తూర్పు ‘ప్రకాశం’... ధాన్య ప్రసాదం... పట్టిసీమతో కరవు సీమకు గోదావరి జలాలు పర్చూరు, చీరాల రైతుల్లో పెరిగిన సాగు ఉత్సాహం ఎకరాకు 50 బస్తాలు పండిస్తున్న రైతులు ఈనాడు డిజిటల్- ఒంగోలు
కృష్ణమ్మ నుదుటన గోదారమ్మ పచ్చబొట్టు పెట్టింది... పట్టిసీమ రూపంలో రెండు నదుల కలయికతో కరవు సీమకు కొత్త కళ వచ్చింది... ఫలితంగా కరవు జిల్లాలో వరికి వూపిరి వచ్చింది... కృష్ణా జలాలే ఆధారంగా ఉన్న కొమ్మమూరు కాలువకు నీళ్లు వస్తుండడంతో ప్రకాశాన ధాన్యాగారం నిండుతోంది.
తెలుగునాట అన్నపూర్ణగా పేరొందినవి గోదావరి జిల్లాలు... ఎకరానికి 50 నుంచి 60 బస్తాల దిగుబడితో ఏటా 25 లక్షల టన్నుల వరిని ఆ రెండు జిల్లాలే అందిస్తాయి. దీనికి కారణం గోదారమ్మ చెంతన ఉండడమే. సిరులనిచ్చే భూములున్నా ప్రకాశాన జలధారలే కరవయ్యాయి. అందుకే ఏటా సేద్యంపై నిరాసక్తతో రైతులు కమతాన్ని వీడుతున్నారు. కానీ పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల కొత్త ఆశలు మొలకెత్తాయి. నిరుడు సాగు మధ్యలో పట్టిసీమ నీళ్లు అందడంతో పర్చూరు, చినగంజాం, చీరాల, కారంచేడు ప్రాంతాల్లో అక్కడక్కడా సాగు వేశారు. వేసిన కొద్దిచోట్ల కూడా మంచి ఫలితాన్ని రాబట్టారు. అదే ఉత్సాహంతో ఈ ఏడాది ఈ కాలువ పరిధిలో 45 వేల ఎకరాల మేర సాగుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ చేలు కీలకదశకు చేరుకున్నాయి.
గత ఫలితాలు ఇలా...! గత మూడేళ్లుగా కరవు కారణంగా కృష్ణా జలాలు అందలేదు. ఫలితంగా వరి వేయాల్సిన పొలాలను రైతులు బీడుగా వదిలేశారు. అందుకే జిల్లాలో 2015-16, 2016-17లో వరి సాగు 75 శాతం లోపే ఉంది. దీంతో వరి ఉత్పత్తి కూడా తగ్గింది. ఖరీఫ్ చివరి సమయానికి పట్టిసీమ నీరు అందడంతో అక్కడక్కడా సాగు పెరిగి ఫలితాలు మెరుగయ్యాయి. గత ఏడాది ఖరీఫ్, రబీల్లో వరికి ఆ నీరు వూపిరి పోసింది.
వరికి వూపిరి అదే...! జిల్లాలో వరికి వూపిరి పోసేది కృష్ణా డెల్టా ప్రాంతమే. ఈ ఏడాది సకాలంలో పట్టిసీమ నీరు అందే పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో శతశాతం నాట్లు పడ్డాయి. సెప్టెంబరు రెండో వారంలో నాట్లు ప్రారంభమవడంతో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పైరు ఏపుగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా డెల్టా పరిధిలో శత శాతం నాట్లు పడడం ఇదే తొలిసారి. జిల్లాలో వరికి వూపిరి పోసే చినగంజాం, చీరాల, పర్చూరు, వేటపాలెం, కారంచేడు మండలాల్లో సాగు ఆశాజనకంగా ఉండడంతో రైతులు, అధికారులు ఉత్సాహంగా ఉన్నారు. గత ఏడాది ఈ ప్రాంతాల్లో పట్టిసీమ నీరు కారణంగా 45 బస్తాలు పండింది. జిల్లాలో సగటున ఎకరాకు 35 నుంచి 40 బస్తాలే దిగుబడి వచ్చేది. కానీ గోదారి జలాల ప్రభావం, రైతుల నిరంతర శ్రమతో గత ఏడాది 40 బస్తాలు సాధించారు. ఈ ఏడాది ఈ 24 వేల హెక్టార్లలోనూ ఎకరాకు సగటున 47 బస్తాలు పండుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చినగంజాంతో పాటు, అక్కడక్కడా నీటి లభ్యతకు ఇబ్బంది లేకుండా ఎత్తిపోతల ద్వారా కూడా నీటిని మళ్లిస్తున్నారు. కేవలం కాలువలనే నమ్ముకోకుండా రైతులు ప్రధాన కాలువ నుంచి నీటిని మోటార్లతో తోడుకుంటున్నారు.
తొలిసారిగా సకాలంలో...! మూడు దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్నాను. గడిచిన కొన్నేళ్లలో కరవు కారణంగా నీటి కోసం తీవ్రంగా శ్రమించాం, ఇక సాగు చేయలేం అనుకునే సమయానికి పట్టిసీమ నీరు అందింది. గత ఏడాది మంచి దిగుబడులు సాధించాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సకాలంలో పూర్తిస్థాయిలో నాట్లు వేశాం. ఇప్పుడు చేలు కీలక దశలో ఉన్నాయి.
- కె. బాలకోటయ్య, రైతు, చినగంజాం
50 బస్తాలు వస్తాయి...! మా ప్రాంతంలో 2013 నుంచి 2015 వరకు వ్యవసాయాన్ని పక్కన పెట్టాం. ఇక సేద్యం కష్టమే అనుకున్న సమయంలో గత ఏడాది పట్టిసీమ జలాల కారణంగా 40, 45 బస్తాలు పండాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి పట్టిసీమ ద్వారా నీరు అందడంతో సెప్టెంబరు రెండోవారానికి నాట్లు వేసేశాం. నీటి కోసం ఎదురు చూడాల్సిన పని తప్పింది. ఇప్పుడు 50 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం.
- వెంకట ప్రసాద్, రైతు, పెదగంజాం