాదాపు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇప్పటికే క్యాడ్‌సిస్‌టెక్‌ తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అలాగే అక్షర ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కూడా మంగళగిరిలో కార్యాలయం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థకు అరఎకరా కేటాయించారు. దీని ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఈ రెండు సంస్థలకు సంబంధించి ఈ నెల 24న ఐటీ మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Link to comment
Share on other sites

వంతెన ఆకృతులకు ఇంకెన్నాళ్లు?
8 నెలలైనా కొలిక్కిరాని ప్రక్రియ
ఈనాడు - అమరావతి
రాజధాని అమరావతిని కృష్ణా జిల్లాతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన మకుటాయమాన (ఐకానిక్‌) వంతెన నిర్మాణాన్ని ప్రారంభించడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఈ వంతెన ఇటు కృష్ణా జిల్లా పవిత్రసంగమం వద్ద మొదలై.. అటు రాజధాని అమరావతిలోని పరిపాలన నగరం సమీపంలో కలుస్తుంది. రాజధాని అవసరాలకు ఈ వంతెన నిర్మాణం అత్యవసరం. ప్రభుత్వం దాదాపు ఎనిమిది నెలల నుంచి ఆకృతుల రూపకల్పనతోనే కాలం గడిపేస్తోంది. ఈ వంతెనను నిర్మిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక గ్రామాల ప్రజలకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. అటు కృష్ణా జిల్లా నుంచి నిర్మాణ సామగ్రిని రాజధాని అవసరాలకు తరలించడం తేలికవుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య చాలా గ్రామాల ప్రజలు లాంచీలపైనే ఆధారపడుతున్నారు. ద్విచక్ర వాహనాల్ని కూడా లాంచీల్లో ఎక్కించి, ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. రాజధాని నిర్మాణం ఊపందుకునే కొద్దీ... ఈ ప్రాంతాల మధ్య రాకపోకలు, ప్రయాణికుల రద్దీ మరింత పెరుగుతాయి. దీంతో ఆకృతుల పేరుతో జాగు చేయడం మానేసి.. ఇప్పటికైనా వంతెన నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇంకా ఎన్నేళ్లు...!
* ఈ వంతెన రాజధానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా మకుటాయమానంగా నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆకృతుల రూపలక్పన బాధ్యతను ఎల్‌ అండ్‌ టీ సంస్థకు అప్పగించింది.
* ఆ సంస్థ మార్చి నెలలో ఆరు ప్రాథమిక ఆకృతులు అందజేసింది. వాటిలో రెండు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకట్టుకున్నాయి. రెండు ఆకృతుల్లోని మంచి లక్షణాలను మేళవించి 15 రోజుల్లో తుది ఆకృతి సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
* ఆ తర్వాత మళ్లీ ఆకృతుల రూపకల్పన బాధ్యతను ఎల్‌ అండ్‌ టీ సంస్థతో పాటు, ఎస్‌పీ సింగ్లా,    సిబ్‌మోస్ట్‌ వంటి సంస్థలకు అప్పగించారు. ఆ సంస్థలు జులైలో ఆకృతులు అందజేశాయి.
* ఇంత వరకు ఆకృతుల్ని ఖరారు చేయలేదు.

వారం రోజుల్లో టెండర్లు..!
మకుటాయమాన వంతెన నిర్మాణానికి వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూపొందించిన ఆకృతులన్నీ అవగాహన కోసమేనని, ఈపీసీ విధానంలో వంతెన నిర్మాణ పనులు దక్కించుకున్న సంస్థే ఆకృతులు కూడా రూపొందిస్తుందని వారు చెబుతున్నారు. టెండరు ప్రక్రియ పూర్తయ్యేసరికి కనీసం రెండు నెలలు, ఎంపికైన సంస్థ సర్వే చేసి, ఆకృతులు రూపొందించేందుకు కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది. నిర్మాణానికి రెండేళ్ల సమయమైనా పట్టొచ్చు.

వంతెన పొడవు: 3.2 కిలోమీటర్లు
నిర్మాణ వ్యయం: అప్పట్లో రూ.800 కోట్లని అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలు మారే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

తుళ్లూరు: రాజధానిలో బ్లూ అండ్‌ గ్రీనరీకి అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మందడం వద్ద గల సీడ్‌ రోడ్డు పక్కన జరిగే కార్యక్రమంలో ఐదు వేల మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొన్న మొక్కలు నాటతారు. కార్యక్ర మానికి గుర్తుగా పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. గురువారం రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు, అమరావతి ఏఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, సీఐ సుధాకర్‌ భద్రతా ఏర్పాటు పర్యవేక్షించారు. ఏడు వందల మంది పోలీసులు ఈ కార్యక్రమంలో బందోబస్తు నిర్వహిస్తారు.

Link to comment
Share on other sites

నదికి 100 మీటర్ల లోపు సీఎం ఇల్లు ఉంటే తొలగిస్తాం: నారాయణ
17-11-2017 21:08:53
అమరావతి: రాజధాని నిర్మాణంపై ఎన్జీటీ ఆదేశాలు పాటిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కృష్ణా నదికి 100 మీటర్ల లోపు ఉన్న భవనాలు తొలగిస్తామని, నదికి 100 మీటర్ల లోపు సీఎం ఇల్లు ఉంటే తొలగిస్తామని చెప్పారు. స్టార్టప్‌ ఏరియాలో 1691 ఎకరాల్లో ప్లాట్ల అమ్మకం చేపట్టామన్నారు. కేపిటల్‌ సిటిలో ఏడాదిలో రహదారుల నిర్మాణం చేపడుతామని నారాయణ చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. పర్యావరణానికి హాని కలుగుతుందన్న పిటిషన్‌ను ఎన్జీటీ తోసిపుచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే.. జప్తు చేసేందుకు రూ. కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది.

Link to comment
Share on other sites

CM house is completely with-in 100 metres from river bank. Ee Narayana gari "if" sollu enti? only the structure built for visitors is out side 100m.

 

asalu where is this 100m limit coming from? why can't a residence be in that range?

on the other side of river there are houses right on the bank.

