Search the Community
Showing results for tags 'andhra pradesh govt'.
-
‘రియల్’ గవర్నెన్స్! 26-11-2017 02:20:28 రియల్ టైమ్ గవర్నెన్స్ రాష్ట్ర కేంద్రం సిద్ధం ఇకపై కీలక నిర్ణయాలన్నీ ఇక్కడి నుంచే శాఖల పనితీరు, సమాచార విశ్లేషణ ప్రతిరోజూ గంటసేపు గడపనున్న సీఎం ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ తనిఖీలు ఈ కేంద్రంతో 20 వేల సీసీ కెమెరాలు అనుసంధానం నేడు ఆర్టీజీ రాష్ట్ర కేంద్రాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పాలనలో వేగాన్ని పెంచేందుకు.. ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు.. ఓ ప్రత్యేక కార్యస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ‘రియల్ టైమ్ గవర్నెన్స్ రాష్ట్ర కేంద్రం’గా పేర్కొనే ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో కూర్చొని.. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించవచ్చు. రాష్ట్రంలో ఎవరితోనైనా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడవచ్చు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి పనితీరును.. 1100కు వస్తున్న ఫిర్యాదులను.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను.. ఇలా ప్రతి సమాచారాన్ని విశ్లేషించే వెసులుబాటు ఇక్కడ ఉంది. కేవలం విశ్లేషణలతో సరిపెట్టకుండా దానికి అనుగుణంగా అవసరమైన నిర్ణయాలూ తీసుకుంటారు. స్వయం గా సీఎం చంద్రబాబు నిత్యం ఒక గంటసేపు ఈ కేంద్రంలో గడపనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం అత్యవసర సమయాల్లో 24 గంట లూ పనిచేస్తుంది. ఇక్కడ నిరంతరం పనిచేసేందుకు, వచ్చిన సమాచారాన్ని, అభిప్రాయాలను, సమస్యలను విశ్లేషించేందుకు 40 మంది సాంకేతిక నిపుణులు ఉంటారు. ఆకస్మిక తనిఖీలూ ఆన్లైన్లోనే! రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ) రాష్ట్ర కేంద్రం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ కార్యాలయంలో కూర్చొనే రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించే వెసులుబాటు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 20 వేల సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా పెద్ద ఉత్సవాలు, భారీ ఊరేగింపులు, ఆందోళనలు ఏది జరిగినా అక్కడి ట్రాఫిక్ను, పరిస్థితిని ఇక్కడి నుంచి చూసి అంచనా వేసి నియంత్రించేలా ఏర్పాట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత ఎలా ఉందన్న విషయాన్ని అక్కడ ఉన్న సీసీ కెమెరాల సాయంతో ఈ కేంద్రం నుంచి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకస్మిక తనిఖీల నిర్వహించేందుకు ఇకపై సీఎం జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడి పరిస్థితిని అప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. ఒక జిల్లాకు, ఒక నగరానికి, కొన్ని గ్రామాలకు సంబంధించి ఒక అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే.. ఆయా ప్రాంతాలకు కాల్ సెంటర్ నుంచి తక్షణం ఫోన్ చేయించి వారి అభిప్రాయాలను తీసుకుని ఇక్కడ విశ్లేషిస్తారు. అత్యధికుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటారు. సీఎం ఇక్కడి నుంచే నేరుగా జిల్లా నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు అందరితో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించవచ్చు.