దక్షిణ కోస్తాకు తీవ్ర వాయు‘గండం’ శనివారం నుంచి భారీ.. అతిభారీ వర్షాలు 6 మీటర్ల ఎత్తులో అలలు..
ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాకు తీవ్ర వాయుగుండం పొంచి ఉంది. దీని కారణంగా ఈ నెల 15 నుంచి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం అలాగే కొనసాగుతోందని.. దానికి అనుబంధంగా 5.8 కి.మీ.ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది మరింత తీవ్రమై.. తదుపరి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి.. దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది. గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.
అల్లకల్లోలంగా సముద్రం.. తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఇన్కాయిస్ సూచించినట్లు విపత్తు నిర్వహణ శాఖ, ఆర్టీజీఎస్ వర్గాలు వెల్లడించాయి. ‘నెల్లూరు జిల్లా దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువా వరకూ అలలు 3 నుంచి 6.5 మీటర్ల వరకు ఎగసి పడతాయి. తీరం వెంట 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ నెల 14 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని’ హెచ్చరికలు జారీ చేశాయి.