Link to comment
Share on other sites

అమరావతికి పచ్చజెండా
బలవంతంగా భూములు లాక్కుంటున్నారన్న వాదనల్లో పసలేదు
అపోహలను కొట్టేసిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌
పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా షరతులు
ముందు జాగ్రత్తగా రెండు కమిటీల ఏర్పాటు
ఈనాడు, దిల్లీ : అమరావతి నగర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. కొన్ని ముందుజాగ్రత్త చర్యలతో రాజధాని నిర్మాణ కొనసాగింపునకు జాతీయ హరితట్రైబ్యునల్‌ పచ్చజెండా ఊపింది.  వరద ముప్పు పొంచివున్న కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ నగరంవల్ల భవిష్యత్తులో మనుషులతోపాటు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉన్నందున దీన్ని నిలిపేస్తూ ఉత్తర్వులివ్వాలని దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణం తలపెట్టారన్న వాదనలను తోసిపుచ్చింది. ప్రాజెక్టుకిచ్చిన పర్యావరణ అనుమతులు నిలిపేయాలన్న విజ్ఞప్తులను తిరస్కరించింది. అమరావతి నిర్మాణాన్ని ఆపేయాలని కోరుతూ దాఖలైన నాలుగు కేసులను కొట్టేస్తూ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ముఖ్యధర్మాసనం శుక్రవారం 145 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది. పిటిషనర్లు వ్యక్తంచేసిన అనుమానాలన్నింటికీ హరితట్రైబ్యునల్‌ తన తీర్పులో సమాధానం ఇవ్వడంతోపాటు, భవిష్యత్తులో పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా కొన్ని షరతులు విధించింది. వాటి అమలు తీరు పర్యవేక్షణకు రెండు కమిటీలు వేసింది. అమరావతి నగరంలో జరిగే అభివృద్ధి పనులన్నింటినీ కమిటీలు పర్యవేక్షించి ఆరునెలలకోసారి తనకు నివేదిక అందించాలని నిర్దేశించింది. రాజధాని నిర్మాణంపై పిటిషనర్లు లేవనెత్తిన ప్రతి అంశాన్నీ పరిశీలించి తాము ఈ తీర్పు ఇస్తున్నట్లు వెల్లడించింది. పాతచరిత్రను బట్టిచూస్తే ఈ ప్రాంతం మునిగిపోయేంత వరదలు ఎప్పుడూరాలేదని పేర్కొంది.

1853లో చరిత్రలో ఎప్పడూలేనంత భారీ వరదలు వచ్చినప్పుడుకూడా కృష్ణానది రాజధాని ప్రాంతంలోకి పొంగిన దాఖలా లేదని స్పష్టంచేసింది. అందువల్ల ఈ ప్రాంతం వరదముంపునకు గురయ్యే అవకాశం లేదని పేర్కొంది. ఇక్కడ చేపట్టే నిర్మాణాలవల్ల భూ, జల భౌగోళిక స్వరూపానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టంచేసింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన అధికసంఖ్యలో జలాశయాలు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించడంవల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా డ్యాంలు దెబ్బతింటే ప్రమాదం పొంచి ఉంటుందన్న వాదనలను ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. వెయ్యేళ్లకోసారి వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకొని రాజధాని మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారని, అనుకోనిరీతిలో  వచ్చిన వరదలవల్లా ఎలాంటి ముంపులేని విధంగా అందులో ఏర్పాట్లుచేశారని పేర్కొంది. కొండవీటి వాగును పూర్తిగా సంస్కరించి దాన్నుంచి వచ్చే నీటిని నిల్వచేసి రాజధాని అవసరాలకోసం వాడుకుంటామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఏడాదిలో కొన్నిరోజులు మాత్రమే ప్రవహించే దానివల్ల పెద్ద ముంపేమీ ఉండదని వ్యాఖ్యానించింది. రాజధాని ప్రాంతంలోని వరదనీటికాలువలన్నింటినీ అనుసంధానించి ఆనీటిని జలాశయాల్లోకి మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నందున అది భూగర్భజలాల రీఛార్జికిదోహదం చేసే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది.

జలాశయాలచుట్టూ కచ్చితంగా హరితప్రదేశం ఉండాలని పేర్కొంది. అమరావతిని రాజధానిగా ఎంపికచేయడం శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులకు విరుద్ధమన్న వాదనలనూ ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. రాజధాని ప్రాంత ఎంపిక చేసే ప్రత్యేక నిర్ణయాధికారం  రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ఆ కమిటీ చెప్పిన విషయాన్ని తీర్పులో గుర్తుచేసింది. ఫలానా చోట రాజధానిని ఏర్పాటుచేయాలని కమిటీ తన నివదేఇకలో ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. ఆ కమిటీ కొన్ని రాజధానికి అనువైన ప్రాంతాలను మాత్రమే గుర్తించిందని, అందులో మిగతా ప్రాంతాలకంటే విజయవాడ-గుంటూరు ప్రాంతం మిగతా జోన్లకంటే మిన్నగా నిలిచిందని వ్యాఖ్యానించింది. భూసమీకరణ అంశంలో భూములిచ్చిన రైతులకు కల్పించిన ప్రయోజనాలను బట్టిచూస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బలవంత విధానాలు అనుసరించలేదని పేర్కొంది. అది రైతులకు లబ్ధిచేకూర్చే విధంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. భూసమీకరణ విధానం ఏకపక్షంగా ఉంది, రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారన్న పిటిషనర్ల వాదనలో పసలేదని పేర్కొంది. రాజధాని ప్రాంతం సంపన్నమైన వ్యవసాయక్షేత్రం అన్న వాదనలతో ట్రైబ్యునల్‌ ఏకీభవించలేదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం సాగుభూమితో పోలిస్తే అక్కడున్న వ్యవసాయభూమి కేవలం 0.027% మాత్రమేనని స్పష్టంచేసింది. అక్కడ సాగవుతున్న వరి 0.077% మాత్రమేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న నిర్మిస్తున్న పోలవరంతోపాటు మిగతా ప్రాజెక్టులు పూర్తయితే ఉన్న ఆయకట్టు స్థిరీకరణతోపాటు, కొత్తఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని వ్యాఖ్యానించింది. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత భారీగా పెరగడంతోపాటు రైతులపైకూడా సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. లంకభూముల నిర్వాసితుల ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చింది. పర్యావరణ ప్రభావ మధింపు సమయంలో బహిరంగ విచారణ జరగలేదన్న వాదనలను తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను బహిర్గతం చేసి అన్నివర్గాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే నోటిఫై చేసినట్లు  గుర్తుచేసింది. ల్యాండ్‌పూలింగ్‌ లేఅవుట్లనుకూడా వాటి యజమానులతో సంప్రదించిన తర్వాతే ఖరారుచేసినట్లు పేర్కొంది. భవిష్యత్తులో ప్రాజెక్టులు నిర్మించేవారే పర్యావరణ అనుమతులు తీసుకోవాలని పర్యావరణ ప్రభావ మధింపు ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పినందున వచ్చే 35 ఏళ్లలో భవనాలు నిర్మించేవారే నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. అందువల్ల ఈ ప్రాజెక్టు కేటగిరీ ఏ కింది (ముందస్తుగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం)కి రాదని స్పష్టంచేసింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చే ముందు  రాష్ట్ర పర్యావరణ ప్రభావ మధింపు అథారిటీ 90 ముందస్తు షరతులు విధించినట్లు గుర్తుచేసింది. భవిష్యత్తులోనూ రాజధానిప్రాంతంలో హరిత, స్వచ్ఛమైన పరిశ్రమలనుమాత్రమే అనుమతిస్తారు కాబట్టి గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టంచేసింది. రాష్ట్ర పర్యావరణ అనుమతుల మంజూరీ సమయంలో విధివిధానాలను అమలుచేస్తున్నారన్నడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. ఈకేసులో ప్రజావనరులను ఒక ప్రాజెక్టుకోసం తప్ప వాణిజ్య, ప్రైవేటు ప్రయోజనాలకోసమేమీ మళ్లించడంలేదని వ్యాఖ్యానించింది. ఆ ప్రాజెక్టు రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాలను కాపడుతుందని పేర్కొంది. అందువల్ల తమ దృష్టిలో ఇక్కడ ‘డాక్టరిన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ట్రస్ట్‌’ సూత్రం ఇక్కడ వర్తిందని పేర్కొంది. అయితే భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు తలెత్తకుండా చూడటానికి ముందుజాగ్రత్తగా కొన్ని షరతులు విధించడంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల పర్యవేక్షణకు రెండు కమిటీలు వేస్తున్నట్లు వెల్లడించింది.

అమరావతి నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణ కోసం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని జాతీయ హరితట్రైబ్యునల్‌ స్పష్టంచేసింది. ఇదివరకు పర్యావరణ అనుమతుల సమయంలో పర్యావరణ శాఖ విధించిన షరతులకు తోడు ఎన్‌జీటీ ఇప్పుడు కొన్ని కొత్తవి విధించింది.

* అమరావతి ప్రాంతంలో ఉన్న కుంటలు, జలాశయాలు, వరదనీటిపారుదల కాలువలు, వాటి మధ్య అంతర్‌సంబంధాన్ని యథాతథంగా ఉంచడానికి అనువైన ప్రణాళిక రూపొందించడానికి వీలుగా ప్రాజెక్టు ప్రతిపాదకులు జలభౌగోళిక పరిస్థితులపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలి. దానివల్ల ఉపరితల, భూగర్భజలాలను గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.

* పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే రాజధాని నగర ప్రాంతంలో వరద ప్రవాహ గతిని మార్చే కుంటలు, వరదనీటికాలువల నిర్మాణం చేపట్టాలి.

* నది, సహజ వరద నీటి ప్రవాహదిశ, గతుల్లో మార్పులుచేర్పులు చేయకూడదు. గమన వేగం పెరగడంవల్ల భూమి కోత, పూడిక విస్తీర్ణం పెరుగుతుంది. దానివల్ల భూమిలోకి నీటి రీఛార్జి తగ్గిపోతుంది. దీనివల్ల ఎండాకాలంలో (డ్రైసీజన్‌) ప్రాథమిక ప్రవాహం (బేస్‌ఫ్లో) తగ్గే అవకాశం ఉంటుంది.

* ఇప్పటికే ఉన్న కరకట్టల్లో ఎలాంటి మార్పుచేర్పులు చేయకూడదు. ఒకవేళ ఏదైనా అవసరమైతే రాజధాని నగరాన్ని వరదలనుంచి రక్షించడానికి వీలుగా కరకట్టలను బలోపేతం చేయడానికి అనుమతించవచ్చు. అదికూడా వరదశైలి, నదీప్రవాహం, కాలువల్లో వరదతీవ్రతపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాతే ఆ పని చేపట్టాలి.

* ఈ ప్రాంతంలో చేపట్టబోయే నిర్మాణపనులవల్ల పెద్దఎత్తున పోగయ్యే మున్సిపల్‌ వ్యర్థాలను ఎక్కడికక్కడ వేరుచేయాలి. బాక్టిరీయాతో నశింపజేయగల వ్యర్థాలను అక్కడే కంపోస్టుగానో, బయోమీథేన్‌గానో మార్చాలి.

*  వాన నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంకానీ, దాని అనుబంధసంస్థలుకానీ బిల్డింగ్‌ బైలాస్‌ నోటిఫై చేయాలి. అన్ని భవనాల్లో నీటిని పొదుపునకు దోహదపడే ఉపకరణాలు ఉండేలా చూడాలి. శుద్ధిచేసిన నీటిని మరుగుదొడ్లు, ఉద్యానవనాలు, వ్యవసాయం, పండ్లతోటల అవసరాల కోసం ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* పర్యావరణ అనుమతుల సమయంలో చెప్పినట్లుగా వాతావరణ మార్పుల ప్రభావంవల్ల పెరిగే కర్బన ఉద్గారాల తీవ్రతను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నగరంకోసం వచ్చే ఆరునెలల్లోపు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇందుకోసం రంగాలవారీగా స్పష్టమైన మార్గసూచి తయారుచేయాలి.
* కొండవీటివాగు పరీవాహక ప్రాంతంలోని అన్ని కొండలు, గుట్టలు, ఉపనదులు, ఇతర వరదనీటి ప్రవాహ కాలువలను ప్రక్షాళన చేయాలి. ఈ ప్రాంతంలో భూ, నీటి , అటవీ సంరక్షణ పనులు చేపట్టాలి. కొత్తగా మొక్కలునాటే కార్యక్రమాలు చేపట్టాలి. దీనివల్ల భూఉపరితలంపై ప్రవాహం తగ్గిపోయి భూగర్భజలాల రీఛార్జి పెరుగుతుంది.

* రాజధాని నగర ప్రాంతంలోకి వచ్చే 251 ఎకారాల అటవీభూమిని యథాతథంగా సంరక్షించి  నగర పచ్చదనం, పర్యావరణం కోసం ఉపయోగించాలి. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అటవీయేతర ప్రయోజనాలకోసం ఉపయోగించరాదు. ఒకవేళ పార్కు, ఇతర వినోదకార్యక్రమాలకోసం ఉపయోగించుకున్నా అది దాని సహజ గుణం చెడిపోతుంది. సహజ అడవులు అందించే వాతావరణం దెబ్బతింటుంది.

* పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈతీర్పులో నిర్దేశించిన అంశాల అమలు పర్యవేక్షణ కోసం రెండు కమిటీలను ఏర్పాటుచేశారు. అందులో 1. పర్యవేక్షణ కమిటీ, 2. అమలు కమిటీ.

పర్యవేక్షణ కమిటీ: కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అదనపు కార్యదర్శి దీనికి ఛైర్మన్‌గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణశాఖ అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెంబర్‌-కం-నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ, బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్లు నామినేట్‌ చేసిన ఇద్దరు సీనియర్‌ శాస్త్రవేత్తలు, ఏపీ కాలుష్యనియంత్రణ మండలి సభ్యకార్యదర్శి, సావిత్రిబాయి పూలే యూనివర్శిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జియాలజీ ప్రొఫెసర్‌ ఎన్‌జేపవార్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు.

అమలుకమిటీ: దీనికి ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణశాఖ అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర పర్యావరణవరణ, అటవీశాఖ, బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెన్‌ డైరెక్టర్‌ నామినేట్‌ చేసిన వ్యక్తులు, ఏపీ కాలుష్యనియంత్రణ మండలి సభ్యకార్యదర్శి, అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మైక్రోబయాలజీ మాజీ ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు కడియాల సభ్యులుగా ఉంటారు.

పర్యవేక్షణ కమిటీ: మూడునెలలకోసారి సమావేశమై ఈ తీర్పులో పేర్కొన్న ఆదేశాలతోపాటు, పర్యావరణ అనుమతుల సందర్భంగా విధించిన షరతుల అమలు తీరును పరిశీలించడంతోపాటు, విధానాలను ఖరారుచేయాలి.

అమలు కమిటీ: ప్రతి నెలా సమావేశమై పర్యావరణ షరతులు, పర్యవేక్షక కమిటీ ఖరారుచేసిన అంశాలు, ఈ తీర్పులోని ఆదేశాలు అమలవుతోన్నాయో లేదో చూడాలి. ఎప్పటికప్పుడు అది అన్ని విషయాలను క్రోడీకరించి నివేదిక రూపొందించాలి.

* డీపీఆర్‌, పర్యావరణ ప్రభావ మధింపు, పర్యావరణ అనుమతులమంజూరు ప్రక్రియలో పాల్గొన్నవారిని ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించకూడదు.

* 2015 మే 9న పర్యావరణ అనుమతుల మంజూరీసమయంలో నిర్దేశించిన షరతులు, ఈ తీర్పులో జారీచేసిన ఆదేశాలను ఎలాంటి జాప్యం, తప్పులు లేకుండా అమలుచేయాలి.

* అమరావతి నగర ప్రాజెక్టును ఈ కమిటీ సమగ్రంగా తనిఖీచేయాలి. దాంతోపాటు ప్రాజెక్టుపై ప్రభావం చూపే జలాలు, అడవులు, కాలువలు, చిత్తడినేలలు, పర్యావరణ ప్రభావాలన్నింటినీ సూక్ష్మంగా పరిశీలించాలి. ఒకవేళ అవసరమనిపిస్తే కమిటీ ప్రాజెక్టు ప్రతిపాదకులకు అమలుచేసేలా అదనపు షరతులు, ఆదేశాలు జారీచేయొచ్చు. వాటిని నిర్దిష్టగడువులోగా అమలుచేయడం ప్రాజెక్టు నిర్వహణదారుల బాధ్యత.

* ప్రతి ఆరునెలలకోసారి కమిటీ ట్రైబ్యునల్‌కు నివేదిక సమర్పించాలి. తొలి నివేదికను మాత్రం తీర్పు వెలువడిన మూడునెలల తర్వాత అందజేయాలి.

* పర్యావరణ క్షీణతను నిరోధించడానికి అనువైన సూచనలు, నియంత్రణ చర్యలను నిర్దేశించే స్వేచ్ఛ కమిటీకి ఉంటుంది.

* కమిటీ సంతృప్తికోసం ప్రాజెక్టు ప్రతిపాదకుడు రూ.5 కోట్ల బ్యాంక్‌గ్యారెంటీ సమర్పించాలి. ఒకవేళ ఏవైనా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ అయిదుకోట్లను నగదుగా మార్చుకొనే స్వేచ్ఛ కమిటీకి ఉంటుంది.

అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి కారణాలు:
1. పట్టణాభివృద్ధి నిపుణులు, ప్రజా సంస్థలు, ఆర్థిక, సామాజిక, పర్యావరణ నిపుణులను సంప్రదించి ప్రభుత్వం అమరావతిని రాజధాని ప్రాంతంగా గుర్తించింది. కొత్త రాష్ట్రానికి కేంద్రస్థానంలో ఉంది.

2. వరద ముంపునకు ఎలాంటి ఆధారాలూ లేవు. ఇస్రో మాజీ డైరెక్టర్‌ డి.డి.ప్రసాదరావు చెప్పిన మేరకు ఇది భూగర్భశాస్త్రపరంగా వరదముంపు ప్రాంతమే కానీ వాస్తవంగా ముంపు ప్రాంతం మాత్రం కాదు. వి.వి.శ్రీనివాస్‌, కె.రవి, డి.కాశీవిశ్వేశ్వర్‌రావుల కమిటీ ప్రకారం2009నాటి వరదసమయంలోనూ నీరు గట్టు దాటి రాలేదు. నదికి +25 మీటర్ల ఎత్తున కీలక నిర్మాణాలు చేపడుతున్నారు. నది ఒడ్డుకి, గట్టుకి మధ్య 100 నుంచి 300 మీటర్ల తటస్థ ప్రాంతం ఉంది.

3. మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన విధంగా చూస్తే కొండవీటివాగు పునరుద్ధరణ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వెడల్పు ఆరు మీటర్ల నుంచి 30 మీటర్లు పెరుగుతుంది. గ్రీన్‌ బఫర్‌ జోన్‌కు కేటాయించిన 1410 ఎకరాల్లో ఐదు నూతన కాలువలు ప్రతిపాదించారు. కొండవీటివాగు, పాలవాగులను స్థిరమైన పద్ధతిలో వినియోగించుకోనున్నారు. ప్రతిపాదిత జలాశయాలు భూగర్భజలాల పరిరక్షణకు తోడ్పడుతాయి.

4. లంకల్లో ఉన్న వారికి కూడా ల్యాండ్‌ పూలింగ్‌ పథకంలో భాగంగా పునరావాసం కల్పించనున్నారు.లంక ప్రాంతంలో ఉన్న వారి పట్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.

5. కొత్త రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలి. అందుకు ప్రతిపాదిత ప్రాంతాన్ని మించిన స్థలం కనిపించలేదు. అన్ని అంశాలూ పరిశీలించి ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది.

Link to comment
Share on other sites

జనవరి నుంచి అంకుర ప్రాంత అభివృద్ధి
ఈనాడు - అమరావతి
రాజధాని అమరావతిలోని అంకుర ప్రాంతంలో తొలిదశ ప్రాజెక్టు పనులను జనవరిలో ప్రారంభించనున్నారు. సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ (జేఐఎస్‌సీ) రెండో సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌ సారథ్యంలో శుక్రవారం సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగింది. అంకుర ప్రాంతంలో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సింగపూర్‌ సంస్థల కన్సార్టియానికి చంద్రబాబు నొక్కి చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారతదేశానికి ముఖ్యఅతిథిగా వస్తున్న సింగపూర్‌ ప్రధాని లీ హీంగ్‌ లూంగ్‌ అమరావతిని సందర్శించేలా చూడాలని కోరారు. ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాలు, విధానాలు అనుసరించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌-సింగపూర్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ముఖ్యాంశాలు ఇవీ...!
* వ్యవసాయ ఉత్పత్తులు చెడిపోకుండా కోల్డ్‌చైన్‌ టెక్నాలజీల అభివృద్ధిలో సహకారం.
* సింగపూర్‌లో ఎనిమిది మంది సిబ్బందితో అమరావతి భాగస్వామ్య కార్యాలయం (ఏపీఓ) ఏర్పాటు.
* అమరావతిలో కాలువలు, జలవనరుల్ని ప్రకృతి సిద్ధంగా అభివృద్ధి చేయాలని సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖూ టెంగ్‌ చె సూచన. యాక్టివ్‌, బ్యూటిఫుల్‌, క్లియర్‌ వాటర్స్‌ (ఏబీసీ) పేరుతో తాము అనుసరిస్తున్న విధానాలను వివరించిన ఖూ టెంగ్‌ చె. కాలువల బెడ్‌లను సిమెంటు చేయకుండా... సహజసిద్ధంగా ఉంచాలని, కొండవీటి వాగుకి కూడా ఇదే విధానం అనుసరించాలని సూచనకు ముఖ్యమంత్రి ఆమోదం.
* అమరావతి ప్లానింగ్‌ అండ్‌ డిజైన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు. ఇది సీఆర్‌డీఏలో భాగంగానే ఉన్నా, స్వతంత్ర సంస్థగా వ్యవహరించేలా చర్యలు. సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు.
* అంకుర ప్రాంతంలో తొలి దశలో అభివృద్ధి చేస్తే 656 ఎకరాల్లో దాదాపు 600 ఎకరాలు సిద్ధంగా ఉందని, 65 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకోవాలని వెల్లడించిన సీఆర్‌డీఏ అధికారులు.
* తొలిదశలో 8 లక్షల చ.అడుగుల టవర్‌ నిర్మాణం.
* అర్బన్‌ డిజైన్‌ గైడ్‌లైన్స్‌ అమలుపై చర్చ.
* ఎలక్ట్రిక్‌ వాహనాలకు అధిక ప్రాధాన్యమిస్తామని, త్వరలో 1500 ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశ పెడుతున్నామని సీఎం వెల్లడి
* సింగపూర్‌లోని మెరీనా బే తరహాలో రాజధాని పరిపాలన నగరంలో 20 లక్షల చ.అడుగుల్లో నిర్మించే భవనాలన్నింటికీ డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
* ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా ఒక నగరంలో ప్రయోగాత్మకంగా సౌరవిద్యుత్‌ని ఉపయోగించి బస్టాపుల్లో శీతలీకరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం సూచన.
* 2018 జులైలో తమ దేశంలో నిర్వహించే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని చంద్రబాబుకి సింగపూర్‌ ప్రతినిధుల ఆహ్వానం. ఈ సదస్సుని ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి నిర్వహించాలని కోరిన చంద్రబాబు.
* మానవవనరుల అభివృద్ధిలో సింగపూర్‌కి చెందిన లీ క్వాన్‌ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేయాలని ప్రతిపాదన.
* ‘స్టేట్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో సింగపూర్‌ యూనివర్సిటీ తీసుకువస్తున్న పుస్తకంలో అమరావతి నిర్మాణాన్ని ఒక అధ్యాయంగా చేర్చాలని సూచించినట్టు సింగపూర్‌ రాయబారి గోపీనాథ్‌ పిళ్లై వెల్లడి.

సచివాలయాన్ని సందర్శించిన ఈశ్వరన్‌
జేఐఎస్‌సీ సమావేశం మొదలవడానికి ముందు ఈశ్వరన్‌ సారథ్యంలోని సింగపూర్‌ ప్రతినిధుల బృందం సచివాలయాన్ని, శాసనసభను సందర్శించింది. ముఖ్యమంత్రి స్వయంగా తీసుకెళ్లి వారికి భవనాలను చూపించారు. సింగపూర్‌ ప్రభుత్వ, వాణిజ్య, విదేశాంగ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్‌ తరపున మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, లోకేష్‌, ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ఐకానిక్‌ వారధికి టెండరు జారీ
ఈనాడు అమరావతి: కృష్ణా జిల్లాలోని పవిత్ర సంగమం నుంచి అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై ఐకానిక్‌ వారధి నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ శుక్రవారం ఈపీసీ విధానంలో టెండరు ప్రకటన జారీ చేసింది. అంచనా వ్యయం రూ.1,434 కోట్లు. 3.2 కి.మీ.ల పొడవున ఆరు వరుసలుగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఇది పవిత్ర సంగమం వద్ద మొదలై అమరావతిలో పరిపాలన నగరానికి సమీపంలోని ఎన్‌10 రహదారిని అనుసంధానిస్తుంది. వంతెన సర్వే, ఇతరత్రా పరిశీలనలు, ఆకృతుల రూపకల్పన, నిర్మాణంతో పదేళ్ల నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారు సంస్థదే. ఈ నెల 20 నుంచి ఏపీ ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ నుంచి టెండరు పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ఏడీసీ తెలిపింది. బిడ్‌ల దాఖలుకి డిసెంబరు 18 తుది గడువు.

Link to comment
Share on other sites

100 మీటర్లలోపు ఉంటే సీఎం భవనాన్నీ తొలగిస్తాం
ఈనాడు అమరావతి: కృష్ణా నదికి, కరకట్టకు మధ్య ఉన్న భవనాల్లో... ప్రవాహ మార్గం నుంచి 100 మీటర్ల లోపు ఉన్న వాటిని తొలగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. వాటిలో ముఖ్యమంత్రి నివసిస్తున్న భవనం కూడా ఉంది కదా? అని ప్రశ్నించినప్పుడు... ఆ భవనం 100 మీటర్లలోపు ఉంటే తొలగించమని ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పారని, హరిత ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చినందున ఇక చర్యలు ప్రారంభిస్తామని సమాధానమిచ్చారు. రాజధానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ వేసిన కేసుల్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తోసిపుచ్చడం రాష్ట్రానికి శుభవార్తగా పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతికి ‘పచ్చ’జెండా
18-11-2017 07:11:44

    పర్యావరణ అనుమతుల రద్దుకు నో
    సంబంధిత పిటిషన్లను కొట్టేసిన ఎన్‌జీటీ
    నిబంధనలు, తీర్పునకు లోబడే నిర్మాణాలు
    నదులు, కాలువల దిశ మార్చరాదు
    అటవీ భూముల రూపాంతరం కుదరదు
    పార్కులు, వినోదాలకు కూడా మార్చరాదు
    ప్రభుత్వం రూ.5 కోట్ల పూచీకత్తు ఇవ్వాలి
    నిబంధనలపై నిపుణులతో 2 కమిటీలు
    4 పిటిషన్లపై 145 పేజీల సుదీర్ఘ తీర్పు
    వెలువరించిన జస్టిస్‌ స్వతంత్రకుమార్‌

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) పచ్చజెండా ఊపింది. రాజధానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ బొలిశెట్టి సత్యనారాయణ, ఈఏఎస్‌ శర్మ, పండలనేని శ్రీమన్నారాయణ వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు ట్రైబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌, జస్టిస్‌ రాఘవేంద్ర ఎస్‌.రాథోడ్‌, నిపుణుడు-సభ్యుడు బిక్రమ్‌ సింగ్‌ సజ్వాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం 145 పేజీల తీర్పు వెలువరించింది.
 
పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నోటిఫికేషన్‌-2006 ప్రకారం.. రాజధాని అభివృద్ధి అనేది కేటగిరీ 8బీ కిందకే వస్తుందని, కాకపోతే అందులోని నిబంధనలకు అదనంగా మరికొన్నిటిని చేర్చాల్సి ఉందని పేర్కొంది. రాజధాని నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌, గుంటూరు ప్రభాకర్‌, గుంటూరు ప్రమోద్‌ వాదించారు. రాజధాని ఎంపిక మొదలు అన్ని అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలను, నిర్మాణంలో రైతుల భాగస్వామ్యం ఉండడం, రాజధానికి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సి ఔన్నత్యం, పర్యావరణాన్ని కాపాడేందుకు నూతన పరిజ్ఞాన సాయంతో తీసుకున్న చర్యలు, పర్యావరణ అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తీర్పు చెప్పారు. రాజధాని నిర్మాణంలో కమిటీల బాధ్యతలు, పరిధులను స్పష్టంగా తెలియజేసింది. తీర్పులో పేర్కొన్న అంశాలివీ..
 
పర్యావరణ అనుమతుల్లో ఉండాల్సిన నిబంధనలు..

    రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఉన్న చెరువులు, రిజర్వాయర్లు, వర్షపు నీటి డ్రెయిన్ల నిర్మాణం మొదలైనవాటి నిర్వహణపై సమగ్ర అధ్యయనం చేయాలి.
    వర్షపు నీటి కోసం ప్రత్యేకంగా నిర్మించే డ్రైనేజీల నిర్మాణం, చెరువులకు అడ్డుకట్ట వేయడం వంటివి తప్పనిసరిగా అధ్యయనం చేసే చేయాలి.
    ప్రాజెక్టు పరిధిలో ఉండే నదులు, కాలువల ద్వారా సహజంగా లభించే నీటి లభ్యతలో మార్పు రానివ్వకూడదు.
    కొండవీటి వాగు, కాలువల పరిరక్షణకు చర్యలు
    రాజధాని ప్రాంతంలోని 251.77 హెక్టార్ల అటవీ భూములను అలాగే కొనసాగనివ్వాలి.

 
కమిటీల బాధ్యతలు ..

    పర్యవేక్షక కమిటీ ప్రతి మూడు నెలలకోసారి భేటీ అవ్వాలి.
    ప్రాజెక్టులోని అన్ని పాలసీలు పర్యావరణ అనుమతులు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీర్పుకు లోబడే ఉండాలి.
    అమలు కమిటీ ప్రతి నెలా సమావేశమవ్వాలి. పర్యవేక్షక కమిటీ ఇచ్చే మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలి.
    కమిటీలు ప్రతి ఆరునెలలకోసారి ప్రాజెక్టుపై నివేదికను ఎన్‌జీటీకి అందజేయాలి.

 
ఆరుగురితో పర్యవేక్షక కమిటీ
కమిటీ చైర్మన్‌గా పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి ఉంటారు. నోడల్‌ అధికారిగా ఏపీ పర్యావరణ శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ ఉంటారు. రూర్కీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ నామినేట్‌ చేసే సీనియర్‌ శాస్త్రవేత్త, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) నామినేట్‌ చేసే శాస్త్రవేత్త, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్‌ ఎన్‌.జే.పవార్‌ సభ్యుడిగా ఉంటారు.
 
ఐదుగురితో అమలు కమిటీ
దీని చైర్మన్‌గా ఏపీ పర్యావరణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. కేంద్ర పర్యావరణ శాఖ ప్రతినిధి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి, ఐఐఎస్‌సీ-బెంగళూరు డైరెక్టర్‌ నియమించే సీనియర్‌ శాస్త్రవేత్త మొదటి, రెండు, మూడో సభ్యుడిగా ఉంటారు. నాలుగో సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి చెందిన రిటైర్ట్‌ మైక్రో బయాలజి ప్రొఫెసర్‌ కడియాల వెంకటేశ్వర్లును ఎన్‌జీటీ నియమించింది.

Link to comment
Share on other sites

     

రాజధానికి ‘డబుల్‌ ధమాకా’
18-11-2017 07:06:11

    ఒకేరోజు రెండు సానుకూల నిర్ణయాలు
    అమరావతి వ్యతిరేక పిటిషన్ల కొట్టివేత
    సింగపూర్‌ సహకారంపై మలివిడత చర్చలు
    ఇక నిర్మాణం వేగిరం: ముఖ్యమంత్రి

అమరావతి: రాజధాని నిర్మాణం దిశగా రాష్ట్రప్రభుత్వానికి శుక్రవారం ఒకే రోజు రెండు శుభవార్తలు అందాయి. ఒకపక్క అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ ప్రభుత్వ సహకారాన్ని మరింతగా పెంచేందుకు తోడ్పడే కీలక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఈశ్వరన్‌తో చర్చిస్తున్న తరుణంలోనే.. రాజధాని నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను తోసిపుచ్చుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీర్పు వెలువరించింది. అనుకున్న విధంగా అమరావతి సత్వర నిర్మాణానికి ఈ పరిణామాలు ఎంతగానో దోహదం చేస్తాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌ బృందంతో జరిగిన సమావేశంలో ఆనందంగా వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలపై పురపాలక మంత్రి, సీఆర్‌డీఏ ఉపాధ్యక్షుడైన పి.నారాయణ, రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటున్న సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులు, అమరావతికి భూములిచ్చిన రైతులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో విలేకరులతో నారాయణ మాట్లాడారు.
 
ఈ శుక్రవారం అమరావతి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అటు సింగపూర్‌తో మైత్రీబంధం మరింత దృఢతరమవడం, ఇటు అమరావతి నిర్మాణంపై కనీసం కొందరిలోనైనా సరే ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎన్‌జీటీ తీర్పు ఇవ్వడం రాజధానికి శుభసూచికలుగా అభివర్ణించారు. కృష్ణానది ప్రవాహ గతికి ఆటంకం కలిగిస్తున్నారని, ఫ్లడ్‌ ప్లెయిన్స్‌కు విఘాతం సృష్టిస్తున్నారని, నిర్మాణాలకు ఏమాత్రం అనుకూలంగా లేని ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నారని, వేల ఎకరాల పంటభూములను అమరావతి కోసం తీసుకోవడం ద్వారా ఆహారభద్రతకు ముప్పు తెస్తున్నారని.. ఇలా పలు ఆరోపణలతో కొందరు అవరోధాలు కలిగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వారి యత్నాలకు గతంలో సుప్రీంకోర్టు, ప్రస్తుతం ఎప్‌జీటీ తీర్పు చుక్కెదురైందన్నారు. పర్యావరణానికి ఏమాత్రం హాని కలుగని రీతిలో రాజధాని నిర్మాణ ప్రక్రియను చేపడతామని పునరుద్ఘాటించారు.
 
ఇవి చేయబోతున్నాం..
1691 ఎకరాల్లో సీడ్‌ కేపిటల్‌ను అభివృద్ధిపరచనున్న సింగపూర్‌ కన్సార్షియం..ఎంవోయూ కుదిరిన తర్వాత గత 6 నెలల్లో ఆ దిశగా పకడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తోందని నారాయణ తెలిపారు. తొలి విడతగా 8 లక్షల చదరపు అడుగుల నుంచి 10 లక్షల చ.అ. విస్తీర్ణముండే భారీ భవనాన్ని నిర్మించడం ద్వారా రాజధాని జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలకు కేంద్రంగా మారేలా చేస్తుందన్నారు. మొదటి దశలో 565 ఎకరాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తుందని, అందులోని ప్లాట్లను ప్రముఖ సంస్థలకు విక్రయించడం ద్వారా అమరావతికి గణనీయ ఆదాయం సమకూరుతుందని చెప్పారు.
 
సింగపూర్‌ కన్సార్షియం ఇప్పటికే విజయవాడలో తమ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుందని గుర్తుచేశారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి పనులు 10 రోజుల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. రాజధానిలో ప్రధాన రహదార్ల టెండర్ల ప్రక్రియలో ఇప్పటికి దాదాపు 70 శాతం పూర్తయిందని, వర్షాలు ఆగడంతో డిసెంబరుకల్లా నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్లు పొందిన సంస్థలు సమాయత్తమవుతున్నాయని పేర్కొన్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును పూర్తి చేసేందుకు కొన్ని గ్రామాల్లో అడ్డుగా ఉన్న (పూలింగ్‌కు ఇవ్వని) భూములను భూసేకరణ చట్టం కింద తీసుకునే ప్రక్రియలోని దాదాపు అన్ని దశలూ పూర్తయ్యాయని చెప్పారు.
 
మా వాదనలో బలముంది..
ఎన్‌జీటీ తమ పిటిషన్లను కొట్టివేసినా..తీర్పులోని కొన్ని అంశాలు తమ వాదనలో బలముందన్న విషయాన్ని చాటాయని కొందరు పిటిషనర్లు పేర్కొన్నారు. కృష్ణానదీ పరివాహకప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నివాస, కమర్షియల్‌ కట్టడాలను నిర్మించరాదని, నదితోపాటు కొండవీటివాగు తదితర ప్రవాహాల దిశ, దశలను మార్చే చర్యలకు పాల్పడరాదని, దాదాపు అన్ని పనులను చేపట్టేముందు అవి పర్యావరణంపై చూపే ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలనడాన్ని వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
 
రాజధానిలో చేపట్టే నిర్మాణాలు నిర్దేశిత పర్యావరణ నియమనిబంధనలకు అనుగుణంగానే సాగుతున్నాయో, లేదో గమనించేందుకు రెండు నిపుణుల కమిటీల ఏర్పాటు.. వాటి నివేదికలను తనకు క్రమం తప్పకుండా పంపాలని ఎన్‌జీటీ పేర్కొందని అంటున్నారు. తద్వారా తాము లేవనెత్తిన అభ్యంతరాల్లో సహేతుకత ఉందన్న విషయాన్ని ఎన్‌జీటీ పరోక్షంగా అంగీకరించిందని వ్యాఖ్యానిస్తున్నారు.
 
తాడేపల్లి అటవీ బ్లాక్‌పై శరాఘాతం!
ఎన్‌జీటీ తీర్పులో ఉన్న ఒక అంశం అధికార వర్గాలకు మింగుడు పడడం లేదు. ఇటీవలే డైవర్షన్‌ (మళ్లింపు) జరిగిన గుంటూరు జిల్లా తాడేపల్లి అటవీ బ్లాక్‌ (251.77 హెక్టార్లు)లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ సహా పలు ప్రపంచస్థాయి ఆర్ధిక సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సీఆర్‌డీఏ ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో ఆ భూములను ఏ విధంగానూ మార్చరాదని తాజా తీర్పులో ఆదేశించడం ఊహించని శరాఘాతమేనని అంటున్నారు. రాజధానికి ‘ఆక్సిజన్‌ చాంబర్‌’లాగా ఉపయోగపడాల్సి ఉన్నందున తాడేపల్లి అటవీబ్లాక్‌ను ముట్టుకోరాదని ఎన్‌జీటీ ఆదేశించింది.

Link to comment
Share on other sites

ప్రతిష్టాత్మక ఐకానిక్‌ బ్రిడ్జికి టెండర్లు
18-11-2017 07:15:02

    1,434 కోట్ల అంచనా
    అమరావతికి మకుటాయమానం
    నిర్మాణ సంస్థకే 10 ఏళ్లు నిర్వహణ బాధ్యత

అమరావతి: రాజధానికి మణిమకుటంలా భాసిల్లనున్న ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. రాయపూడి- లింగాయపాలెంల మధ్య, ఎన్‌-10 రహదారిని కృష్ణానదికి ఆవలి వైపున ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్రసంగమ ప్రదేశానికి అనుసంధానిస్తూ నిర్మించదలచిన ఈ బ్రిడ్జికి రూ.1434.26 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. 6 వరుసలతో, 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మితమయ్యే ఈ వంతెనకు సంబంధించిన సర్వే పనుల నుంచి డిజైన్‌ రూపకల్పన, నిర్మాణం వరకూ టెండర్లు పొందిన సంస్థే బాధ్యత తీసుకోవాలి.
 
‘ఈపీసీ (ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌)’ విధానంలో నిర్మించే ఈ వంతెన పూర్తయిన తర్వాత 10 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యతలను కూడా అదే సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 18వ తేదీ వరకూ గడువునిచ్చారు. ప్రస్తుతం అమరావతికి ఏ జాతీయ రహదారితో నేరుగా అనుసంధాన సౌకర్యం లేని పరిస్థితుల్లో ఈ ఐకానిక్‌ బ్రిడ్జి పనులను త్వరలోనే చేపట్టేందుకు వీలుగా టెండర్‌ను ఆహ్వానించారు.
 
చెన్నై- కోల్‌కతా హైవేను రాజధానికి కలిపే సీడ్‌యాక్సెస్‌ రోడ్డు భూసేకరణ సమస్యతో అసంపూర్తిగా మిగిలిపోవడం, విజయవాడ బైపాస్‌లో భాగంగా వెంకటపాలెం వద్ద కృష్ణానదిపై వస్తుందనుకున్న వంతెన ఆగిపోవడంతో, అమరావతికి దాని చుట్టూ ఉన్న జాతీయ రహదారులతో అనుసంధానం ఎప్పుడు కలుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఐకానిక్‌ బ్రిడ్జిని సాధ్యమైనంత త్వరగా చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...